సస్పెన్స్‌ థ్రిల్లర్‌ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

26 Oct, 2021 15:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీమా సొమ్ము కోసం ఓ నిరుపేదను పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. నిందితుడు వేసిన ప్లాన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ఏమాత్రం తక్కువ కాదు! ఏం చేశాడంటే..

ప్రభాకర్ భీమాజీ వాఘ్‌చౌరే (54) గత 20 యేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి వచ్చి, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రజుర్‌ అనే గ్రామంలో ఉంటున్నాడు. ఐతే ఏమైందో ఏమో.. హఠాత్తుగా 3 నెల్లతర్వాత ఏప్రిల్‌ 22న రజుర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాఘ్‌చౌరే అనే వ్యక్తి మరణించినట్లు నివేదిక వచ్చింది.

చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!

దీంతో పోలీసులు సదరు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టగా.. ప్రవీణ్‌,  హర్షద్‌ లహంజె అనే ఇద్దరు వ్యక్తులు మృతుడు వాఘ్‌చౌరేగా గుర్తించారు. వారిలో ప్రవీణ్‌ అనే వ్యక్తి మృతుడికి మేనల్లుడినని చెప్పుకొన్నాడు. మృతుడు పాముకాటుతో మరణించినట్లు ప్రాథమిక మెడికల్‌ రిపోర్టులు వెల్లడించాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని మేనల్లుడికి అప్పగించారు కూడా. దీంతో కథముగిసిపోయిందిలే అని అనుకున్నారు. కానీ..

వాఘ్‌చౌరే జీవిత బీమా క్లెయిమ్‌పై దర్యాప్తు చేస్తున్న బీమా సంస్థ అధికారులు అతని మరణ వివరాలను కోరుతూ అహ్మద్‌నగర్ అధికారులను సంప్రదించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.

చదవండి: Science Facts: క్యాన్సర్‌ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..

బీమా సంస్థ అధికారులు తొలుత మృతుడిగా చెప్పబడుతున్న వాఘ్‌చౌరే ఇంటి పక్కవారిని అడిగితే.. పాముకాటు సంఘటన ఏదీ ఇక్కడ చోటుచేసుకోలేదని, ఐతే అంబులెన్స్‌ మాత్రం ఆ ఇంటి ఆవరణలో కనిపించినట్లు తెలిపారు. తర్వాత వాఘ్‌చౌరే మొబైల్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అతను బతికిఉండటమేకాకుండా హాస్పిటల్లో తనను తాను మేనల్లుడు ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గతవారం వాఘ్‌చౌరేను, అతనికి సహకరించిన 4 అనుచరులను నిర్భందంలోకి తీసుకున్నాట్టు అహ్మద్‌నగర్‌ ఎస్పీ మనోజ్‌ పటేల్‌ మీడియాకు తెలిపారు.

ఈ దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నవ్‌నాథ్‌ యశ్వంత్‌ ఆనప్‌ (50)గా గుర్తించారు. ఏప్రిల్‌ 22న ఆనప్‌ను బలవంతంగా ముందుగానే నిర్ణయించిన ప్రాంతానికి తరలించి కాలి వేలిపై పాముతో కరిపించారు. అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని వాఘ్‌చౌరే ఇంటికి తరలించి, అంబులెన్స్‌ను పిలిపించినట్లు తెలిసింది.

అసలు బీమా కంపెనీకి వాఘ్‌చౌరేపై అనుమానం ఎందుకొచ్చిందంటే.. గతంలో అతని  భార్య బతికి ఉండగానే 2017లో సదరు బీమా కంపెనీ నుంచి బీమా క్లెయిమ్‌ చేయడంతో, మోసపోయిన బీమా సంస్థ అతని మృతి గురించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ దర్యాప్తే అతని బండారాన్ని వీధి కీడ్చింది.

ఏదిఏమైనా ఒక నిండు ప్రాణం అతని స్వార్థానికి బలైపోయింది.

చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్‌ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది!

మరిన్ని వార్తలు