Pochampally Facts: ఒకప్పటి పేరేంటో తెలుసా? సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా విశేషాలు..

30 Nov, 2021 08:38 IST|Sakshi

Pochampally: Best Tourism Village India Silk City Interesting Facts Old Name Etc: ఊరంటే.. చెట్టు, చేమ.. పుట్ట, గుట్ట.. మళ్లు, మడుగులు..చెరువులు, చెలకలు.. పాడి, పశువులు.. బడి, గుడి.. వాటితో పెనవేసుకున్న మనుషులు! విషయం ఇంతే అయితే  ఆ ఊరు ఉనికి పొలిమేరతోనే ఆగిపోతుంది! ఆ పల్లె ఓ ఆదర్శాన్ని ఆచరణలో పెడితే.. అరుదైన కళను పడుగు – పేకల్లో పేర్చుతుంటే ఆ ప్రత్యేకతే అస్తిత్వమై అవధులు దాటుతుంది.. ప్రపంచ పటంలో రంగులీనుతుంది!! ఆ ఆదర్శం.. భూదానం.. ఆ కళ.. ఇక్కత్‌.. కలిస్తే భూదాన్‌ పోచంపల్లి.. సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా!!

ఇప్పుడు యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌చే  ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’గా  గౌరవం దక్కించుకుంది!! ఇక్కడ పోచంపల్లి ప్రస్తావనకు ప్రాసంగిత అదే!! హైదరాబాద్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోచంపల్లి. వస్త్రనేతకు ఆలవాలం కాకముందు గాజులు, పూసల తయారీకి ప్రసిద్ధీ పల్లే. అందుకే ‘గాజుల పూసల పల్లి’గా పేరు. రానూరానూ  పలకడంలో గాజుల పోచంపల్లి అయింది. 

పేరునిచ్చిన భూదానం
ఇది 1951 నాటి ముచ్చట. గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయం. సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్‌ ఆహ్వానం మేరకు ఆ ఏడు ఏప్రిల్‌15న  హైదరాబాద్‌ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. అప్పుడే  నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి కాలినడకన బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు.

సాయంత్రం దళితవాడంతా తిరిగి ఆ రాత్రి పీర్లకొట్టం (ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు (ఏప్రిల్‌ 18న) చెరువు సమీపంలోనున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే వినోబాభావే స్పందిస్తూ ‘మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా?’ అని అడిగారు.

ఆ తక్షణమే..అక్కడే ఉన్న పోచంపల్లి వాసి వెదిరె రామచంద్రారెడ్డి లేచి ‘నా తండ్రి జ్ఞాపకార్థం వంద ఎకరాల భూమిని దానం చేస్తా’నని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి అదే సభలో వినోబాభావేకు అందించారు. దానరూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తమైంది. గాజుల పోచంపల్లిని ‘భూదాన్‌ పోచంపల్లి’గా మార్చింది..1993లో గెజిట్‌ ద్వారా ఆ పేరు స్థిరమైంది. పోచంపల్లిని వినోబాభావే 1956లోనూ సందర్శించారు.  భూదానోద్యమానికి తనను కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని ఆయన ‘భూదాన గంగోత్రి’గా అభివర్ణిస్తూ ఆ ఊరిని తన రెండో జన్మస్థలంగా పేర్కొన్నారు.

నేతను కట్టుకుంది.. 
అసఫ్‌జాహీల పాలనా కాలం నాటికే లడీల హల్‌చల్‌ని కంటూ మగ్గాల సవ్వడిని వింటూ ఉంది పోచంపల్లి. అద్భుతమైన వస్త్రనేత కళాకారులకు పీటవేసింది. 1910 నాటికే ఇక్కడ చిటికి పరిశ్రమ ఏర్పడింది. ఇరవై నంబరు నూలుతో ‘తేలియా రుమాళ్ల’ను నేసేవారు. వ్యాపార నిమిత్తం హైదారాబాద్‌కు వచ్చిపోయే అరబ్బులు వీటిని చూసి ఇష్టపడి కొనుగోలు చేసేవారు. ఆ డిమాండ్‌తో  తేలియా రుమాళ్లను అరబ్బు దేశాలకు ఎగుమతి చేయడమూ ప్రారంభించారు. 

పట్టునూ పట్టుకుంది
తొలుత తేలియా రుమాళ్లు, కాటన్‌ వస్త్రాలు మాత్రమే పోచంపల్లి పేటెంట్‌గా ఉండేవి. తర్వాత ఈ ఊరికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరి అనే చేనేత కళాకారులు 60 నెంబరు నూలుతో పడుగు, పేకలతో సహజరంగుల్లో చీరలనూ నేశారు. 1956లో పోచంపల్లిని సందర్శించిన ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డ్‌ ప్రెసిడెంట్‌ కమలాబాయి ఛటోపాధ్యాయ, చిన్నతరహా పరిశ్రమల డైరక్టర్‌ దయారాం కాటన్‌ చీరల మాదిరిగానే పట్టు చీరలను తయారు చేయమని కోరారు. వారి కోరిక మేరకు అనంతరాములు, పెద్దయాదగిరి ఇద్దరూ బనారస్‌కు వెళ్లి అక్కడ ఏడాది పాటు శిక్షణ తీసుకొన్నారు. అనంతరం అనంతరాములుతో పాటు భిక్షపతి, కర్నాటి వాసుదేవ్‌ కుంభకోణం వెళ్లి రంగుల అద్దకంలో శిక్షణ పొందారు.

ఆ తర్వాత పోచంపల్లికి తిరిగి వచ్చి.. మొట్టమొదటిసారిగా 1958లో మగ్గంపై పట్టు చీరను నేశాడు అనంతరాములు. దాంతో పట్టు పరిశ్రమకూ పోగును సవరించుకుంది పోచంపల్లి. ఇక్కత్‌ను బ్రాండ్‌ వాల్యూగా మార్చుకుంది. ఈ నేత కళకు ప్రభుత్వం 2004లో పెటెంట్‌ హక్కునూ (జియోగ్రాఫికల్‌ ఆఫ్‌ గూడ్స్‌) కల్పించింది. చేతివృత్తుల ఎంపోరియం ప్రతినిధి నాయుడమ్మ.. పోచంపల్లిలో తయారైన ఇక్కత్‌ వస్త్రాల మార్కెటింగ్‌కు అవకాశాలను కల్పించాడు. అలా పట్టు చీరల తయారీలో తమదైన నేత, అద్దకంతో 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. 

కాలానికనుగుణంగా 
పోచంపల్లిలో నేత కార్మికులు.. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. మల్లేశం కనిపెట్టిన ఆసుయంత్రం ఇక్కడ పెద్ద విప్లవమనే చెప్పొచ్చు. దాని రాకతో నేత విషయంలో మహిళలకు పనిభారం చాలా  తగ్గింది. ఒక్క ఆసుయంత్రం రోజుకు అయిదారు చీరలకు సరిపోను చిటికి పోస్తుంది. యంత్రం లేకపోతే రెండు చీరల కంటే ఎక్కువ పోయలేరు. అలాగే కండెలు చుట్టే యంత్రాలూ వచ్చాయి. వీటన్నిటి వల్ల వస్త్రోత్పత్తి గణనీయంగా పెరిగింది. 

విస్తృతమైన మార్కెట్‌
పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరిగింది. దాంతో అన్నివర్గాల ప్రజలూ పర్యావరణ హితమైన చేనేత వస్త్రాలను ధరించడానికే మక్కువ కనబరుస్తున్నారు. బహుళజాతి కంపెనీలైన అమెజాన్, వీవ్‌మార్ట్‌ లాంటి సంస్థలు కూడా  ముందుకు వచ్చి చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. తాజాగా పేటీఎం, సొంత వెబ్‌సైట్‌ల ద్వారా పోచంపల్లి చేనేత సహకార సంఘమూ ఈ–మార్కెటింగ్‌ను మొదలుపెట్టింది. అలాగే ఔత్సాహిక యువతా వాట్సప్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలను చేనేత వస్త్రాల మార్కెట్‌కు వేదికగా మలచింది. ఈ నూతన ఒరవడితో నెలలో ఒక్క పోచంపల్లిలోనే రూ. 3కోట్ల మేర టర్నోవర్‌ అవుతుందని అంచనా.

వైట్‌ హౌస్‌లో పోచంపల్లి రెపరెపలు
చీరలతో పాటు ఇక్కడ ఉత్పత్తి అయ్యే  డ్రెస్‌ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజాయ్‌లు, స్టోల్స్, స్కార్ఫ్స్, దుపట్టాలు, కర్టెన్స్, బెడ్‌ షీట్స్, పిల్లో కవర్స్, దివాన్‌సెట్స్, సోఫా కవర్స్, హ్యాండ్‌ బ్యాగులు, క్యారీ బ్యాగ్స్‌ తదితర వెరైటీలకు స్వదేశంలోను, విదేశాల్లోనూ డిమాండ్‌  ఉంది. ముఖ్యంగా సూడాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, దుబాయ్‌ వంటి దేశాల్లో మహిళలు ధరించే స్కార్ఫ్స్‌ను ఇక్కడే ఆర్డర్‌ చేస్తున్నారు.  ఇక్కడి అపెరల్‌ ఫ్యాబ్రిక్, హోమ్‌ ఫర్నిషింగ్, డ్రెస్‌ మెటీరియల్స్‌ను యూరోప్‌ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.

