ఇద్దరు డ్రైవర్లు.. బతుకుబండి ఆగనివ్వం

7 Jul, 2021 00:01 IST|Sakshi

ఇల్లు నడవడం ముఖ్యం. పిల్లలకు అన్నం పెట్టడం ముఖ్యం. ఇల్లు నడిపించే శక్తి మగవాడికి మాత్రమే ఉండదు. స్త్రీకి కూడా రెండు చేతులు ఉంటాయి. ఒడిస్సాలో ఒక ప్రయివేటు టీచర్‌కు ఉద్యోగం పోయింది కరోనా వల్ల. చెత్త ఎత్తి పోసి వాహనానికి డ్రైవర్‌గా మారింది. ముంబైలో ఒక ఇల్లాలిని భర్త వదిలేసి పోయాడు. మూడో చక్రాల ఆటోను నాలుగు రోడ్ల మీద తిప్పుతోంది. ఓడిపోవద్దు అంటున్నారు వీళ్లు. గెలిచి బతుకును పరిగెత్తించండి అంటున్నారు. ఉపాధులు తారుమారు అవుతున్న కరోనా రోజుల్లో వీరే స్ఫూర్తి.

కాలం కష్టకాలంగా ఉన్నప్పుడు భుజాల్లో శక్తి ఊరుతుంది. లోపలి శక్తి బయటకు వస్తుంది. మనుగడ కోసం మొండి ధైర్యం ఏర్పడుతుంది. నిజమే. ఇప్పుడు కరోనా కాలంలో కుటుంబాన్ని కాపాడుకోవడమే అన్నింటి కన్నా ముఖ్యమైన కర్తవ్యం. భర్త తన శక్తి మేరకు భార్య తన శక్తి మేరకు గత పదిహేను నెలలుగా కాపాడుకుంటూనే వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సవాళ్లు ఎదురవుతాయి. ఆ సమయంలో స్త్రీలు ఆ సవాళ్లకు సమాధానంగా నిలుస్తున్నారు. భువనేశ్వర్‌ (ఒడిశా)కు చెందిన స్మృతిరేఖ ఇందుకు ఉదాహరణ. 29 ఏళ్ల ఈ స్కూల్‌ టీచర్‌ ఇప్పుడు చెత్త ఎత్తే వాహనం డ్రైవర్‌గా మారింది.

ప్రతి పనీ గౌరవనీయమైనదే
స్మృతిరేఖ పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక తను నివసించే పతారబండ స్లమ్స్‌లో ప్రైమరీ టీచర్‌గా పని చేసేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చిన్న ప్రయివేటు ఉద్యోగి. ఉన్నంత లో బాగానే జీవితం గడుస్తూ ఉంటే హటాత్తుగా కరోనా... ఆ వెంటనే స్మృతిరేఖకు కష్టాలు వచ్చిపడ్డాయి. స్కూలు మూతపడింది. ఆ సంపాదనకు తోడు ఇంట్లో ట్యూషన్లు చెప్పేది. ట్యూషన్‌కు కూడా పిల్లలు రావడం మానేశారు. ఆ కొసరు కూడా పోయింది. భర్తకు సగం జీవితం ఇవ్వడం మొదలెట్టారు. పులి మీద పుట్రలా తండ్రి మరణించడం.. తమ్ముళ్లు చిన్నవాళ్లు కావడం వల్ల పుట్టింటి బరువు కూడా నెత్తి మీద పడింది. ‘ఏం చేయాలి ఇప్పుడు. నెత్తి కొట్టుకుంటే లాభం లేదని ధైర్యంగా చెత్త లారీ ఎక్కా’ అంటుంది స్మృతి రేఖ. 2019లో ఒక స్వచ్ఛంద సంస్థ మురికివాడల్లోని స్త్రీలకు డ్రైవింగ్‌ నేర్పడం ఆమెకు లాభించింది. భువనేశ్వర్‌ కార్పొరేషన్‌ చెత్త సేకరణ బృందాలలో స్త్రీలకు అవకాశం ఇవ్వాలనుకోవడంతో స్మృతి రేఖకు డ్రైవర్‌ ఉద్యోగం దొరికింది. అ..ఆలు దిద్దించిన చేతులతో చెత్తలారీ స్టీరింగ్‌ పట్టుకోవడానికి ఆమె నామోషీ ఫీల్‌ కాలేదు. ‘అన్నం పెట్టే ఏ పనైనా గౌరవనీయమైనదే’ అంటుంది. ‘నా డ్యూటీ పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ వుంటుంది. నాలుగైదు ప్రాంతాల్లో తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా సేకరించాలి. దానిని వేరు వేరు ప్రాంతాలలో పారబోయాలి’ అని చెప్పింది స్మృతి రేఖ. ఆమెకు ఒరిస్సా వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. 

