ఈ  కాఫ్‌ సిరప్‌ను ఇంట్లోనే తయారు  చేసుకోవచ్చు

11 Feb, 2023 02:54 IST|Sakshi

కొంతమందికి వర్షాకాలం వస్తే చాలు... జలుబు, దగ్గు, కఫం. ఇంకొందరికి చలికాలంలో ఈ బాధలు వస్తాయి. అయితే ఈ కాలం ఆ కాలం అని కాకుండా కొందరు ఎప్పుడూ ఖంగ్‌ ఖంగ్‌... హాచ్ ∙హాచ్  ... అని అంటూ ఉంటారు. నానా విధాలైన దగ్గు మందులు, రకరకాలైన టాబ్లెట్లు వాడినా కొద్ది రోజులకే సమస్య షరామామూలే! అయితే, ఛాతీలో పట్టిన కఫం పోయి, దానివల్ల వచ్చే దగ్గు తగ్గడానికి ఆయుర్వేదం మంచి చిట్కాను చెబుతోంది. దీన్నిపాటించడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు. పైగా ఇందులో అన్ని సహజమైనవే వాడతాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ ఆయుర్వేద మందును తయారు చేసుకోవచ్చు. 

 ఏం చేయాలంటే ... ఈ మందును తయారు చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలే అంటే వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, పుదీనా, తులసి వంటివి సరిపోతాయి. ఇంతకూ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. 

స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు వేడెక్కుతున్నప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే పది మిరియాలు, పది లవంగాలు, చిన్న అల్లం ముక్కను కూడా బాగా దంచి అందులో కలిపి మరిగించాలి. చివర్లో ఆరు తులసి ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికడు పసుపు వేసి మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక కషాయంలా తయారవుతాయి. స్టవ్‌ మీదినుంచి దించి గోరువెచ్చగా మారాక వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని కాఫీ తాగుతున్నట్టు సిప్‌ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ఛాతీలోని కఫం వదులుతుంది. 

కఫంతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులుపాటు ఈ కషాయాన్ని రోజూ తాగాలి. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ ఉత్తమమైనవే. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కఫం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా కా΄ాడుతుంది. దీని రుచి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా తాగించవచ్చు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు.  ఈ కషాయాన్ని ఫ్రిజ్‌లో దాచుకొని మళ్ళీ వేడి చేసుకొని రెండు, మూడు రోజులపాటు తాగకూడదు. అలా చేయడంవల్ల అది ప్రభావవంతంగా పనిచేయదు.

మరిన్ని వార్తలు