ఆహ్లాదానికి... ఆరోగ్యానికి మల్లె 

17 Mar, 2021 20:31 IST|Sakshi
మల్లెపూలు

హెల్త్‌ – బ్యూటిప్స్‌ 

మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్నిస్తాయని అందరికీ తెలిసిందే, అయితే ఈ పూలను ఔషధాలుగా కూడా వాడుకోవచ్చునని కొందరికే తెలుసు. ఔషధాలుగా ఎలా వాడచ్చో చూద్దాం. 

తాజా మల్లెలను మెత్తగా నూరి.. తడిబట్ట పై చుట్టి, కళ్లమీద పెట్టుకుంటే.. కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరిపోవడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు కలగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని.. ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది.
     
తలనొప్పి... తలంతా పట్టేసినట్లు అనిపించడం వంటి సమస్యలకు మల్లెపూలతో తలకు వాసెనకట్టు కడితే.. మంచి ఉపశమనంగా ఉంటుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా.. తలనొప్పిని తగ్గిస్తుంది.
     
కళ్లమంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెల కషాయాన్ని వాడవచ్చు. పూలు, ఆకులతో కషాయం కాచాలి. ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చి.. రెండువంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, ఒకవంతు కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. 
     
మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతి కోపం, మానసిక చంచలత్వం.. వీటన్నిటినీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలి. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. మనసు స్థిమితంగా మారుతుంది,
 
మధుమేహులకు మల్లెపూలతో చేసిన ఛాయ్‌ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే గుణం మల్లెలకు ఉంది. 
     
కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒకరోజంతా నానబెట్టాలి. ఆ తరువాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దన చేసుకుంటే.. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి.  

మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి...

మరిన్ని వార్తలు