జగమొండి షిరీన్‌
ముంబైలో ఈకాలంలో ఆటో డ్రైవర్‌ షిరీన్‌ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఆమె తెల్లటి బట్టల్లో, చలువ కళ్లద్దాల్లో, ఏ మాత్రం బెరుకు లేకుండా, న్యూనత లేకుండా దర్జాగా ఆటో నడపడమే. ఆ ఆటో నడిపి ఆమె తన ముగ్గురు పిల్లలను సాక్కుంటోంది. ‘నన్ను అందరూ దబంగ్‌ లేడీ’ అంటారామె. దబంగ్‌ అంటే మొండి ఘటం అని అర్థం. షిరీన్‌ జీవితమే ఆమెను జగమొండి చేసింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక తల్లిని భర్త విడిచిపెట్టి పోయాడు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ భర్త రాచిరంపాన పెడితే ఆత్మహత్య చేసుకుంది. కన్నతండ్రి తిరిగి వచ్చి హడావిడిగా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తే పెద్ద కూతురును అత్తామామలు విషం పెట్టి చంపారు. షిరీన్‌ భర్త ముగ్గురు పిల్లలు పుట్టాక పారిపోయాడు.

‘ఇంకొకరైతే ఏమయ్యేవారో కాని నేను మాత్రం అస్సలు వెరవలేదు’ అంటుంది షిరీన్‌. ఆమె కొన్నాళ్లు చిన్న బిర్యానీ పాయింట్‌ పెట్టింది. నడవలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే భర్త ఆటో నడిపేవాడు కాబట్టి ఆటో నడపడం మేలనుకుంది. లోన్‌ తీసుకుని ఆటో ఎక్కింది. అయితే ఆమె అందరిలా బీద ఆటో డ్రైవర్‌ లా కనిపించాలనుకోలేదు. చక్కటి బట్టల్లో మంచిగా తయారయ్యి హుందాగా ఆటో నడపాలనుకుంది. మొదట సాటి మగ ఆటోడ్రైవర్లు ఆమెను అటకాయించారు. ‘నిన్ను చూసి అందరూ సవారీ ఎక్కుతారు. నువ్వు రాకు’ అన్నారు. ఆమెను అడ్డగించడానికి చూశారు. కాని పులిలా వారిని ఎదిరించి ఆటోను ముందుకు దూకించింది. ‘మనం అస్సలు తగ్గొద్దు’ అంటుంది షిరీన్‌. బాలీవుడ్‌ తారలు ఆమె గురించి విని ఆమెను పిలిచి ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది.

డ్రైవర్‌ వృత్తి అనేది బాధ్యతతో కూడుకున్నది. పురుషులు ఎంత బాగా ఈ డ్యూటీ చేసినా బద్దకం, తాగుడు, నిర్బాధ్యత వంటి లోపాలు కొందరిలో ఉంటాయి. స్త్రీలు ఈ విషయంలో ఎంతో బాధ్యతతో పనిచేసి ఇవాళ దేశంలో చాలా చోట్ల డ్రైవర్లుగా రాణిస్తున్నారు. కరోనా ఇలాంటి వారి విషయంలో చిన్న బ్రేకు వేయగలిగింది కాని స్టాప్‌బోర్డ్‌ పెట్టలేకపోయింది.ప్రస్తుత కాలంలో వీరిని చూసి మరెందరో తమ జీవితాల స్టీరింగ్‌ను మరింత దృఢంగా పట్టుకునే అవకాశం ఉంది.
– సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు