Fashion And Lifestyle: ఫుడ్‌ని ధరిద్దాం..

18 Jun, 2021 19:12 IST|Sakshi

అరటిపండు, మొక్కజొన్న, ఆరెంజ్, సోయాబీన్, యాపిల్, పైనాపిల్‌.. ఇవన్నీ తినేవే. ధరించేవి కూడా!!

ఫ్యాషన్‌ ప్రపంచం ఇక ప్రకృతిని ప్రేమించడానికి సిద్ధపడిపోయింది. ప్లాస్టిక్‌ వృథాను అరికట్టేందుకు, భూమిలో కలిసిపోయే ఫ్యాబ్రిక్‌ను రూపొందించాలనుకుంది. అంతేకాదు, ఆహారపదార్థాల వ్యర్థాల నుంచి తయారు చేసిన ఫ్యాబ్రిక్‌ సుతిమెత్తగా ఉండి మేనికి హాయిని ఇస్తుంది. ప్రకృతి ప్రేమికులుగా ఫ్యాషన్‌ ప్రియులు మారిపోతున్నారు. అందుకే డిజైనర్లూ తమ స్టైల్‌ని, మార్కెట్‌నూ మార్చుకుంటున్నారు. అలాంటి డిజైనర్ల లో మధురిమా సింగ్‌ ఒకరు. 

పువ్వులు– పండ్లు.. రంగులు
దేశీయ చేనేతలకు సేంద్రీయ రంగులతో ప్రయోగాలు చేస్తుంది. కూరగాయల వ్యర్థాలు, వాడిన పువ్వులు, పండ్లు, విత్తనాలు మొదలైన వాటిని సేకరించి, వాటి నుంచి రంగులు తీసి, కాటన్‌ ఫ్యాబ్రిక్‌పైన అందంగా రూపుకడుతుంది. సంప్రదాయ, సమకాలీన పద్ధతుల్లో కళ్లకు, చర్మానికి హాయిగొలిపేలా మధురిమా షాహి ‘ధూరి’ దుస్తులు ముఖ్యంగా ఈ తరం మహిళ నడకకు హుందాతనాన్ని అద్దుతాయి. 


ఆహార వ్యర్థాల... ఫ్యాబ్రిక్‌
అరటి, మొక్కజొన్న, సోయా, పాలు, తామర, ఆరెంజ్, బాంబూ, యూకలిప్టస్‌ వంటి సహజ ఫైబర్లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్‌ను ‘ధురి’ అనే ఫ్యాషన్‌ లేబుల్‌ ద్వారా తయారు చేస్తున్నారు మధురిమా సింగ్‌. వాటికి సహజసిద్ధమైన రంగులను ఉపయోగించి అందమైన, సౌకర్యవంతమైన డిజైన్స్‌ రూపొందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఢిల్లీలో ధురి స్టూడియో ఏర్పాటు చేసి, తన ఆలోచనను విరివిగా అమలులోకి తీసుకొచ్చారు. సృజనాత్మక డిజైన్, ప్రకృతి సమతౌల్యత రెండింటికీ మధురిమ న్యాయం చేయాలనుకున్నారు. డిగ్రీ చేసిన మధురిమ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలతో పాటు ప్రముఖ డిజైనర్లతో కలిసి పనిచేశారు. ఉద్యోగ అనుభవాలతో డిజైనర్‌గా మారారు. అయితే, తన లేబుల్‌ను పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారైన దుస్తులకే పరిమితం చేశారు. 


మధురిమా సింగ్

ఫ్యాబ్రిక్, ఫ్యాషన్‌ డిజైనర్‌

మరిన్ని వార్తలు