Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్’ అవార్డును ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్ అందుకున్నారు.
నల్లమల పర్వత ప్రాంతంలోని ఓ కుగ్రామంలో మొలకెత్తిన జ్ఞానవృక్షం ప్రొఫెసర్ బి. కోటేశ్వరరావు నాయక్. ప్రొఫెసర్ నాయక్ ఇప్పటివరకు 70 గొప్ప పరిశోధనా పత్రాలను వివిధ విద్యాలయాలకు సమర్పించారు. ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ లో ఆయన ఆరితేరినవారు. వినూత్నత, సాంకేతిక నిర్వహణలో నిపుణులు. ‘టెక్నో ఆంట్రప్రెన్యూర్షిప్’లో పరిపూర్ణత గలవారు. ఆయన సమర్పించిన సిద్ధాంత పత్రాలు యు.ఎస్.ఎ. జపాన్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, అబు–దాబి, థాయ్లాండ్ల విశ్వవిద్యాలయాలకు కరదీపికలయ్యాయి.
మాటల్లో వర్ణించలేను
తల్లిదండ్రుల సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం వారి సంతోషాన్ని చూడడం జీవితకాలపు సంతోషం అందించింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఇంతమందిని గుర్తించి, సన్మానించడం సాధారణ విషయం కాదు. సాక్షి గ్రూప్కి, జ్యూరీకి ధన్యవాదాలు.
– ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావు నాయక్