విదేశాల్లో జరిగే వస్త్ర ప్రదర్శనల్లో పోచంపల్లి ఇక్కత్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలోని వైట్‌హౌస్, జపాన్, రష్యా అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్లనే వినియోగిస్తున్నారంటే ఇక్కడి చేనేత కళానైపుణ్యం ఎంతటిదో అర్థంచేసుకోవచ్చు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఇక్కడి చేనేత చీరలను ధరించినవారే. 

పర్యాటకానికీ రంగులు అద్దింది.. పాఠ్యాంశంగా అచ్చయింది
తనకే ప్రత్యేకమైన నేత ఈ ప్రాంతానికి ఓ నేపథ్యాన్ని అద్దితే.. వినోభాబావే సందర్శన ఆయన మాటతో వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం ఈ ఊరికి చారిత్రక ప్రాశస్త్యాన్ని కల్పించింది. ఈ రెండిటి ఘనత నాటి నుంచే పోచంపల్లిని సహజంగానే ఓ పర్యాటక పల్లెగా మలచింది. చేనేత వస్త్రాల మార్కెటింగ్‌ కోసం వచ్చిపోయే వ్యాపారులు, కొనుగోలుదారులతోపాటు ఆచార్య వినోబాభావే నడియాడిన నేల, ఆయన కూర్చున్న జువ్విచెట్టు, ఆయన బస (వినోబాభావే మందిరం) చేసిన చోటు, సంతానప్రాప్తికోసం నిర్మించిన 101 దర్వాజాల భవనాన్ని సందర్శించడానికీ దూరదూరాల నుంచి జనం వస్తూండడంతో పర్యాటక ప్రాంతంగా కిటకిటలాడుతుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే 2007లో రూ.3.75 కోట్ల వ్యయంతో ఇక్కడ   గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

అప్పటి కేంద్ర పర్యాటక శాఖామంత్రి అంబికా సోని, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి దీనిని ప్రారంభించారు. ఇందులో ఆంఫి థియేటర్, చేనేత హస్తకళల మ్యూజియం, షాపింగ్‌ కాంప్లెక్స్, రెస్టారెంట్, గెస్ట్‌హౌస్, బోటింగ్‌ సౌకర్యాలను కల్పించారు. అమెరికా, రష్యా, చైనా, జపాన్, సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సూడాన్, నైజీరియా, ఈజిప్ట్, ఇటలీ, ఉగాండా, ఘనా, మలేషియా మొదలు వందకు పైగా దేశాలకు చెందిన ఎంతోమంది విదేశీయులు, విదేశీ అధికారులు పోచంపల్లి సందర్శనకు వచ్చారు.. వస్తున్నారు. ట్రైనీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులూ ఈ చేనేత పల్లెలో పర్యటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్స్, ఆర్కిటెక్చర్‌ విద్యార్థులూ స్టడీటూర్‌లో భాగంగా సందర్శనకు వస్తుంటారు.

మన పాఠ్యపుస్తకాలలో పోచంపల్లి ఇక్కత్‌ను పాఠ్యాంశంగా చేర్చడంతో ప్రత్యక్షంగా ఈ ఊరిని చూడ్డానికి వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులూ ఇక్కడికి వస్తుంటారు. మనకే కాదు పోచంపల్లి విదేశీయులకూ ఓ అధ్యయన కేంద్రంగా మారింది. ముఖ్యంగా వారు భూదానోద్యమ చరిత్ర, చేనేత, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, మహిళా సంఘాల నిర్వహణ, వ్యవసాయం, ఇక్కడి ప్రజల సంస్కృతీసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలను అధ్యయనం చేయడానికి తరచుగా వస్తుంటారిక్కడికి. పోచంపల్లి హైద్రాబాద్‌కు చేరువలో ఉండటం కూడా పర్యటనకు ఈజీ అయింది.. పర్యాటకులకు అనుకూలంగా మారింది. 

మేళాలతో ఉత్సాహం...
గతంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచంపల్లి టూరిజం పార్కులో మూడు రోజుల పాటు మేళాను ఏర్పాటు చేశారు. ఇందులో చేనేత వస్త్రాల ప్రదర్శన, హ్యాండిక్రాప్ట్‌ ప్రదర్శన, గ్రామీణ వంటకాల రుచులు, గ్రామీణ కళలో భాగంగా గంగిరెద్దుల ఆట, డప్పుకళాకారుల ఆటాపాటా, ఒగ్గు కళారూపాలను ప్రదర్శించారు. ఈ మేళా ప్రతి ఏటా కొనసాగితే బాగుంటుందని పర్యాటకుల అభిప్రాయం.  

