‘రైతు క్షేమం’ రాజ్యం బాధ్యతే!

18 Dec, 2020 02:57 IST|Sakshi

సమకాలీనం

కరుకు కరోనా అనేక రంగాలను కుదిపి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన సంవత్సరం... మనదేశ అగ్రశ్రేణి కుబేరుల సంపద వృద్ధిరేటు నాల్గింట మూడొంతులు పెరిగి నమోదైంది. కరోనా దెబ్బతో ఇదే సంవత్సరం చిన్న, మధ్యతరగతి సమాజం కుదైలై దేశంలో పేద రికం రెట్టింపయినట్టు అంతర్జాతీయ అధ్య యనాలు చెబుతున్నాయి. పరస్పర విరుద్ధ మైన ఈ రెండు పరిణామాలు సామాజంలో ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిన తీరుకు సంకేతాలు. ఈ పరిణామాలకి, ఇప్పుడు ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై దేశవ్యాప్తంగా అంటుకున్న రైతు ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు యథా తథం అమలైతే... సమీప భవిష్యత్తులో ఆర్థిక అంతరాలు అసాధారణ స్థితికి చేరి, సమాజం అశాంతి కుంపటిపై రగులనుందనే భావన వ్యక్త మౌతోంది. ఈ ప్రచారం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని, తాము ఎన్ని కల్లో హామీ ఇచ్చినట్టు 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో తాజా సంస్కరణలు పెద్ద ముందడుగని పాలకపక్ష వాదన. కీలక వ్యవసాయ రంగంలో వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో ప్రభా వితం చేస్తుంది కనుక తమ చర్యల వల్ల ఆర్థిక అంతరాలు తగ్గుతాయని కేంద్రం అంటోంది. 

కొత్త చట్టాలను నిరసిస్తూ రైతాంగం ఉద్యమిస్తున్న తాజా పరిస్థి తికి పలువురు మేధావులు విభిన్న భాష్యాలు చెబుతున్నారు. వ్యవ సాయ రంగంలో ఎప్పట్నుంచో రావాల్సిన సంస్కరణలకు ఇది తోవ అని కొందరు పొగడుతుంటే, ఇవి రైతును, వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కార్పొరేటీకరణ చర్యలని మరికొందరు తెగుడుతు న్నారు. నడ్డివిరిగి ఉన్న నిస్సహాయ రైతాంగాన్ని మెడబట్టి బహుళ జాతి కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ల సందిట్లోకి నెట్టడమేనని వారం టున్నారు. పూర్తి భిన్నమైన వాదనలు సాగుతున్నాయి. మరో వంక, సర్కారు–రైతు సంఘాల మధ్య జరిగిన చర్చల ప్రక్రియ విఫలమై, ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ రంగంలో కీలక పరి ణామమిది. కొత్త చట్టాల మంచి చెడులు, వాదవివాదాలెలా ఉన్నా... ఉద్యమిస్తున్న రైతులను సముదాయించి, నిర్దిష్ట చర్యలతో సంతృప్తి పరచి, వెంటనే ఆందోళనను కేంద్ర ప్రభుత్వం విరమింపజేయా ల్సింది. ఉద్యమం వెనుక ఇతరేతర శక్తులున్నాయనో, ఇది రెండున్నర రాష్ట్రాల వాళ్లు చేస్తున్న అలజడి అనో రైతు ఉద్యమాన్ని తక్కువ చేసి చూడటం సరైన స్పందన కాదు. తమ జీవితాలతో ముడివడి ఉన్న నిర్ణయాలను రైతాంగం ప్రశ్నిస్తున్నపుడు వారు లేవనెత్తే అంశాలకు, భయ–సందేహాలకు సహేతుకమైన సమాధానాలివ్వడం పాలకుల కర్తవ్యం. భరోసా కల్పించాలి. చట్టాల అమలుకు ముందు ప్రజాభి ప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత.
 
