Diwali 2022: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి.. పండితులు ఏమంటున్నారు!

14 Oct, 2022 18:56 IST|Sakshi

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణాల్లో దీపావళి వెనక రెండు కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసున్ని సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా త్రేతాయుగంలో లంకలో రావణుడిని హతమార్చి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారని రామాయణం చెబుతోంది.

దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
ఈ ఏడాది దీపావళి పండుగ జరుపుకోవడంపై కొంత అయోమయం తలెత్తింది. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈనెల 24న జరుపుకోవాలని కొందరు భావిస్తుంటే మరికొంతమంది నవంబర్‌ 25న ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించారని కాబట్టి ఆరోజే పండుగ నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నారు.. దీంతో కాస్తా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమావాస్య రాత్రి తిథి ఉండగా దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

పంచాంగం, తిథి, వారం ప్రకారం చూసుకున్నా నవంబర్‌ 24వ తేదీన దీపావళి వేడక నిర్వహించుకోవాలని తెలిపారు. అక్టోబర్‌ 24 సోమవారం రోజు చతుర్ధశి తిథి సాయంత్రం 5 గంటల లోపు ఉందని, 5 గంటల తరువాత అమామాస్య ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్‌ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది.  అంటే 25న సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఉండదని వెల్లడించారు. రాత్రి సమయాల్లో అమావాస్య తిథి 24వ తేదీనే ఉండటం వల్ల ఆ రోజే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు.

ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. 

మరిన్ని వార్తలు