Sakshi Excellence Awards అవార్డు మరింత స్ఫూర్తినిస్తుంది: అరుణ్‌ డేనియల్‌ ఎలమటి

25 Sep, 2021 11:36 IST|Sakshi

Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్‌ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌–సోషల్‌ సర్వీస్‌’ అవార్డును యంగిస్తాన్‌ ఫౌండేషన్‌ స్థాపకుడు అరుణ్‌ డేనియల్‌ ఎలమటి అందుకున్నారు.

కష్టాల్లో ఉన్నవారికి తన వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో 2014లో హైదరాబాద్‌లో ‘యంగిస్తాన్‌ ఫౌండేషన్‌’ ను స్థాపించారు అరుణ్‌. కోవిడ్‌ వల్ల నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తిండి లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 20 లక్షల మందికి ఆహారం అందించింది ఈ సంస్థ. నల్లమల అటవీప్రాంతంలో అష్టకష్టాలు పడుతున్న గిరిజన కుటుంబాలకు నెలవారీ వంటసామాను సరఫరా చేశారు. మూగజీవాలకు కూడా ఆహారాన్ని అందించి వాటిపట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు.. సోషల్‌ మీడియా ద్వారా మానసిక ఆరోగ్యం, గృహహింస, లింగవివక్ష, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తదితర విషయాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు.

సేవకు స్ఫూర్తి
సేవా రంగంలో ముందుకు వెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాకు చాలా థ్యాంక్స్‌. ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవడానికి, మరింత మందికి సేవలు అందించడానికి ఈ పురస్కారం స్ఫూర్తిని ఇస్తుంది. 
– అరుణ్‌ డేనియల్‌ కుమార్, యంగిస్తాన్‌

మరిన్ని వార్తలు