మూడుసార్లు బెయిలు నిరాకరణ.. ఎవరీ నవ్‌దీప్‌ కౌర్‌!

10 Feb, 2021 09:47 IST|Sakshi

‘‘భయపడొద్దు తల్లీ. ఓటమిని అంగీకరించొద్దు. చివరివరకు మనం పోరాడాలి. లేకుంటే వీళ్లు మనల్ని బతకనివ్వరు.’’ 
నవ్‌దీప్‌ కౌర్‌ తల్లి. 

‘‘కొన్నిసార్లు పోరాటమే మార్గం అవుతుంది. ఆ మార్గంలోనే మా అక్క నడుస్తోంది’’ 
నవ్‌దీప్‌ కౌర్‌ చెల్లెలు రాజ్‌వీర్‌ కౌర్‌. 

‘‘అతివాద మూకలు మన ఫొటోను మంటల్లో తగలబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఇండియాలో ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి’’. – నవ్‌దీప్‌ కౌర్‌ను విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తున్న ఒక యువతి ఫొటోను, ఉద్యమకారుల పోస్టర్‌లు తగలబెడుతున్న వారి ఫొటోనూ జత చేస్తూ కమలా హ్యారీస్‌ చెల్లెలి కూతురు మీనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టు. 

పంజాబ్‌ యువతి. వయసు 23. ప్రస్తుతం ఆమె పంజాబ్‌లోని కర్నాల్‌ జైల్లో ఉన్నారు. ఇరవై మూడేళ్ల ఈ దళిత యువతికి మొదట ఆమె తల్లి, చెల్లి మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఈ నెల 6న మీనా షేర్‌ చేసిన పోస్టుతో యావద్దేశమే కాదు, అమెరికాలోనూ నవ్‌దీప్‌ను వెంటనే విడుదల చేయాలని అక్కడి ఎన్నారైలు డిమాండ్‌ చేస్తున్నారు! జనవరి 12న పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. నేటికి 28 రోజులు. మూడుసార్లు కోర్టు ఆమెకు బెయిలు నిరాకరించింది!

ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేయడం, ఆ ప్రాంతంలోనే తను పని చేస్తున్న ఫ్యాక్టరీలో కొందరిని అకారణంగా తొలగించడాన్ని ప్రశ్నించడం ఆమె చేసిన నేరాలు! వ్యక్తిగా ఆమె నిరసన తెలియజేసినంత కాలం మౌనంగా ఉండి, అవకాశం కోసం చూస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆమె ‘మజ్దూర్‌ అధికారం సంఘటన్‌’ (మాస్‌)లో సభ్యురాలిగా చేరి ఒక్క నినాదం ఇవ్వగానే అరెస్ట్‌ చేయించి, జైల్లో పెట్టించింది. ఫ్యాక్టరీలో మహిళా కార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలను ‘మాస్‌’ అండతోనే బయటపెట్టగలిగారు నవ్‌దీప్‌ కౌర్‌. పర్యవసానమే.. జైలు నుంచి ఆమె బయటికి వచ్చే ద్వారాలు మూసుకుని పోవడం. 


నవ్‌దీప్‌ కౌర్‌కు మద్దతుగా కమలా హ్యారిస్‌ చెల్లెలి కూతురు మీనా పెట్టిన ట్వీట్‌. 

‘‘జైల్లో మా అక్కను చిత్రహింసలు పెడుతున్నారు. ఆమె కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవించడాన్ని తాము చూసినట్లు సహ ఖైదీలు మా అమ్మకు సమాచారం పంపారు. అమ్మ బాధపడింది. కానీ భయపడలేదు. ‘పోరాడకపోతే మన బతుకులు ఎప్పటికీ ఇంతే’ అని వర్తమానం పంపింది. మా అక్కడ ధైర్యవంతురాలు. కడవరకు పోరాడుతూనే ఉంటుంది’’ అని రాజ వీర్‌ కౌర్‌ తనని కలిసిన మీడియా ప్రతినిధి ఆస్తా సవ్యసాచితో అన్నారు. రాజ్‌వీర్‌ ఢిల్లీ యూనివర్సిటీలోనే చదువుతోంది. అక్కను బయటికి తెప్పించేందుకు ఆమే స్వయంగా ఎప్పటికప్పుడు లాయర్‌తో మాట్లాడుతోంది. వారి కుటుంబంలో రాజ్‌వీర్‌ ఒక్కరే ఇంత చదువు వరకు వచ్చింది. అక్క నవ్‌దీప్, తమ్ముడూ స్కూల్‌లో ఉండగానే చదువు మానేశారు. లాక్‌డౌన్‌ సమయంలో చేసిన పీకల్లోతు అప్పుల నుంచి తల్లిదండ్రులను గట్టెక్కించడానికి పంజాబ్‌ నుంచి ఢిల్లీ వచ్చి ఫ్యాక్టరీలో పనికి చేరారు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మీదే ఆమెను, ‘మాస్‌’ అధ్యక్షుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నవ్‌దీప్‌ కౌర్‌ పంజాబ్‌లోని దళిత సామాజిక వర్గమైన ‘మఝబీ సిక్కు’ల అమ్మాయి. నాలుగు నెలల క్రితమే ఆమె పని కోసం ఢిల్లీలో ఆ ఫ్యాక్టరీలో చేరారు. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్న రైతులతో గొంతు కలిపారు. ఇవన్నీ కూడా ఆమెను అక్రమంగా జైల్లో వేయించడానికి తోడ్పడ్డాయి. జైల్లో పెట్టిన రెండో రోజే.. జనవరి 14 నాటికి.. నడవలేని స్థితికి చేరుకున్నారు నవ్‌దీప్‌. వైద్య పరీక్షల్లో ఆమె రక్తస్రావానికి లైంగిక అకృత్యాలే కారణం అని నిర్థారణ అయినట్లు బయటికి పొక్కింది. మగ పోలీసులు ఆమెను జననావయంపై లాఠీతో కొట్టిన గుర్తులు బయటపడ్డాయి. జైల్లో నుంచి ఆమె ప్రాణాలతో బయటపడతారా అన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.

చదవండి: 
కష్టాలను ఎత్తి కుదేయండి

తల్లిదండ్రులున్నా అనాథగా పెరిగా

మరిన్ని వార్తలు