ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో తెలుసా..

2 Sep, 2020 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ: తిండి కలిగితే కండ కలదని, కండ కలిగిన వాడే మనిషనే సామెత మనకు తెలిసిందే. కానీ ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాగా దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్‌ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచికరంగా ఉండడంతో అధికంగా ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ముడి బియ్యం(దంపుడు బియ్యం లేదా పాలిష్‌ పట్టని బియ్యం). ఈ మధ్య కాలంలో ప్రకృతి వైద్య నిపుణులు వినియోగంపై ఈ బియ్యంపై ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు నిజముందో తెలుసుకుందాం.

ఉదాహరణకు 100 గ్రాముల ముడి య్యం తీసుకుంటే 1.8గ్రాముల ఫైబర్‌ లభిస్తుంది. అదేవిధంగా తెల్ల బియ్యాన్ని పాలిష్‌ చేయడం వల్ల కేవలం 0.4గ్రాముల ఫైబర్‌ మాత్రమే లభిస్తుంది. తెల్ల బియ్యం నిరంతరం తీసుకుంతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందక పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ముడి బియ్యంలో అధిక శాతం యాంటి న్యూట్రియెంట్స్‌, ఫైటిక్ యాసిడ్‌, ఆర్సెనిక్‌లు (విష రసాయనం) ఉంటాయి. ఎక్కువ శాతం ముడి బియ్యాన్ని తీసుకోవడంతో యాంటీ న్యూట్రియెంట్స్ వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు ఇబ్బందులు కలిగిస్తాయి.

అధికంగా ముడి బియ్యం తీసుకోవడం వల్ల  ఆర్సెనిక్‌ విషరసాయనం ముప్పు ఉంటుంది. మన శరీరంలో అధికంగా ఆర్సెనిక్‌ చేరడం వల్ల క్యాన్సర్‌, టైప్‌ 2 డయాబెటిస్‌ తదితర జబ్బులు వస్తాయి. మితంగా తినడమే శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయి. ముడిబియ్యం వల్ల హెచ్‌డీఎల్‌(మంచి కొలెస్ట్రాల్) పెరిగి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌(కొవ్వు)ను తగ్గిస్తుంది. మరోవైపు మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారు తెల్ల బియ్యం కంటే ముడి బియ్యమే బెటర్‌. బీఎమ్‌ఐ(ఎత్తుకు కావాల్సిన బరువు) పాటించాలనుకునే వారికి ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. 

మరిన్ని వార్తలు