ఎటాక్‌.. స్ట్రోక్‌ వేర్వేరు...

12 Mar, 2023 21:36 IST|Sakshi

సాధారణంగా గుండె నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకోవాలి. కానీ కొందరికి 250 సార్లు.. మరికొందరికి 60 కన్నా తక్కువ సార్లకు పడిపోతోంది. ఈ కారణంగా జిమ్‌ల్లో వ్యాయామం చేస్తూనే, డీజే పాటలకు నృత్యం చేసూ్తనే కుప్పకూలుతున్నట్లు తెలుస్తోంది. గుండె కొట్టుకోవడంలో ఏర్పడే తేడాల కారణంగా రక్త సరఫరా నిలిచిపోవడం కూడా  కుప్పకూలడానికి, మరణాలకు కారణమవుతోంది.

ఇటీవల వెలుగుచూసిన ఘటనల్లో ఇవి కొన్ని మాత్రమే. గతంలో యాభై ఏళ్లు లేదంటే అరవై ఏళ్లు దాటితేనే గుండెపోటు వస్తుందనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం వయోబేధం లేకుండా ఎవరికైనా గుండెపోటు వచ్చి ప్రాణాలపైకి తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య జిల్లాలో నానాటికీ పెరుగుతోంది. వ్యాయామం చేస్తూ, నృత్యం చేసూ్తనో, నడుచుకుంటూ వెళ్తున్న వారు అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉన్న వారికి సైతం గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయి కన్నుమూయడం కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కొందరిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లేలోగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ఆకస్మిక మరణాలను సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు భయభ్రాంతులకు గుర వుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
ప్రస్తుతం జిల్లాలో చోటు చేసుకుంటున్న అకస్మిక గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న వయస్సులో ఆకస్మికంగా కుప్పకూలిపోయి పలువురు తనువు చాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఘటనలు ఎక్కువయ్యాయి. ఇంటర్, డిగ్రీ చదువుతున్న కుర్రకారే కాకుండా అంతకంటే చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో మృతి చెందటం భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా, మారిన జీవనశైలి, వృత్తి, ఇతర అంశాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత అనారోగ్యంతో మరణాల సంఖ్య పెరగటానికి కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, నియమిత ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేని జీవన శైలి కూడా కారణాలేనని చెబుతున్నారు.

► మధిర మండలం బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన కొట్టె మురళీకృష్ణ హైదరాబాద్‌లో గురువారం ఛాతినొప్పి వస్తోందంటూ కుప్పకూలి మృతి చెందాడు. త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాల్సి ఉన్న ఆయన మృతితో తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయారు.

► పెనుబల్లి మండలం గణేషన్‌పాడు పంచాయతీకి చెందిన రైతు మెట్టుల అశోక్‌ శుక్రవారం సాగు పనులు చేస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స మొదలుపెట్టే లోగా కన్నుమూశాడు.

► ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిన గుండాల మండలం రోళ్లగడ్డ తండాకు చెందిన మూడ్‌ పాషా ఇంట్లో శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి రాగా, శుక్రవారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. 

► బోనకల్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థి మరీదు రాకేష్‌ గుండెనొప్పి వస్తోందని చెప్పగా చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు.

ఎటాక్‌.. స్ట్రోక్‌ వేర్వేరు...
గుండె పనిచేయడం హఠాత్తుగా ఆగిపోవడాన్ని కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు. స్పృహ కోల్పోవడం, స్పందించకపోవడాన్ని కార్డియాక్‌ అరెస్ట్‌కు ప్రధాన సంకేతాలుగా చెప్పొచ్చు. ఇక మెదడుకు రక్త సరఫరా ఆగిపోవటాన్ని హార్ట్‌ స్ట్రోక్‌ అని అంటారు. అయితే సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల గుండె పోటు సంభవిస్తుంది. రక్తం గడ్డ కట్టినప్పుడు, రక్తనాళాలు కుచించుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయి గుండెపోటు వచ్చి మరణానికి దారితీస్తుంది.

తగిన జాగ్రత్తలు తప్పనిసరి
జీవన శైలిలో మార్పుల మూలంగా గుండె జబ్బులకు గురయ్యేవారు పెరుగుతున్నారు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ మితమైన ఆహారం తీసుకో వడం, కార్పోహైడ్రేట్లు, ప్రొటీన్స్‌ ఉండేలా ఆహారాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. ప్రతీరోజు 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఇటీవలి మరణాలకు పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలు కొంత మేర కారణం కాగా.. జీవన శైలిలో వచ్చే మార్పులు, ఒత్తిడి తదితర అంశాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. మరికొందరికి ఊపిరితిత్తులు, మెదడులో రక్తసరఫరా నిలిచిపోతుంది. వ్యాక్సిన్‌ మూలంగా ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయనే అపోహకు గురవుతున్నారు. కానీ ఇప్పటివకు ఈ విషయం నిర్ధారణ కాలేదు.      
– డాక్టర్‌ సీతారాం, గుండె వైద్య నిపుణులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

ఆహార అలవాట్లలో మార్పులు
ముఖ్యంగా ఇటీవల యువత ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటయ్యారు. దీంతో ఆ ప్రభావం శరీరంలోని అవయవాలపై పడి చిన్న వయస్సులోనే బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి తోడు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కూడా చిన్న వయస్సులోనే గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. ఆధునిక జీవన శైలికి అలవా టు పడిన మనిషి పూర్తిగా శారీరక శ్రమ మర్చిపోయా డు. వ్యాయామం లేకపోవటం కూడా శరీరం వ్యాధు ల బారిన పడడానికి ఓ కారణంగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు