సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో గడపడం ఎక్కువైపోయింది. హ్యాపీగా కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. ఇంటి వాతావరణం ఆహ్లాదభరితంగా లేకుంటే ఇంటి అందం పాడవటమే కాకుండా మనిషి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేయకుండా.. అందంగా సర్దుకోవాలి. (చదవండి: పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ)
► చిన్నారుల ఆట వస్తువులు, రిమోట్ కంట్రోల్, మొబైల్ ఫోన్లు.. ఇలాంటి చిన్న చిన్న వస్తువులను సర్ది అందమైన బుట్టలో వేసేయండి. ఇలా చేస్తే ఇల్లంతా చెల్లాచెదురుగా ఉండదు. రంగు రంగుల బుట్టలతో ఇంటికి కొత్త అందం వస్తుంది.
► పసుపు, నారింజ, ఆలివ్ రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటా యి. వీటిని గోడలకు వేసుకుంటే కాంతివంతంగా కనిపిస్తాయి. తెల్లటి రంగు చల్లటి వాతావరణాన్ని అందిస్తుంది కాబట్టి ఎంచక్కా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
► కిటికీలు, తలుపులకు కొత్త అందాన్ని తెచ్చేవి పరదాలే. కాబట్టి చక్కటి వాటిని చూసి ఎంపిక చేసుకోవాలి. ఆకుపచ్చటి రంగువి ఎంచుకుంటే ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే అనిపిస్తుంది. అలాగే పరదాల ఎంపిక సమయంలో సోఫా రంగులను కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. లేదంటే గది అందం పోతుంది.
► ఎండాకాలంలో ఇంటికి కొత్త కళను తేవాలనుకుంటే వెదురు, కొబ్బరి పీచుతో తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి కంటికి చల్లదనంతో పాటు కొత్త లుక్ను ఇస్తాయి. (చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్ విషయానికి వస్తే..!)