పాత జ్ఞాపకం: ఆ కాలంలో పరీక్షలు

28 Apr, 2022 01:02 IST|Sakshi

టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో మొదలయ్యాయి. తెలంగాణలో ఇంకా మొదలుకావాల్సి ఉంది ఈ పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలకు మంచి మార్కుల గురించి తల్లిదండ్రులకు వారి ఆరోగ్యం గురించి టెన్షన్‌. కాని ఒకప్పుడు పరీక్షలు ఎంతో చిత్ర విచిత్రంగా జరిగేవి. రకరకాల సెంటిమెంట్లు ఉండేవి. ఎన్నో సరదాలు చోటు చేసుకునేవి. ఈనాటి పరీక్షల సందర్భంగా
ఆనాటి పరీక్షల రీవిజిట్‌... కొంచెం రిలీఫ్‌ కోసం.

ఇప్పుడేముంది పిల్లలు ఛాయిస్‌తో సహా అన్నీ రాసేసేంత చదివేస్తున్నారుగానీ పూర్వం పరీక్షలంటే ప్రాణ హరీక్షలే. టీచర్లు రెడ్‌ ఇంక్‌ పెన్‌ తీసేది ఈ పేపర్లు దిద్దడానికే. సరిగ్గా మధ్యకు మడిచిన ఆన్సర్‌ షీట్ల కట్టతో సార్లు క్లాసులో అడుగుపెడితే పిల్లల పై ప్రాణాలు పైనే పోయేవి. టీచర్లు, సార్లు కూడా పిల్లల్ని టెన్షన్‌ పెట్టడంలో సృజనాత్మకత చూపేవారు. మొదట క్లాస్‌ టాపర్‌ పేపరు ఇచ్చేవారు. ఆ తర్వాత సెకండ్, థర్డ్‌ వచ్చినవాళ్ల పేపర్లు.

25కు పదిహేను మార్కులు తెచ్చుకున్నవారందరూ సేఫ్‌ జోన్‌లో ఉండేవారు. 15 కంటే తక్కువ వచ్చిన వారి పేపర్లు రాగానే సార్ల చేతిలో బెత్తం ప్రత్యక్షమయ్యేది. 14,13,12... మార్కులు తగ్గేకొద్దీ వీపులు చిట్లుతూ ఉండేది. చివరి పేపర్‌ వైపు అందరూ బిక్కుబిక్కుమంటూ చూసేవారు. ఆ పేపరు ఒకటో రెండో మార్కులు వచ్చిన స్టూడెంట్‌ది. ఆ స్టూడెంట్‌ పెట్టే పెడబొబ్బలను వినలేక స్కూల్‌ అటెండర్‌ టంగ్‌ టంగ్‌మని బెల్‌ కొట్టేస్తే తప్ప కోటింగ్‌ నిలిచేది కాదు.

పది మొదలు.. టెన్షన్‌ మొదలు
సరే. పదో క్లాసులో చేరినప్పటి నుంచి ఫైనల్‌ ఎగ్జామ్స్‌ టెన్షన్‌ విద్యార్థుల్లో ఊరూ వాడా దానయ్య దానమ్మ అందరూ ప్రవేశ పెట్టేవారు. టెన్త్‌ ఫెయిల్‌ కావడం అవమానం. ఫెయిల్‌ తప్పక చేసే రెండు సబ్జెక్ట్‌లు ఇంగ్లిష్, గణితం ఎలాగూ ఉండేవి. ఒకరికి ఇంగ్లిష్‌ అంటే కోల్డ్‌ అండ్‌ ఫీవర్‌. మరొకరికి లెక్కలంటే వామ్టింగ్స్‌ అండ్‌ మోషన్స్‌. ఆ రోజుల్లో ఎంత పేద తల్లిదండ్రులైనా టెన్త్‌ క్లాస్‌కు వచ్చిన తమ పిల్లల్ని ట్యూషన్‌లో చేర్పించేవారు. లెక్కలు రాకపోతే స్కూల్‌లో ఎలాగూ దెబ్బలు పడేవి.

ట్యూషన్‌లో కూడా అవే లెక్కలు రావు కనుక అక్కడా దెబ్బలు పడేవి. సాయంత్రం ఆరు నుంచి ఎనిదిన్నర వరకూ వదలకుండా ట్యూబ్‌లైట్ల వెలుతురులో తెగ చదివించేవారు. వారంలో ఆరురోజులు స్కూల్లో చదివితే ఆదివారం ట్యూషన్‌లో చదవాల్సి వచ్చేది. ఇంగ్లిష్‌ పొయెమ్‌ అప్పజెప్పడం అన్నింటి కంటే పెద్ద టార్చర్‌.

