సోదరీసోదరుల అనురాగ అనుబంధాల మిఠాయి

21 Aug, 2021 15:03 IST|Sakshi

సోదరీసోదరుల అనురాగ అనుబంధాల తియ్యటి పండుగ.. సోదరుడి నోరు తీపి చేయటానికి సోదరి ఆప్యాయతను కలబోసి తినిపించే మిఠాయిల పండుగ తనకు రక్షణగా ఉండమని సోదరుడిని భరోసా కోరే రక్షాబంధన్‌ పండుగ..


 
1. దూద్‌ పాక్‌
కావలసినవి: చిక్కటి పాలు – 5 కప్పులు; కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్‌ స్పూను; బాస్మతి బియ్యం – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; గార్నిషింగ్‌ కోసం: బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పిస్తా పప్పుల తరుగు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ

  • ఒక చిన్న పాత్రలో టేబుల్‌ స్పూను పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, నెయ్యి జత చేసి పక్కన ఉంచాలి.
  • పాలను మరిగించాక, నెయ్యి జత చేసిన బియ్యం అందులో పోసి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ, ఉడికించాలి.
  • పంచదార, కుంకుమ పువ్వు జత చేసిన పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆరేడు నిమిషాలు ఉంచి, దింపేయాలి.
  • చల్లారాక ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచి బయటకు తీయాలి.
  • బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పుల తరుగుతో అలంకరించి, అందించాలి.

చదవండి: రొయ్యల ఆమ్లెట్‌ ఎలా తయారు చేయాలో తెలుసా?



2. కాజు కోప్రా షీరా
కావలసినవ: జీడి పప్పుల పొడి – అర కప్పు (రవ్వలా ఉండాలి); కొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా

తయారీ

  • చిన్న గ్లాసులో కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి.
  • స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడి పప్పు పొడి, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి.
  • ఒక పాత్రలో పావు కప్పు నీళ్లలో పంచదార వేసి కరిగించి, వేయించిన జీడి పప్పు మిశ్రమానికి జత చేసి, బాగా కలపాలి.
  • కుంకుమ పువ్వు నీళ్లను జత చేసి మరోమారు కలపాలి.
  • ఏలకుల పొడి జత చేసి, కలిపి, దింపేసి, చల్లారాక అందించాలి.

3. కేసర్‌ మలై కుల్ఫీ
కావలసినవి: కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్‌ స్పూను; కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టేబుల్‌ స్పూను; చిక్కటి పాలు – నాలుగున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను

తయారీ

  • ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి.
  • చిన్న పాత్రలో 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు, కార్న్‌ ఫ్లోర్‌ వేసి కలిపి పక్కన ఉంచాలి.
  • స్టౌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నటి సెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ మరిగించాలి.
  • కార్న్‌ ఫ్లోర్‌ నీళ్లు, పంచదార జత చేసి సన్నటి మంట మీద సుమారు అరగంట సేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి దింపేయాలి.
  • మిశ్రమం బాగా చల్లారాక కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి జత చేయాలి.
  • తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి పోసి, డీప్‌ ఫ్రీజర్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచాక తీసుకుని తినాలి.
    – వైజయంతి పురాణపండ


చదవండి: బ్రెడ్‌ పిజ్జా ఎలా తయారు చేయాలో​ తెలుసా?

మరిన్ని వార్తలు