రైతు కష్టాలు ఇన్నన్ని కావు
అత్యధిక పౌరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీదే ఆధార పడ్డ దేశం మనది. రైతు అసంఘటిత రంగంలో ఉన్నందున, వ్యవసా యాన్ని పరిశ్రమగా గుర్తించనందున వరుస ప్రభుత్వాలు, పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. పాలకులు రైతాంగంపై శ్రద్ద పెట్టిన దాఖలాలు పరిమితమే! వేర్వేరు కారణాలతో వ్యవసాయ రంగం నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతాంగం తీరని కష్టాల్లో కూరుకుపోయింది. దుర్భరమైన బతుకీడ్చలేక ఏటా పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు దిక్కులేనివవు తున్నాయి. పెట్టుబడి వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. విత్తనంపై కార్పొ రేట్ల పెత్తనం. ఎరువులతో వ్యాపార జిమ్మిక్కు, పంట భీమాలో మోసాలు, సబ్సిడీల్లో అవినీతి, రుణాల్లో దగా, సర్కారు అప్పులు దొరకవు–ప్రయివేటు అప్పులు భారం, అతివృష్టి–అనావృష్టితో ప్రకృతి కన్నెర్ర, దిగుబడికి భరోసా లేదు, పంట పండినపుడు ధర రాదు, కాటేసే మార్కెట్ల మాయాజాలం... ఇన్ని ప్రతిబందకాల మధ్య కొట్టుమిట్టాడే రైతుకు చట్టాల రూపంలోనైనా సర్కార్ల సహకారం లభించకుంటే పరిస్థితి దుర్భరమే!

ఆర్థిక–సరళీకరణ విధానాలు అమల్లోకి తెచ్చిన ప్రపంచీకరణ నుంచి ఎడతెగని కడగండ్లే! దాదాపు ముడు దశాబ్దాలుగా సానుకూల సంస్కరణల కోసం రైతులు నిరీక్షిస్తు న్నారు. తాజా సంస్కరణలు ఎవరి హితంలో ఉన్నాయన్నది పెద్ద ప్రశ్న. కనీస మద్దతు ధర తొలగిపోయి, మార్కెట్లో «కొనుగోలు భరోసా లేకుండా మనుగడ ఎలా? ఉద్దేశపూర్వకంగానే బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలగుతోంది. బలహీనమైన రైతులకు–శక్తి మంతులైన కార్పొరేట్లకు మధ్య పోటీ ఎలా సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఏకపక్షంగా కార్పొరేట్‌ కబంద హస్తాల్లోకి జారే దుస్థితి అయితే ‘బతుకెట్లా?’ అనే ప్రశ్నను రైతాంగం లేవనెత్తుతోంది. ఈ అంశం కేంద్రకంగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. కొత్త చట్టాల్ని వెనక్కి తీసుకోమంటున్నాయి. ఇప్పుడు తెచ్చిన రెండు చట్టాలు, సవరణలు చేసిన మూడో చట్టం, విద్యుత్‌ సంస్కర ణలు... ఇవన్నీ రైతుకు మేలు చేయకపోగా నష్టం. ఉన్న సదుపా యాల్ని తొలగించి పెనం మీంచి పోయ్యిలో వేసినట్టుందనే అభి ప్రాయం రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సవరణలకు సరే తప్ప చట్టాలు వెనక్కి తీసుకోమని కేంద్ర సర్కారు అంటోంది.

ఏమిటి భయాలు, ఎందుకు సందేహం?
‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం’ ముఖ్య ఉద్దేశ్యం రైతు తన ఉత్పత్తుల్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌(మండీ)లలోనే అమ్ముకోవా ల్సిన కట్టుబాటు లేకుండా, ప్రాంత పరిమితులు దాటి ఎక్కడైనా విక్ర యించుకునే వెసలుబాటు అని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడికి వెళ్లి అమ్ముకునే సంస్కరణ అంటోంది. రైతు నేతలు దీన్ని మరోలా చెబుతున్నారు. తిరగేసి చూస్తే, ప్రయివేటు కొనగోలుదారుకు లభిస్తున్న వెసలుబాటు అంటోంది. బాధ్యత–జవా బుదారుతనం లేని ప్రయివేటు మార్కెట్లొస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణి వ్యవస్థ (పీడీఎస్‌)ను క్రమంగా బలహీనపరచి, బదు లుగా లబ్దిదారులకు నగదు బదిలీని ప్రోత్సహిస్తోంది. తాజా చట్టాలతో క్రమంగా సర్కారు మార్కెట్‌ కమిటీలు బలహీనపడతాయి. ధాన్యం సేకరణ తగ్గుతుంది, మద్దతు దర ఉండదు, మార్కెట్‌ స్వేచ్ఛ వల్ల పెద్ద ప్రయివేటు సంస్థలు బరిలో దిగి ఆధిపత్యం చెలాయిస్తాయి. గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీస మద్దతు ధరకూ రైతు నోచుకోడు. ఇదీ భయం! వ్యవసాయం చేయలేక, విధిలేని పరిస్థితుల్లో భూము లను కార్పొరేట్లకు అప్పగించి, ఒప్పంద వ్యవసాయానికి తలపడేలా చిన్న, సన్నకారు రైతాంగాన్ని నెట్టడమే అన్నది వారి ఆందోళన! ఇప్పుడు తెచ్చిన ‘ఒప్పంద వ్యవసాయ చట్టం’ నిబంధనలు కూడా కార్పొరేట్లకే తప్ప రైతుకు అనుకూలంగా లేవు. ఇదే జరిగితే, సమా జంలో ఇప్పుడున్న గౌరవం కూడా దక్కదని, కార్పొరేట్లకు రైతులు కట్టుబానిసగా బతకాల్సిందేనని వాపోతున్నారు.

