ఉదయం పెసరట్టు.. లంచ్‌లో బ్రౌన్‌ రైస్‌.. రాత్రికి రాగిముద్ద!

27 Apr, 2021 10:36 IST|Sakshi

డైట్‌ ఇలా ఉంటే రైట్‌ 

కరోనాను జయిద్దాం ఇలా..
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన బాదం పప్పులు 5 లేదా 6, రెండు నల్ల ఖర్జూరాలు తీసుకోవాలి. 
దాని తర్వాత నడక లాంటి వ్యాయామం చేయాలి. సూర్యరశ్మి తగిలేలా చేస్తే విటమిన్‌ డి లభిస్తుంది.  

ఉదయం అల్పాహారం 
పెసరట్టు మంచి ప్రొటీన్‌ ఫుడ్‌. ఇందులో వాడే పచ్చిమిర్చి, అల్లం వంటివి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దానికి తోడుగా చేసే పల్లీ చట్నీ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్‌ అందుతాయి. కాబట్టి రెండు పెసరట్లు చట్నీతో తీసుకోవాలి. దానితో పాటు బొప్పాయి, జామకాయ, పుచ్చకాయ, మామిడి రెండేసి ముక్కలు తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌కి లంచ్‌కి మధ్యలో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కీరా ముక్కలు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.  

లంచ్‌ ఇలా.. 
మధ్యాహ్న భోజనంలో పచ్చి లేదా ఉడికించిన కాయగూరల (క్యారట్, బీట్‌రూట్‌) ముక్కలు ఉండాలి. నేరుగా తినలేకపోతే పెరుగు చట్నీలా మిక్స్‌ చేసుకుని తినొచ్చు. బ్రౌన్‌ రైస్, బ్లాక్‌ రైస్‌ లేదా కొర్రలతో అన్నం, పప్పు, ఆకుకూర తీసుకోవాలి. నాన్‌వెజ్‌ కావాలంటే ఫిష్‌ బెస్ట్‌. మొలకెత్తిన గింజల్ని కాయగూరలతో కలిపి కూరలా చేసుకుని తినొచ్చు. సాయంత్రం గ్రీన్‌ లేదా బ్లాక్‌ టీ మంచిది. పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, నువ్వులు, ఫ్లాక్స్‌ సీడ్స్‌ వంటి వాటికి డ్రై ఫ్రూట్స్‌ కలిపి ఒకట్రెండు గుప్పెళ్లు స్నాక్స్‌ కింద తీసుకోవచ్చు. నేరుగా తీసుకోలేకపోతే చిన్నమంట మీద కొద్దిగా వేపి కాస్త మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకోవచ్చు.  

రాత్రికి రాగిముద్ద బెటర్‌ 
రాత్రి 8 లోపు డిన్నర్‌ ముగించాలి. రాగి ముద్ద లేదా గట్టిగా చేసిన రాగిజావ తీసుకోవచ్చు. ఓట్స్‌కి కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. ఒక ఉడికించిన గుడ్డు, చీజ్, పన్నీర్‌ జత చేసి తీసుకోవచ్చు. మూడు పూటలా భోజనం తర్వాత ఏదో ఒక పండు తినడం అలవాటు చేసుకోవాలి. ఇక ప్రోబయాటిక్స్‌ కోసం పెరుగు, మజ్జిగ వంటివి రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇక ప్రీ బయాటిక్స్‌ కోసం బ్రెడ్, ఇడ్లీ వం టివి తీసుకోవచ్చు. ఏవైనా కూడా అతిగా తీసుకోకూడదు. అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య, గ్యాస్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంది. 

చదవండి: మితిమీరిన కషాయాలు కాల్చేస్తాయి.. సూర్యరశ్మి తగలాల్సిందే

మరిన్ని వార్తలు