ఇప్పటికీ వృద్ధుల పట్ల ఈసడింపు, చీదర ఎక్కువే.. కానీ!

6 Aug, 2021 13:59 IST|Sakshi

జీవన సంధ్య కోసం జాగ్రత్తలు

మనిషి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు సహజం. వృద్ధాప్యమంటే మరోమారు బాల్యదశకు చేరినట్లేనని పెద్దలు చెపుతుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం ముదిరేకొద్దీ వారిని పసిపిల్లల్లాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వయసుపైబడుతున్న కొద్దీ ప్రతి జీవిలో అనేక జైవిక మార్పులు జరుగుతుంటాయి. మనుషుల్లో వయసు మీరే కొద్దీ  జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం, మతిమరుపు పెరగడం వంటివి గమనించవచ్చు. వృద్ధాప్యం ముదిరే కొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెరుగైన ఆరోగ్య విధానాలు అందుబాటులోకి రావడంతో మనిషి జీవన ప్రమాణం పెరుగుతోంది. అదేవిధంగా వృద్ధాప్య సమస్యలకు పరిష్కారాలు కూడా పెరిగాయి.

ఇప్పటికీ సమాజంలో వృద్ధుల పట్ల ఈసడింపు, చీదర ఎక్కువగానే గమనించవచ్చు. కానీ ప్రతిఒక్కరూ ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్లేనని గుర్తించి పెద్దలపై, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజ విచ్ఛిన్నం జరుగుతుందని మానవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులను భారంగా పరిగణించేవారు అసలెందుకు వృద్ధాప్యంలో సమస్యలొస్తాయో అవగాహన పెంచుకోవడం అవసరమన్నది నిపుణుల మాట. అలాగే ఎవరమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు సైతం ఈ అవగాహన ఉపయుక్తంగా ఉంటుంది. సో, జీవన సంధ్య వేళ సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం!

వయోవృద్దుల్లో జీర్ణక్రియ మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోతుంటారు. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణతకు, కండరాల బలహీనతకు, అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే తినేది కొంచమైన పౌష్టికాహారం తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ తినలేకపోతే, కొద్దికొద్దిగా పలుమార్లు ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.  దైనందిన ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, సాల్ట్, ఫ్యాట్‌ కలిగిన ఆహారాలను తగ్గించాలి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.

డిప్రెషన్‌ను అధిగమించేందుకు
సాధారణంగా వృద్ధాప్యంలో డిప్రెషన్‌ వస్తుంది. అంతవరకు ఎంతో చురుగ్గా తిరుగుతూ అందరినీ శాసించినవారు క్రమంగా నిస్సహాయత ఆవరించడంతో ఏపని చేసుకోలేక డిప్రెషన్‌ బారిన పడుతుంటారు. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నిరశా నిస్పృహలకుదారి తీస్తాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, కుటుంబం, స్నేహితుల సాయంతో ఉల్లాసంగా గడపడం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్‌  ఛాయలు మనసులోకి రాకుండా చూసుకోవడం చేయవచ్చు.

ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.
చిన్నప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తూ వచ్చిన చెవులు, కళ్లు, నోరు వయసు ముదిరేకొద్దీ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. దీంతో చెవుడు, చూపు మందగించడం, పంటి సమస్యలు ఎదురవతుంటాయి. కళ్లజోడు, హియరింగ్‌ ఎయిడ్స్‌తో ఈ సమస్యలను అధిగమించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీతో వినికిడి, దృష్టి లోపాలను ముందస్తుగానే గుర్తించవచ్చు. అదేవిధంగా పెద్దయ్యేకొద్దీ వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం, ఇతర రకాల అనారోగ్య సమస్యలతో పళ్లు దెబ్బతినడం, నోరు పొడిబారడం, చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల మొదటి నుంచి డెంటల్‌కేర్‌పై దృష్టి సారించాలి. ధూమపానం, పాన్‌ పరాగ్, తంబాకు వంటి అలవాట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.

మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది
కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్‌లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. 

మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు
కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్‌లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. 

మరిన్ని వార్తలు