గొంతు నొప్పి చాలా రోజుల నుంచి ఉందా? కారణాలు ఇవే

2 Nov, 2022 13:41 IST|Sakshi

గొంతు నొప్పి ఉంటే చాలు, దానికి జలుబుకు ఆపాదించుకొని యాంటీబయాటిక్స్ మింగుతుంటారు. కొంతమందిగాని అది సరైన పద్ధతి కాదు. గొంతు నొప్పికి కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే..

1. అంగిటి_ముల్లు (టాన్సిలైటిస్)
జలుబుకు కారణమైన వైరస్ క్రిములు గొంతు నొప్పిని కూడా కలిగించే అవకాశం ఉంది. బయట వాతావరణం నుంచి ఇన్ఫెక్షన్లు శరీరంలోనికి ప్రవేశించేటప్పుడు గొంతు లోపల ఇరుపక్కలా ఉండే టాన్సిల్స్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. 

టాన్సిల్స్ ఇన్ఫెక్షన్‌ను వైరస్ క్రిముల వల్లనే రావాలని లేదు; బ్యాక్టీరియా వాళ్ళ కూడా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో టాన్సిల్స్ మీద చీముతో కూడిన తెల్లని పొక్కులు కనిపిస్తాయి. తీవ్రస్థాయిలో జ్వరం వస్తుంది. ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. దీనిని 'కాంచనార గుగ్గులు' వంటి గ్రంథులమీద పని చేసే మందులతో చికిత్స అందించాల్సి ఉంటుంది.

అసలు టాన్సిల్స్ అనేవి లేకపోతే వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తే ఉండదు. అనే భావనతో కొంతమంది టాన్సిలెక్టమీ కోసం డాక్టర్ మీద ఒత్తిడి తీసుకువస్తుంటారు కానీ ఇది సరైన భావన కాదు. టాన్సిల్ అడ్డుగా కనుక లేకపోతే ఇన్ఫెక్షన్ నేరుగా శరీరంలోకి ప్రవేశించి గుండె మొదలైన ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

ఆయుర్వేదంలో పరిష్కారాలు : 
1. పటిలను (పావు చెంచా) వేడి నీళ్ళలో (కప్పు) వేసి గొంతుకు తగిలేలా పుక్కిట పట్టాలి.
2. త్రిఫలాచూర్ణం (చెంచాడు) నీళ్ళలో వేసి కషాయం కాచి పుక్కిట పట్టాలి.
3. వెల్లుల్లిని ముద్దుచేసి, రసం పిండి కొద్దిగా వేడి చేయాలి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి.
 4. పసుపు, మిరియాల చూర్ణాలను (చిటికెడు) వేడి పాలతో తీసుకోవాలి.
ఔషధాలు: కాంచనార గుగ్గులు, లఘుమాలినీవసంత రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తిరసం, ఇరిమేదాది తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసాకంటకారిలేహ్యం, కఫకేతురసం, తుండికేరి రసం.

గ్లాండ్యులర్_జ్వరం:
ఎప్ స్టీన్ - బార్ వైరస్ వల్ల కలిగే గ్లాండ్యులర్ ఫీవర్ లో దీర్ఘకాలం పాటు టాన్సిల్స్ వాపు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన కొత్తలో టాన్సిల్స్ నొప్పి మొదలై చాలా రోజుల పాటు ఏ మందులకూ లొంగకుండా అలాగే ఉండిపోతుంది. దీనితోపాటు ఎడతెగని ఒళ్లు నొప్పులు, నీరసం, అనుత్సాహం వంటి శారీరక లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనిని అశ్వగంధ, విష్ణుప్రియ వంటి 'ఇమ్యునో మాడ్యులేటింగ్' మూలికలతో చికిత్సించాల్సి ఉంటుంది.
ఔషధాలు: అశ్వగంధాదిలేహ్యం, అమృతప్రాశఘృతం, చ్యవనప్రాశాలేహ్యం, కూష్మాండలేహ్యం, నారాసింహఘృతం, విదార్యాదిఘృతం, సుకుమారరసాయనం.

గొంతులో ఆహారేతర పదార్ధం:
కొంతమంది మాంసాహారం తినేటప్పుడు అలవాటుగా బొమికలను కూడా తింటుంటారు. ఒకవేళ వీటిని సరిగా నమలకుండా కనుక తిన్నట్లయితే అవి గొంతు లోపల గుచ్చుకొని గాయమై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే, కొన్ని సందర్భాల్లో బొమికల ముక్కలు, చేపలముళ్లు గొంతులో ఇరుక్కొని నొప్పిని కలిగించే అవకాశం ఉంది. వైద్య సహాయంతో వీటిని తొలగించాల్సి ఉంటుంది

శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫీలియా):
కొంతమందిలో ఏ ఇన్ఫెక్షనూ లేకపోయినప్పటికీ గొంతు నొప్పి వస్తుంటుంది. ఎలర్జీలు దీనికి ప్రధానమైన కారణం. సిగరెట్ పొగ, పాత పుస్తకాల వాసన, దుమ్ము, ధూళీ అవసరాలని మించి మాట్లాడటం వంటి కారణాల మూలంగా ఎలర్జీ ఏర్పడి గొంతు లోపలి మ్యూకస్ పొర ఇరిటేట్ అవుతుంది. తత్కారణంగా గొంతునొప్పి వస్తుంది. కారణాలను జాగ్రత్తగా తరచి చూసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి.

ఔషధాలు: దశమూలారిష్టం, ఏలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మకరధ్వజ మాత్రలు, స్వచ్ఛంద భైరవ రసం, తాళీసాది చూర్ణం,
బాహ్యప్రయోగాలి - చంద్రకళా లేపం, రాస్నాది చూర్ణం, కర్పూరాది తైలం.

ఆమ్లపిత్తం (ఎసిడిటి /హార్ట్ బర్న్):
అజీర్ణం, ఎసిడిటి, గ్యాస్ వంటి కారణాల వల్ల అమాశయంలో ఉండాల్సిన ఆమ్ల పదార్ధం అన్న నాళిక ద్వారా గొంతులోనికి ఎగదన్ని అక్కడ నొప్పినీ, మంటనూ కలిగించే అవకాశం ఉంది. దీనికి ఆయుర్వేద శాస్త్రం సూచించిన 'ఆమ్లపిత్త హర చికిత్సలు" చేయాల్సి ఉంటుంది. టీ, కాఫీ, సిగరెట్ల వంటి వాటిని మానేసి పాలు వంటి సాత్వికాహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

1. ఆహారం కొద్దిమొత్తాలలో తినాలి.
2. కారం, పులుపు, మసాలాలు తగ్గించాలి.
3. ధూమపానం మద్యపానాలు పనికిరావు.
 4. బరువు తగ్గాలి.
5. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి.

ఆయుర్వేదంలో సలహాలు : 
1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. 
3. అతి మధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి.
 4. తిప్పసత్తును రేగు గింజంత మోతాదుగా చన్నీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామధుఘరసం, శంఖ భస్మం, సూతశేఖర రసం, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం.

కంటసుధరకవటి
ఉపయోగాలు : గొంతు నొప్పి , జలుబు, దగ్గు, గొంతులో గరగర, గురక రావటం 

డా.నవీన్‌ నడిమింటి, హోమియో వైద్యులు

మరిన్ని వార్తలు