కార్మిక ఐక్యతకు ప్రతీక

1 May, 2022 00:56 IST|Sakshi

సందర్భం

ప్రపంచం ముందుకు నడవాలంటే కార్మికుడు కావాలి. కార్మికుడు తన రక్త మాంసాలు కరిగించి, చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకొంటున్నదే ‘మే’ డే! ఈ రోజు కార్మికుల ఐక్యత, పోరా టానికి నిదర్శనం. నిజానికి మే డే ఎలా వచ్చిందంటే... కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని ‘హే మార్కెట్‌’లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారి రక్తతర్పణ ప్రపంచానికే కొత్త దిశను చూపింది. ఆ ఘటన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి.

1890 మే 1న బ్రిటన్‌లోని ‘హైడ్‌ పార్క్‌’లో చేపట్టిన ప్రద ర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. తామూ మనుషులమేననీ, తమ శక్తికి కూడా పరిమితులుం టాయనీ కార్మికులు నినదించారు. పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడారు. 24 గంటల్లో ఎనిమిది గంటలు పనీ, ఎనిమిది గంటలు విశ్రాంతీ, మరో ఎనిమిది గంటలు రిక్రియేషన్‌ను ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. అలాగే మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపు కోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. 1923లో తొలిసారి ఇండియాలో ‘మే’ డేను పాటించారు. 

అయితే, 1890 నాటి దుర్భర పరిస్థితులు మళ్లీ కార్మికలోకం 2014 నుండి 2019 మధ్య చూడాల్సిన పరిస్థితులు ఎదుర య్యాయి. కేవలం పాలకుల నిర్లక్ష్య, నిరంకుశ ధోరణి మూలం గానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నది అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కార్మికులను చంద్రబాబు చులకనగా చూసేవారు. ఎవరైనా తమ పరిస్థితి గురించి చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ‘తాట తీస్తా’... అంటూ హెచ్చరికలు జారీచేయడం..., మీరంతా మురికిగా ఉంటారంటూ అగౌరవ పర్చడం, ‘దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా’ అని హేళన చేయడం చేస్తూనే వచ్చారు. వారికి ఇచ్చిన వందకుపైగా హామీల్లో కనీసం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో కార్మికుల నావకు చుక్కానిలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనిపించారు. 

జగన్‌ సుదీర్ఘ కాలం చేపట్టిన పాదయాత్రలో... ఆయన నడక, నడత, మాటల్లోని విశ్వసనీయత కార్మికలోకానికి ధైర్యాన్ని, నమ్మకాన్నీ, భరోసాను కల్పించాయి. జగన్‌ అధికారం చేపట్టాక ఆయన కార్మిక లోకానికి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మరచి పోలేదు. మొదటి ఏడాది నుంచే ఆయన కార్మికులకిచ్చిన హామీలను నిలుపుకోవడం ప్రారంభించారు.  కార్మికులకు ఏటా రూ. 10 వేల వంతున ఆర్థిక సాయమందించే ‘వాహన మిత్ర’ ద్వారా వారి నమ్మకాన్ని చూరగొన్నారు. అక్కడి నుండి మొదలైన ఆయన హామీల అమలు వరద అప్రతిహతంగా కొనసాగింది. ‘మత్స్యకార భరోసా’, ‘రైతు భరోసా’, ‘నేతన్న నేస్తం’, ఎంఎస్‌ ఎంఈలకు ‘నవోదయం’ కింద ప్రోత్సాహకాలు, ‘వైఎస్సార్‌ బీమా’ వంటి అనేక పథకాల ద్వారా కార్మిక, కర్షకులకు ప్రయో జనం చేకూరుస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, అంగన్‌ వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచడం, పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవడం వంటి చర్యలు కార్మిక లోకంలో సీఎం జగన్‌ను శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి. 

రాజధానిలో కార్మికులెవ్వరూ ఉండకూడదని చంద్రబాబు హుకుం జారీ చేయడమే కాకుండా వారు అక్కడ నివాసం ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ అవమానించారు. రాజధాని నిర్మాణం కోసం వారి సేవలు అవసరమైనప్పుడు రాజ ధానిలో నివాసం ఉండేందుకు వారికి ఎందుకు అర్హత లేదన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పిన యువ నేత జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ రాజధానిలోనే నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. జగన్‌ కార్మిక వర్గానికి చేస్తున్న సాయం చరిత్రలో నిలిచిపోతుంది. అలానే కార్మిక వర్గం కూడా ఆయన్ను వీడే పరిస్థితి లేదు. తమ బొందిలో ఊపిరి ఉన్నంత వరకూ తామంతా జగన్‌మోహన్‌రెడ్డి చేయి విడువబోమని కార్మికలోకం నేడు ప్రతిజ్ఞ చేస్తోంది. 

వ్యాసకర్త: డా‘‘ పూనూరు గౌతమ్‌ రెడ్డి 
 ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌  
మొబైల్‌ : 9848105455
(నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం)

మరిన్ని వార్తలు