International Yoga Day: ప్రపంచ గురువుగా భారత్‌

21 Jun, 2021 09:33 IST|Sakshi

నిరంతరం ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతున్నాయి. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఔషదమే యోగా. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మనదేశమే. క్రీస్తు పూర్వమే పతంజలి మహార్షి యోగాను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత భారత దేశం నుంచి ఉద్భవించిన హిందూ, జైన, బౌద్ధ , సిక్కు మతాలు  యోగాకు ప్రత్యేక స్థానం కల్పించాయి. 20వ శతాబ్ధం తర్వాత ఆరోగ్య పరిరక్షణలో యోగా ఒక భాగంగా చేసుకుంటున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. యోగాకు సంబంధించి ప్రపంచానికే భారత్‌ గురువుగా ఉంది. 

2,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్నా కొన్ని వర్గాలకే అది పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే యోగాకు పెద్దపీట వేశారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగానే సన్మార్గమంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు  2014 సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగా ప్రాధాన్యం గురించి ఆయన ప్రసగించారు. ఆ తర్వాత భారత ప్రధాని చూపిన చొరవతో, ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్‌ 11న ఐక్యరాజ్య సమితి  తీర్మానించింది. 

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కు పైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడు జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రాక్టీస్‌ చేసే ఎందరో ఈ రోజు జరిగే వేడుకల్లో భాగం అవుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో క్రమంగా యోగాకు ప్రాచుర్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో యోగాను ఆచరిస్తున​ వారి సంఖ్య క్రమ క్రమంగా పెంజుకుంటోంది.

‍వివిధ వ్యాయామాల సమాహారమే యోగ. ఈ ప్రక్రియను నిత్యం ఆచరించడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. యోగాలోనే ఒక భాగమైన హఠయోగాన్ని నేర్చుకుంటే వందల ఏళ్లు బతకొచ్చంటూ యోగాపై అపార అనుభవం ఉన్న వారు చెబుతుంటారు. పవాహారిబాబా నుంచి స్వామి వివేకనంద వరకు హఠయోగం నేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు