అల్లాహ్‌ మాసం మొహర్రం

28 Aug, 2020 01:21 IST|Sakshi

సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. ఇస్లాం ధర్మం ప్రకారం సంవత్సరంలోని పన్నెండు మాసాలూ శుభప్రదమైనవే. పన్నెండులో నాలుగు మాసాలు అత్యంత గౌరవప్రదమైనవి. అందులో ‘మొహర్రం’ ఒకటి. 

ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం
‘పన్నెండు మాసాలు ఒక సంవత్సరం. అందులో నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి. జీఖాద, జిల్‌ హజ్జ, ముహర్రమ్, రజబ్‌. (బుఖారి 3197). కనుక ఈ మాసంలో ఇతర మాసాలకంటే ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవభీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ మాసం ఘనతకు సంబంధించి ముహమ్మద్‌ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్‌ మాసం. రమజాన్‌ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్‌ ముస్లిం:  2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్‌ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్త వస్త్రం కప్పబడేది. (బుఖారి 1592). 

ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ)ను, ఆయన జాతిని ఫిరౌన్‌ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈరోజు ఉపవాసం పాటిస్తాము’. అని చెప్పారు.

అప్పుడు ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం. అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ఆషూరా ఉపవాసం కేవలం యూదులే కాదు, క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9, 10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (ముస్లిం 1162).

కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంతమాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమో గాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒకవిశ్వాసి పోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ మాసంలో ఆయనగారి త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు.

సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం  జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రస్తుత తరుణంలో దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఇదే ఇమామె హుసైన్‌ అమరత్వం మనకిస్తున్న సందేశం. (30న ఇమామె హుసైన్‌ (ర) వర్ధంతి యౌమె ఆషూరా సందర్భంగా..) – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు