ఈ సీజన్‌లో ఇవి తినండి.. బరువు తగ్గండి

1 Dec, 2020 08:26 IST|Sakshi

ఖర్జూరాలు

పోషకాలన్నిటినీ కలిపి ఒక క్యాప్సూల్‌ లో వేస్తే వచ్చే ఫలితాన్నిస్తాయి ఖర్జూరాలు. ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజూ మితంగా తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

ఆకుకూరలు (ముదురు ఆకుపచ్చవి)


పుదీనా, ఆవ ఆకు, పాలకూర, చుక్కకూర వంటి వాటిలో విటమిన్‌ ఏ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా, శీతాకాలంలో ఎదురయ్యే... శరీరం పొడిబారి పోవటం, జుట్టు రాలిపోవటం వంటి సమస్యల నుండి కూడా కాపాడతాయి. 

బాదం పప్పులు, వాల్నట్స్‌

వీటిని తీసుకోవటం వల్ల, శరీర ఉష్టోగ్రత సమతుల్యంగా ఉండటమే కాకుండా, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. గుండె సక్రమంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఇవి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

సిట్రస్‌ జాతి పండ్లు


సిట్రస్‌ జాతి పండ్లయిన నిమ్మ, కమలా, బత్తాయి, నారింజ వంటి వాటిలో రసం అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన సి విటమిన్‌ అధికంగా లభ్యమవుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. 

అటుకులు


శీతాకాలంలో అటుకులతో చేసిన ఆహారం తీసుకోవటం వలన ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇందులో నుంచి శక్తి నెమ్మదినెమ్మదిగా విడుదల అవుతుండటం వల్ల మధ్యాహ్నం భోజనం సమయం వరకు ఆకలి వేయదు. వీటికి డ్రైఫ్రూట్స్, నట్స్‌ జత చేసి తీసుకుంటే మరింత రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఉంటారు.

చిలగడ దుంప

చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్‌ ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చిలగడ దుంప తినటం వల్ల జీర్ణశక్తి బలపడి, మలబద్దక సమస్య దూరమవుతుంది.  

మరిన్ని వార్తలు