స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు

25 Sep, 2021 02:30 IST|Sakshi
సాక్షి మీడియా ప్రతిభా పురస్కార ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న వై.ఎస్‌. భారతీరెడ్డి

అన్నం పెట్టే అన్నదాతలు, ఆపన్నులకు ఆసరా ఇచ్చే సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, పర్వతాల మెడలు వంచిన పరాక్రమవంతులు.. ఇంకా ఎందరో స్ఫూర్తి ప్రదాతల విజయాలకు సాక్షి పట్టం కట్టింది.. పురస్కారాలు అందించింది. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్‌ సాగరికా ఘోష్‌ ముఖ్య అతిథిగా... అతిరథ మహారథుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నవారి స్పందనలు వారి మాటల్లోనే.

తెలుగు వారందరి మీడియా
నిజాలు తెలిపే నిష్పాక్షిక మీడియా గ్రూప్‌గా సాక్షి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రలో అందరికీ ఇష్టమైన మీడియా గ్రూప్‌ సాక్షి, ఈ తరహా కార్యక్రమాల ద్వారా ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్న చైర్‌ పర్సన్‌ భారతీ రెడ్డి కృషి ఎంతైనా అభినందనీయం. విభిన్న రంగాల్లో విజేతలను గుర్తించడం, వారి విజయాలను వెలుగులోకి తీసుకురావడం, గొప్ప కార్యక్రమం. స్ఫూర్తి దాయక విజయాలతో పురస్కారాలు దక్కించుకున్న విజేతలను, వివేకానందుని మాటలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి పురస్కారం ప్రకటించడం, అమర జవాన్‌ బాబూరావు వంటివారిని పురస్కరించడం ద్వారా సరైన విజేతలను ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలకు అభినందనలు
– ముఖ్య అతిథి తమిళసై, గవర్నర్, తెలంగాణ

కట్టా సింహాచలం
‘తెలుగు పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’
ఆయనది అగాథం నుంచి అత్యున్నత శిఖరానికి సాగిన ఒక జైత్రయాత్ర. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో జన్మించిన సింహాచలం బాల్యంలోనే చూపు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్రా బ్లైండ్‌ స్కూల్‌లో చదువుకున్న తరువాత, ఆర్వీఆర్‌ కాలేజీలో బిఏలో చేరారు. బీఈడీలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకు సాధించి, విశాఖలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌లో చేరి కోర్సు పూర్తి చేశారు.

ఆ తరువాత కేంద్రీయ విద్యాలయలో అధ్యాపకునిగా చేరారు. అక్కడితో ఆగిపోలేదు. సివిల్స్‌కు ప్రిపరేషన్‌ మొదలెట్టారు. ఐఆర్‌ఎస్‌కు సెలెక్టయినా మరోసారి సివిల్స్‌ అటెంప్ట్‌ చేశారు. 2019 లో జాతీయ స్థాయిలో 457వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అక్షరమనే ఆయుధంతో తనను చుట్టుముట్టిన ప్రతికూలతలను ఛేదిస్తూ గమ్యాన్ని ముద్దాడిన సింహాచలం ఎంతోమంది విద్యార్థులకు నిలువెత్తు స్ఫూర్తి. ప్రస్తుతం రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

గొప్ప గౌరవం
చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో ఇదో గొప్ప గౌరవం. ఈ గౌరవం  నా కృషిలో నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుందని భావిస్తూ మరికొంత మందికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను.
– కట్టా సింహాచలం, ఐ.ఎ.ఎస్, సబ్‌ కలెక్టర్‌

కట్టా సింహాచలం, ఐఏఎస్‌కు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్‌. భారతీరెడ్డి

మీడియా ప్రాథమ్యాలు మారాలి
ఒక చక్కని, అద్భుతమైన కార్యక్రమాన్ని సాక్షి నిర్వహిస్తోంది. ఇటీవలే మేం కూడా సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌లో ఇండియా పాజిటివ్, రియల్‌ హీరోస్‌ పేరిట ఇలాంటి పురస్కార ప్రదాన కార్యక్రమాలు ప్రారంభించాం. కేవలం చెడు వార్తలు, రాజకీయాలు మాత్రమే చూడడం పాక్షిక దృష్టి మాత్రమే అవుతుంది.. మనది సుసంపన్న దేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్న వ్యక్తులున్నారు. ఎన్నో విశేషాలున్నాయి. మీడియా ప్రాథమ్యాలు మారాలని కోరుకుంటున్నా. వాస్తవిక అంశాలు, వాస్తవమైన పరిస్థితులు, విజయవంతమైన వ్యక్తుల ప్రయాణాలపై మీడియా మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాక్షి ఎంపిక చేసిన అవార్డు గ్రహీతలు స్ఫూర్తిదాయకమైన రియల్‌ హీరోస్, మోడల్‌ సిటిజన్స్‌.

