Anitha Rao: మహిళా ట్రెక్కర్‌గా.. హార్స్‌ రైడింగ్‌, పెయింటింగ్‌లోనూ.. హ్యాట్సాఫ్‌!

8 Mar, 2022 17:17 IST|Sakshi

సాహసమే ఊపిరి

మురళీనగర్‌: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్‌ రైడింగ్‌తో సత్తా చాటుకుంటున్నారు.  సాహసయాత్రికురాలిగా, బైక్‌ రైడర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్‌ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు.

దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్‌లో బాలాజీ టవర్స్‌లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్‌ వి.రామకృష్ణ నేవీలో రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌  ఫైన్‌ ఆర్ట్స్‌  చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు.  

మహిళా ట్రెక్కర్‌గా..
ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్‌ సెక్షన్‌లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్‌లో స్పెషల్‌ కోర్సు చేస్తూ రెగ్యులర్‌ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్‌ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు.

విశాఖ యూత్‌ హాస్టల్‌ తరుఫున బృందాలకు టీమ్‌ లీడర్‌గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్‌లోని జవహర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ ఇన్‌స్టిట్యుట్‌లో 2015లో మౌంట్‌ ఇంజినీరింగు కోర్సు  చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్‌ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు.  

మౌంటినీరింగులో భాగంగా క్యాంప్‌ లీడరుగా లడక్‌లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్‌పాయింటుగా అయిన  ఒడిశాలోని ఈస్ట్రన్‌ ఘాట్స్‌లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా  అధిరోహించారు. 

హార్స్‌ రైడింగ్‌లో..
అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్‌ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్‌ రైడింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్‌ యాత్ర లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డులో నమోదయ్యింది.  

2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి  బైక్‌ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. 
ఈ రెండూ లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్‌ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేశారు. 

పెయింటింగ్‌లోనూ.. 
పెయింటింగ్‌లో ఆమె దిట్ట. పెన్సిల్‌ స్కెచింగ్, వాటర్‌ కలర్‌ పెయింగ్స్‌ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్‌లో  నిర్వహించిన పెయింటింగ్‌ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు