Health Tips: గుండెలో మంటా?.. కంగారొద్దు.. ఇలా చేసి చూడండి

16 Jan, 2022 15:48 IST|Sakshi

మధ్యాహ్నం లేదా రాత్రివేళ కడుపునిండా తిన్న తర్వాత కాసేపటికి పొట్ట పైభాగం నుండి ప్రారంభమై సన్నని మంట లాంటి నొప్పి నెమ్మదిగా తీవ్రమవుతూ ఛాతీ వరకు పాకుతుంది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. దీనిని బట్టి చూస్తే గుండె నొప్పి అనుకుని కంగారు పడతాం. కానీ ఇది ఎసిడిటీ వలన వచ్చే సమస్య. అందువలన కంగారుపడి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళకుండా ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ఛాతీ మంటను తగ్గించుకోవచ్చు.

చదవండి: మూడ్స్‌ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్‌! 

గుప్పెడు పుదీనా ఆకులను కప్పు నీటిలో నానబెట్టి భోజనం అనంతరం ఆ నీటిని తీసుకోవాలి. ఆ విధంగా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది.  భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే ఎసిడిటీ తగ్గుతుంది.  భోజనం అనంతరం కొన్ని తులసి ఆకులను నమిలి మింగాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తుంటే ఎసిడిటీ, గుండెలో మంట తగ్గుతాయి. ఒక కప్పు నీటిలోసోంపు గింజలు వేసి ఉడికించి రాత్రిపూట అలా ఉంచి ఉదయమే వడకట్టి ఆ నీటిలో తేనె కలిపి పరగడుపున తాగాలి.

గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసి ఉదయం పరగడుపున తీసుకుంటే అనుకున్న ఫలితం కనపడుతుంది. మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం అయిన వెంటనే ఐదు లేదా పది నిముషాల పాటు నడవటం అలవాటు చేసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటీ తగ్గుతుంది. ఆహారంలో పీచుపదార్థం ఉండేలా చూసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది. తద్వారా గుండె మంట, ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు ఒకేసారి కాకుండా నాలుగయిదుసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. పొట్టను ఖాళీగా ఉంచకూడదు. అలాగే వేపుడు కూరలు, మసాలాలకు దూరంగా ఉండాలి

మరిన్ని వార్తలు