మొదటి రెండు లైన్లు చెప్పాక మూడో లైను దగ్గర ఆగి దిక్కులు చూస్తే చాక్‌పీస్‌ ముక్క గురి చూసి వచ్చి ముక్కుకు తగిలేది. చెక్క డస్టర్‌ నెత్తిని టప్‌టప్‌మని తాకేది. వెదురు బెత్తం దూకుడు ఏకుడు మీదుండేది. ట్యూషన్లు కాకుండా పాఠశాల, రాఘవేంద్ర, బూన్‌ గైడ్లు తల కింద పెట్టుకుని పడుకున్నా ఏమీ ఎక్కేది కాదు. టెన్త్‌ పాసైతే కాలేజీకి వెళ్లొచ్చు. కాని టెన్త్‌ పాసవడం చాలా పెద్ద విషయం. 100కి 35 మార్కులు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో విద్యార్థులది 35 మార్కుల కల.

పరీక్షలు... క్వశ్చన్‌ పేపర్లు
ఎగ్జామ్స్‌ మొదలవుతుండగా టెన్త్‌ చదివే పిల్లల డాబాల మీద, పెరళ్లల్లో బల్బులు లాగి వెలిగించేవారు. రాత్రిళ్లు తల్లులు టీ పెట్టి ఇచ్చేవారు. కంబైన్డ్‌ స్టడీలో పిల్లలు ఎవరేం చదువుతున్నారో తెలియనంత పెద్దగా చదివేవారు. ఆ తర్వాత హాల్‌టికెట్లు వస్తే వాటిని దేవుడి దగ్గర తప్ప మరెక్కడా పెట్టేవారు కాదు. దేవుడికి ఇదంతా టెన్షనే. అయితే మెయిన్‌ పేపర్‌ కాకుంటే బిట్‌ పేపర్‌గా ఆ రోజుల్లో పరీక్షలు సాగేవి.

మెయిన్‌ పేపర్‌ సరిగ్గా రాయలేకపోయినా వారినీ వీరిని అడిగి బిట్‌ పేపర్‌ ఏ, బి, సి, డిలు పెడితే ఎలాగోలా పాస్‌ అయిపోతామని భావించేవారు. నిజం కూడా. చాలామంది ఇన్విజిలేటర్లు 3 గంటల ఎగ్జామ్‌లో మొదటి రెండున్నర గంటలు స్ట్రిక్ట్‌గా ఉండి చివరి అరగంట చూసీ చూడనట్టు ఉండేవారు. అప్పుడు అందరూ బిట్లు చెప్పుకునేవారు. ఈలోపు ఏ గారాలబిడ్డ తండ్రో బిట్‌ పేపర్‌ సంపాదించి బయట నుంచి మొత్తం 30 బిట్ల ఆన్సర్‌ను ఒక చిట్టి మీద రాసి లోపల వేయించేవాడు.

అంటే 30కి 30 వచ్చేస్తాయన్నమాట. ఇక సెంటిమెంట్‌ చొక్కా, సెంటిమెంట్‌ పెన్, సెంటిమెంట్‌ ప్యాడ్‌... ఇవన్నీ తప్పనిసరి. పరీక్షలు జరిగినన్ని రోజులు ‘పేపర్‌ ఈజీనా టఫ్ఫా’ అనే ప్రశ్న వినబడుతూనే ఉండేది. అందరూ ఈజీగా పరీక్ష రాసేస్తే కొందరు స్టూడెంట్స్‌కు నచ్చేది కాదు. టఫ్‌గా వచ్చిన రోజు క్లెవర్లు ముసిముసి గా నవ్వుకుంటూ ఇల్లు చేరేవారు.

జీవితంలో మంచి ఉపాధి పొందడం తప్పనిసరి. కాని ఒక నిర్దిష్ట సమయంలో చూపే తెలివితేటలే మన మొత్తం తెలివికి కొలమానాలు కాబోవు. చిన్న చిన్న తప్పొప్పులు పరీక్షల్లో సహజం. కనుక మనకు వచ్చింది హాయిగా రాసి భారం కాలం మీద వేయడమే పరీక్షలు జరిగేన్ని రోజులు చేయవలసిన పని.

అందరూ బాగా పరీక్షలు రాయాలని కోరుకుందాం.
 టెన్త్‌ బాగా చదివి పాస్‌ కావడానికి తల్లిదండ్రులు గిఫ్ట్‌ల ఆశ చూపేవారు. అబ్బాయిలకు సైకిల్‌ కొనిపెట్టడం చాలా పెద్ద గిఫ్ట్‌. అమ్మాయిలకు పట్టుపావడ, పాపిట బిళ్ల, కొత్త గజ్జెలు... ఇలాంటి తాయిలాల వరుస ఉండేది. డబ్బున్న తల్లిదండ్రులు ‘నువ్వు పాసైతే వెయ్యి రూపాయలు ఇస్తా’ అనేది ఆ రోజుల్లో రికార్డు మొత్తం లంచం. వీరే కాకుండా మేనత్త మేనమామలు కొత్త బట్టలు కొనిస్తామని, హెచ్‌ఎంటి వాచీ అని, తిరపతి తీసుకెళతామని... ఉపాధ్యాయులు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ‘హీరో పెన్‌’కొనిస్తామని హామీ ఇచ్చేవారు. ఇక లాస్ట్‌ ఎగ్జామ్‌ రాసినరోజు సినిమాకు, ఐస్‌క్రీమ్‌కు వంద రూపాయలు ఇవ్వడం అనేది కామనాతి కామన్‌.

మరిన్ని వార్తలు