బైజూస్‌ సేవలు ఉపయోగకరం

29 Jun, 2022 12:50 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 మిలియన్‌ విద్యార్థులకు విద్యాసేవలు అందిస్తున్న బైజూస్‌ సంస్థ విద్యాసేవలు త్వరలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ అందుబాటులోకి రానుండటం ముదావహం. నిత్యం పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షించే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్‌ 2022 మే నెలలో దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమ్మేళనంలో పాల్గొని పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడం తెలిసిందే. అదే సమయంలో నాణ్యమైన విద్యాసేవలు అందిస్తున్న బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌తో కూడా చర్చలు జరిపారు. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు గూర్చి తీసుకుంటున్న శ్రద్ధకు ఆశ్చర్యచకితులైన రవీంద్రన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ తమ సేవలు ఉంటా యని ప్రకటించారు.

ఫలితంగా జూన్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ, బైజూస్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం... ప్రతి ఏటా ఒక్కొక్కరికి 20 వేల నుంచి 24 వేల రూపాయలు చెల్లిస్తే కానీ లభించని బైజూస్‌ విద్యా సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అంతేగాదు దాదాపు 4.7 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్‌లు కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 500 కోట్ల ఖర్చు చేస్తోంది. బైజూస్‌ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్‌ యాప్‌ను కూడా ఉచితంగా అందుబాటులోనికి ఏపీ ప్రభుత్వం తెస్తోంది. గణితం, సైన్సు, సోషల్‌ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లీషు, అటు తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉండేటట్లు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.

ప్రభుత్వం ఇంత చేస్తున్నా చంద్రబాబు ఆంగ్ల భాషా మాధ్యమాన్ని వ్యతిరేకించినట్లు... బైజూస్‌ విద్యాకార్యక్రమాలను కూడా వ్యతిరేకించడం శోచనీయం. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లింపక తప్పదు. (క్లిక్‌: మరో ముందడుగు.. విద్యలో గేమ్‌ ఛేంజర్‌!)

– ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, విజయవాడ 

మరిన్ని వార్తలు