ఆకట్టుకున్న ఫ్యాషన్‌షోలు...
పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిండంతో పాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి స్థానిక టూరిజం పార్కులో 2008లో ఫ్యాషన్‌షోను నిర్వహించారు. ప్రముఖ నటి శోభనతో పాటు పలువురు మోడల్స్‌ పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించి పర్యాటకులను ఆకట్టుకొన్నారు. 2018లో కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యాషన్‌షో నిర్వహించారు. ఇందులో మిస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ రశ్మి ఠాకూర్‌తో పాటు ప్రముఖ ప్యాషన్‌ డిజైనర్లు తాము రూపొందించిన ఇక్కత్‌ వస్త్రాలను ప్రదర్శించారు.

అభివృద్ధిని మరచింది
డిసెంబర్‌ 2న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే 24వ మహాసభల సమావేశంలో ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ పురస్కారాన్ని అందుకోనుంది పోచంపల్లి. ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కించుకున్న ఈ ఊరికి పర్యాటక కేంద్రంగా గొప్ప వైభవం వస్తుందనే ఆశతో ఉన్నారు స్థానికులు. ఇప్పటి వరకు పర్యాటక శాఖ ఆదాయాలపైనే శ్రద్ధ పెట్టి.. అభివృద్ధిని మరచింది. దాంతో ప్రస్తుతం గ్రామీణ పర్యాటక కేంద్రం వెలవెల బోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దీన్నో సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం..

సినిమా షూటింగ్‌లకూ.. 
ఎటూ చూసినా పచ్చని పంట పొలాలు, చెరువులు, గుట్టలతో అందమైన లోకేషన్లు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో సినిమా షూటింగ్‌లకూ కేరాఫ్‌గా మారింది పోచంపల్లి. ఆ షూటింగ్‌లకు మొదట క్లాప్‌ కొట్టి.. యాక్షన్‌ చెప్పింది ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌.. 1986లో.. ఆ సినిమా పేరు సుస్మాన్‌. షూటింగ్‌ కోసం దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ సరే.. హీరోయిన్‌ షబానా ఆజ్మీ సహా ఆ యూనిట్‌ మొత్తం పోచంపల్లిలోనే బస చేశారట.. నెలరోజులకు పైనే.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ సినిమా షూటింగ్‌ అయిపోయేలోపు షబానా ఆజ్మీ, హీరో ఓంపురి ఇద్దరూ బట్టలు నేయడం నేర్చుకోవడం. ఓంపురి ఓ కుర్తా గుడ్డ నేసి షబానాకు ప్రెజెంట్‌ కూడా చేశాడట. అలా సుస్మాన్‌ మొదలు నేటి వరకు ఎన్నో  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాలు, పలు సీరియల్, డాక్యుమెంటరీల షూటింగ్‌లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి.

హీరో మహేశ్‌బాబు నటించిన ‘అతిథి’, పవన్‌కల్యాణ్‌ నటించిన ‘కాటమరాయుడు’, వెంకటేశ్‌ నటించిన ‘వెంకీమామ’, అల్లుఅర్జున్‌ ‘వేదం’, ‘వరుడు’, జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’,  ‘సాంబ’, విజయ్‌ దేవరకొండ ‘గీతాగోవిందం’, నితిన్‌ ‘అ,ఆ’, శర్వానంద్‌ ‘మహానుభావుడు’, వరుణ్‌తేజ్‌ నటించిన ‘లోఫర్‌’, సాయిధరమ్‌ తేజ  ‘ప్రతిరోజు పండగే’, మమ్ముట్టి  ‘యాత్ర’, శ్రీకాంత్‌ నటించిన ‘రంగా ది దొంగ’,  ఎన్‌. శంకర్‌ ‘ జై బోలో తెలంగాణ’,  సునీల్‌ ‘భీమవరం బుల్లోడు’, ‘ఉంగరాల రాంబాబు’, ఇటీవల విడుదలైన నాని ‘టక్‌ జగదీశ్‌’, ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమాల షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి.  

-ఎమ్‌ఏ షరీఫ్‌

చదవండి: Matilda Kullu: ‘ఫోర్బ్స్‌’ లిస్ట్‌లో ఆశా వర్కర్‌.. ఎందుకంటే..?

మరిన్ని వార్తలు