పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమా?

23 Apr, 2021 01:01 IST|Sakshi

లేదు. అందరికీ ఆస్పత్రిలో అడ్మిషన్, ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రక్తంలో ఉండే ఆక్సిజన్‌ లెవెల్స్‌ 94 శాతం కంటే తక్కువగా ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు భావించి, ఆస్పత్రిలో అడ్మిషన్‌తో పాటు ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమని సూచిస్తాం. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా బాధితులకు సరైన సమయంలో ఆక్సిజన్‌ అందిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆక్సిజన్‌ అందించక పోతే..శ్వాస కష్టమై చివరకు వెంటిలేటర్‌ అవసరమవుతంది.

ప్రస్తుతం చాలామంది ఇంట్లోనే ఉండి ఆక్సిజన్‌ లెవెల్స్‌ చూసుకుంటున్నారు. ఇందుకు వీరు పల్స్‌ ఆక్సీమీటర్‌ (ఫింగర్‌ డివైజ్‌) వాడుతున్నారు. దీన్ని వేలికి పెట్టుకుంటే పల్స్‌తో పాటు రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంతుందో సూచిస్తుంది. ప్రతి వ్యక్తికీ రక్తంలో ఆక్సిజన్‌ 100 శాతం ఉండాలి. 95 వరకు సాధారణంగా భావిస్తారు. 90 నుంచి 95 శాతం మధ్యలో ఉంటే మోడరేట్‌గా, అంతకంటే తక్కువ ఉంటే ప్రమాదమని చెబుతారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాల్సి ఉంటుంది. 97 శాతం ఆక్సిజన్‌ ఉన్నప్పుడు ఆరు నిమిషాలు నడిచిన తర్వాత ఐదు శాతం కంటే ఎక్కువ తగ్గితే (92 శాతానికి చేరితే) ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.

ఇక పల్స్‌ 70 నుంచి 100 మధ్య ఉంటే సాధారణంగా భావిస్తారు. 60 కంటే తక్కువగా ఉంటే హార్ట్‌ రేట్‌ తగ్గిందని, 100 కంటే ఎక్కువగా ఉంటే పెరిగిందని భావిస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు అనవసరంగా భయపడుతున్నారు. భయమే రోగుల పాలిట పెద్దముప్పుగా పరిణమిస్తోంది. ఎక్కువ ఒత్తిడికి గురికావడం, అనవసర ఆందోళన, అవçససరానికి మించి వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోవడం చాలా మేలు చేస్తుంది.

- డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి 
కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు