మితిమీరిన కషాయాలు కాల్చేస్తాయి.. సూర్యరశ్మి తగలాల్సిందే

27 Apr, 2021 10:03 IST|Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కషాయాలు అదే పనిగా తాగడం కూడా మంచిది కాదు. దీనివల్ల గ్యాస్ట్రెయిటిస్, పొట్టలో ఇరిటేషన్‌ రావచ్చు. అందువల్ల వీటిని సరిపడినంతగా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. కాస్త కారం, ఘాటుగా ఉండాలి కానీ మరీ ఘాటు పనికిరాదు. అలాగే రోజులో ఎక్కువసార్లు తీసుకుంటే అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. గ్యాస్‌ సమస్య ఉన్న వారికి ఆ సమస్య మరింత పెరుగుతుంది. పలుచగా 150 ఎం.ఎల్‌ నుంచి 200 లోపు పరిమాణంలో సరిపోతుంది. పుదీనా, మునగాకు, అల్లం, మిరియాలు.. తదితరాలతో రకరకాలుగా చేస్తున్నారు. ఏదైనా మన శరీరానికి సరిపడేట్టుగా ఉండాలి.  

కరోనా తీవ్రతను బట్టి ప్రొటీన్‌ అవసరం 
ఇక ఆహారం విషయానికొస్తే.. సాధారణంగా మనిషి ఎత్తు, బరువును బట్టి ఒక కిలోకి 0.75 గ్రాము నుంచి 1 గ్రాము ప్రొటీన్‌ సరిపోతుంది. ఉదాహరణకు ఒకవ్యక్తి 170 సెం.మీ. ఎత్తు ఉంటే 70 కిలోల బరువు ఉండాలి. ఎత్తు, బరువును పరిగణనలోకి తీసుకుని ఇతనికి 70 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. అలాగని 80 కిలోలు ఉంటే 80 గ్రాముల ప్రొటీన్‌ అవసరం లేదు. వాళ్ల ఐడియల్‌ బాడీ వెయిట్‌ ఎంతో అంత ఇస్తే చాలు.

సూర్యరశ్మి తగలాల్సిందే.. 
రోజులో కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల డి విటమిన్‌ లోటు తీరుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు, ఉప్పు, మసాలాలు ఆహార సమతుల్యతను దెబ్బతీస్తాయి. 

కొత్త సెల్స్‌కు జింక్‌ 
కరోనా సహా ఏ అనారోగ్యం కారణంగా అయినా సరే ధ్వంసమైన కణాల స్థానంలో కొత్త కణాలు తయారవాలంటే జింక్‌ చాలా అవసరం. పిస్తా, బాదం, జీడిపప్పు, పల్లీలు, గుమ్మడి గింజలు, ఫ్లాక్‌ సీడ్స్‌ నుంచి జింక్‌ ఎక్కువగా లభిస్తుంది. అలాగే మొలకెత్తిన గింజల్లో కూడా జింక్‌ తగినంత ఉంటుంది.   

చదవండి: కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?

మరిన్ని వార్తలు