ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..

23 Oct, 2021 10:57 IST|Sakshi

ఉ‍ల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం. కానీ ఈ దేశ ప్రజలు కేవలం ఉల్లి తినడం మూలంగానే  వింత వ్యాధి భారీన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు.

అమెరికాలో దాదాపు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు సాల్మొనెల్లా అనే వ్యాధి వ్యాపించింది. మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే అందుకు కారణమట. దీంతో ప్యాకింగ్‌, స్టిక్కర్‌ లేని ఉ‍ల్లిపాయలన్నింటినీ వెంటనే పారవేయాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము అనారోగ్యబారిన పడ్డట్టు 75% మంది బాధితులు వెల్లడించారు.

చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్‌ నిజాలు!

సీడీసీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 129 మంది హాస్పిటల్‌ పాలయ్యారు. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని, అత్యధికంగా సాల్మొనెల్లా కేసులు ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో నమోదయ్యాయని వెల్లడించింది. టెక్సాస్‌, ఓక్లహోమా ప్రావిన్స్‌లలో మొదట ఈ వ్యాధి తాలూకుకేసులు నమోదయ్యాయని మీడియాకు తెల్పింది. 

ఏమిటీ సాల్మొనెల్లా..?
సాల్మొనెల్లా లేదా సాల్మొనెల్లోసిస్‌ అనేది సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది పేగులను ప్రభావితం చేసి, జీర్ణసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్‌, పారా టైఫాయిడ్‌ జ్వరాలకు కూడా దారితీస్తుందని సీడీసీ పేర్కొంది. 

ఐతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. ఇది మల విసర్జన ద్వారా బయటికి పోతుంది. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటలకు సాల్మొనెల్లా వ్యాపిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. ఈ వ్యాధి 4 నుంచి 7 రోజుల పాటు బాధిస్తుంది. కొన్ని రకాల బాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్ళు లేదా నాడీ వ్యవస్థల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు కారణమౌతాయి కూడా.

చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!

మరిన్ని వార్తలు