మామిడి తోటల సంరక్షణ.. సీవీఆర్‌ మెళకువలు

2 Aug, 2022 18:46 IST|Sakshi

వర్షాకాలంలో మామిడి తోటల సంరక్షణకు మట్టి సేద్య నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఈ సూచనలు చేశారు.

మామిడి ప్రూనింగ్‌ చేయటానికి ముందు లేదా చేసిన తర్వాత ప్రతీ చెట్టుకు 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు+ 50 నుంచి 100 కిలోల లోపలి మట్టి (సబ్‌ సాయిల్‌.. అంటే భూమిలో 2 నుంచి 4 అడుగుల లోతు నుంచి తవ్విన మట్టి) + 5 కిలోల ఆముదం పిండి (హై డెన్సిటీ ప్లాంటింగ్‌లో అయితే ఆముదం పిండి చెట్టుకు 2 కిలోలు చాలు) వేసుకోవాలి.

మట్టి, ఎరువు, ఆముదం పిండిని ఈ పాళ్లలో కలిపిన (130 కిలోల) మిశ్రమాన్ని సీజన్‌కు ఒకసారి ప్రతి చెట్టుకూ డ్రిప్పర్ల దగ్గర వేసుకోవచ్చు. ఆ తర్వాత, ప్రతి 15 రోజులకోసారి.. డ్రిప్పర్ల దగ్గర 2 కిలోల చొప్పున పై మట్టి (టాప్‌ సాయిల్‌) + లోపలి మట్టి కలిపిన మిశ్రమాన్ని వేసుకుంటే పోషకాల లోపం రాకుండా ఉంటుంది.

చెట్టు ఎదుగుదల సంతృప్తికర స్థితికి వచ్చేంత వరకు ప్రతి 15 రోజులకోసారి వెయ్యాలి. అయితే, చెట్టుకు ఈ విధంగా 130 కిలోల మిశ్రమాన్ని ఒకటేసారి కాకుండా దాన్ని 4 భాగాలుగా విభజించి.. 20 రోజులకు ఒక్కో భాగాన్ని వేసుకోవచ్చు. అటువంటప్పుడు ఇక డ్రిప్పర్ల దగ్గర 15 రోజులకోసారి 2 కిలోల చొప్పున అదనంగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. 

అమావాస్య/పౌర్ణమికి ముందు పిచికారీ: 
200 లీటర్ల నీటిలో 20 కిలోల లోపలి మట్టి తో పాటు.. 2 కిలోల గోధుమ లేదా సోయా బీన్‌ మొలకల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చెయ్యాలి. సంతృప్తికర స్థితికి తోట ఎదిగేంత వరకు అమావాస్యకు ముందు, పౌర్ణమికి ముందు ఈ  మట్టి, మొలకల ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.

మరిన్ని వార్తలు