వైఎస్సార్‌సీపీ ప్లీనరీ భవిష్యత్‌ సీనరీ

9 Jul, 2022 12:12 IST|Sakshi

ఆంధ్రపదేశ్‌లో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) నిర్వహిస్తోన్న భారీ ప్లీనరీని ప్రజానీకం ఆసక్తిగా చూస్తోంది. ఈ ప్లీనరీ ఆ పార్టీ ఆవిర్భావం తరువాత జరుగుతున్న మూడోదీ, అధికారం అందుకున్న తర్వాత మొదటిదీ. భవిష్యత్తులో వేయబోయే అడుగులపై దిశా నిర్దేశం చేసేవిధంగా పలు తీర్మానాలు ఇందులో చర్చకు వస్తుండటం ముదావహం. పదేళ్లుగా ప్రజల్లో ఉండి పోరాటం జరిపిన పార్టీ, వారి ఆశీస్సులతో భారీ విజయాన్ని నమోదు చేసి మూడేళ్లుగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. 

ఈ మూడేళ్లూ ఆర్థికంగా కష్టకాలం. విభజన అనంతరం తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో పాటూ రెండేళ్ల కరోనా వల్ల వచ్చిన ఆర్థిక దుఃస్థితీ ఇబ్బంది పెడు తోంది. అయినప్పటికీ లక్షా నలభై వేల కోట్ల మేరకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సాయం అందించడం, గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గర చెయ్యడం, లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడం కొనసాగించగలిగింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో సహా వివిధ రీతుల్లో విద్యార్థులకు చేయూత నిచ్చిన కారణంగా డ్రాప్‌ ఔట్‌ రేట్‌ తగ్గి, ఎన్‌రోల్‌మెంట్‌ శాతం పెరిగింది. వైద్య రంగానికి కూడా కేటాయింపులు పెంచి రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను మంజూరు చేసింది. అయితే రానున్నది గడ్డుకాలం. ఆర్థిక స్థితి మెరుగు పరచడంతో బాటు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు సమగ్ర ప్రణాళికలు అవసరం. మరో వైపు రాజకీయ ప్రత్యర్థులనూ, వారి ఆరోపణలనూ దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేసి ఉత్తేజితుల్ని చెయ్యాలి. ప్రజల అజెండాను చర్చించి ప్రజల మద్దతు నిలుపుకోవాల్సి ఉంది. ఏరకంగా చూసినా ఈ ప్లీనరీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. (క్లిక్‌: సామాజిక న్యాయమే పాలన అజెండా)

– డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం

మరిన్ని వార్తలు