ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. ఇవి తిన్నారంటే..!

19 Oct, 2021 11:37 IST|Sakshi

ప్రస్తుత జీవన శైలి వల్ల చివరికి నిద్ర కూడా కరువైపోతుంది. ఉరుకుల పరుగుల పనులు, ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌ వినియోగం, మితిమీరిన ఒత్తిడి.. కారణమేదైనా ఎంతో మంది నిద్రలేమితో సతమతమౌతున్నారు. కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా తగినంత నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు. చర్మం ముడతలు పడటం, జుట్టు రాలిపోవడం ఇవన్నీ నిద్రలేమితో సంభవించేవే. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై కూడా అనేక దుష్ఫభావాలు పడే అవకాశం ఉంది. మరి ఎలా ? ఎంత ప్రయత్నించినా నిద్రపట్టట్లేదని వాపోతున్నారా? రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

వేడి పాలు
మన పేరెంట్స్‌ నిద్రపోతే ముందు గ్లాస్‌ వేడిపాలు తాగడానికి ఇస్తారు. ఎందుకో తెలుసా? రోజు ముగింపు సమయంలో వేడిపాలు తాగితే వెంటనే నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని మెలటోనిన్‌, సెరటోనిన్‌ లను ప్రభావితం చేసి నిద్రవచ్చేలా ప్రేరేపిస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని స్థిరీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. 

చదవండి: డ్రీమ్‌ హౌస్‌ షిఫ్టింగ్‌.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! 

సీమ చేమంతి టీ
సీమ చేమంతి టీ నరాలపై ఎలా ఉపశమనం కలిగిస్తుంది, నిద్రను ప్రేరేపించడంలో ఎలా సహాయపడుతుందనే విషయాల గురించి కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ వివరంగా తెలుపుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ నిండుగా ఉంటాయి. ముఖ్యంగా సీమ చేమంతి టీ ఆందోళనను తగ్గించి, ప్రశాంతమైన నిద్రపట్టేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అరటి పండు
అరటిపండ్లలో సహజంగానే కార్బోహైడ్రేట్‌ కంటెంట్ ఉంటుంది. ఇది నిద్ర మత్తును కలిగించడానికి సహాయపడుతుంది. అరటిలోని ప్రీబయోటిక్స్ నిద్ర వచ్చేలా చేస్తుందని కొలొరడో బౌల్డర్ యూనివర్సిటీ తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుంది. 

చెర్రీ పండ్లు
పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేసేలా చెర్రీ పండ్లు ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ మనసును ప్రశాతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ హోమ్ రెమెడీస్' పుస్తకం ప్రకారం.. రోజుకు 10-12 చెర్రీ పండ్లు తింటే మానసిక అలసట, ఒత్తిడి దూరం చేసి హాయిగా నిద్రవచ్చేలా చేస్తుంది.

తేనె
తేనెలోని సహజ చక్కెరలు శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలను పెంచి, మెలటోనిన్‌, ట్రిప్టోఫాన్‌లు మెదడులో విడుదల్యేలా ప్రేరేపిస్తుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. తేనె సెరటోనిన్‌ను మెలటోనిన్‌గా మార్చి సుదీర్ఘ సమయం నిద్రపోయేలా చేస్తుందని శుఖ్థా హాస్పిటల్‌కు చెందిన డా. మనోజ్‌ కె అహుజ సూచించారు.

చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే!

మరిన్ని వార్తలు