–సాగరికా ఘోష్, ప్రముఖ పాత్రికేయురాలు, సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌

పారదర్శకంగా ఎంపిక
సాక్షి మీడియా మాకు విజేతల ఎంపికలో ఎంతో స్వేచ్ఛనిచ్చింది. న్యాయనిర్ణేతల బృందంలో రిటైర్డ్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులతో సహా మరెందరో ప్రముఖులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా, పారదర్శకంగా విజేతల ఎంపిక జరిగింది. విజేతలు ఇలాగే భావితరాలకు  తమ విజయ పరంపర కొనసాగించాలని, రోల్‌ మోడల్స్‌గా మారాలని కోరుకుంటున్నాను.

– నరేంద్ర సురానా, చైర్‌మన్, న్యాయనిర్ణేతల జ్యూరీ
ఎండి, సురానా టెలికామ్‌

డాక్టర్‌ చావా సత్యనారాయణ
‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’
వ్యాపారం అంటేనే రిస్క్‌. రిస్క్‌ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్‌. అదే డెవలప్‌మెంట్‌. రిస్క్‌ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్‌ అండ్‌ డి. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌. సేఫ్‌ గేమ్‌. కానీ.. లారస్‌ ల్యాబ్స్‌ తన సేఫ్‌ని చూసుకోలేదు.  మొదటే ఆర్‌ అండ్‌ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్‌ ల్యాబ్స్‌ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు!  రెస్పెక్ట్‌ – రివార్డు – రీటెయిన్‌.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్‌ నిర్మాణం జరిగింది.

నాలుగో స్తంభం డాక్టర్‌ చావా సత్యనారాయణ.  ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్‌ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్‌లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్‌ ల్యాబ్‌ వ్యవస్థాపన (2005 హైదరాబాద్‌) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు.  సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది.
సమష్టి కృషి ఫలితం..
ఈ అవార్డ్‌ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో భాగమైన అందరి కృషికీ ఇదో గొప్ప గుర్తింపు. మా సంస్థ సభ్యులు అందరి తరపున సాక్షికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
– డా. చావా సత్యనారాయణ, ఫౌండర్‌ అండ్‌ సియీఓ, లారస్‌ ల్యాబ్స్‌

డా.సత్యనారాయణ చావాకు పురస్కారాన్ని అందిస్తున్న గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్, వై.ఎస్‌. భారతీరెడ్డి

 డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి
‘తెలుగు ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌’
విద్యుత్‌ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్‌ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్‌ రెడ్డి అక్కడే హైస్కూల్‌ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్‌.వి మెడికల్‌ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్‌ పూర్తి చేశారు. హౌస్‌ సర్జన్‌ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్‌ స్టేట్‌ మెడికల్‌ సెంటర్లో ఇంటర్నల్‌ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్‌ పూర్తి చేశారు.

1981లో సదరన్‌ కాలిఫోర్నియాలో మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్‌ ప్రొసీజర్స్‌ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు  తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్‌ కేర్‌ మెడికల్‌ గ్రూప్స్‌’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్‌ గ్రూప్‌ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్‌ కేర్‌ హాస్పిటల్‌ని నిర్మించారు.  ఇప్పుడు ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో యు.ఎస్‌.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.  యు.ఎస్‌.లో టాప్‌–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్‌ కేర్‌ గుర్తింపు పొందింది.  ఒక చారిటబుల్‌ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.

పల్లె విలువలే పురస్కారాలు..    
ఈ పురస్కారం అందుకోవడం చాలా గర్వకారణం. అమెరికాలో ఉంటున్నా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెటూళ్లో నేర్చుకున్న విలువలు మాకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా, అనుసరణీయాలుగా ఉన్నాయి. ఈ పురస్కారం అందుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
డా.ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, ప్రముఖ వైద్యులు, (అమెరికా నుంచి వీడియోబైట్‌)


సాగరిక ఘోష్‌ నుంచి డా.ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి తరఫున అవార్డు అందుకుంటున్న వైస్‌ ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్, బాలకృష్ణ,

మరిన్ని వార్తలు