దిగుబడి ఉన్నపుడు నాణ్యతకు ముడిపెట్టి, దిగుబడి లేనపుడు మరో వంక చూపి బహుళ జాతి కంపెనీలు చేసే అరాచకాలకు రైతు బలి కావాల్సిందే అన్నది ఆందోళన! లోగడ పలు రాష్ట్రాల్లో పెప్సీ వంటి బహుళ జాతి కంపెనీలు చిప్స్‌ ఉత్పత్తి కోసం, ఆలూ పండించే రైతులతో జరిపిన ఒప్పంద వ్యవ సాయం ఎన్ని అనర్థాలకు దారి తీసిందో రైతాంగం మరచిపోలేదు. కోర్టుల చుట్టూ తిప్పి, భూములు విక్రయించినా కట్టలేనంత జరిమా నాలతో వేధించిన ఉదంతాలు మరపురాని చేదు జ్ఞాపకాలే! ఇప్పుడా న్యాయ తనిఖీలు కూడా లేకుండా, న్యాయస్థానాల పరిధి తొలగించి, కేవలం అధికార వ్యవస్థ పరిధిలోనే వివాదాల్ని పరిష్కరించుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. రాజ్యాంగ పరిధిలో తమకున్న హక్కుల్ని కాల రాయడమేనని రైతు సంఘాలంటున్నాయి. ఇక నిత్యావసరాల చట్ట పరిధిలో, నిలువ నిబంధనల నుంచి చాలా సరుకుల్ని మినహాయిం చడం కార్పొరేట్లకు కార్పెట్‌ పరవడమే! ఏయే సరుకుల్ని, ఎంతైనా నిలవ చేయవచ్చు! తద్వారా వారు ధరల హెచ్చుతగ్గుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలరు. కొనుగోలు సమయంలో రైతులకు తక్కువ ధర, విక్రయించేప్పుడు వినియోగ దారులకు ఎక్కువ «భారం పడేలా చేసి లాభాలార్జిస్తారు. ఇది ఆహార సరఫరా, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా డబ్బు గడించే ప్రయివేటు శక్తులు ఎన్ని కల్లో రాజకీయ పక్షాలకు విరాళాలిస్తాయి. ఇదో తెగని విషవలయం!

మండీలను సంస్కరిస్తే తప్పేంటి?
రైతు ఉద్యమం వెనుక దళారీలున్నారంటున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవసాయ మార్కెట్‌ (ఎపీఎమ్సీ)లలో లొసుగుల్ని తమ వాదనకు దన్నుగా వాడుకుంటోంది. దశాబ్దాలుగా రైతులు అక్కడ మోస పోతు న్నారు, మేం విముక్తి కలిగిస్తున్నామంటారు. మండీలు రాష్ట్ర ప్రభు త్వాల నియంత్రణలో ఉన్నాయి. కానీ, ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల సేకరణ చేసేది కేంద్ర పరిధిలోని ‘భారత ఆహార సంస్థ’ (ఎప్సీఐ). రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంపై ఈ కొత్త చట్టాలతో కేంద్రం పెత్తనం చేస్తోందని చాలా రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి ఇది భంగకరమనేది వాదన. అందుకే, తాజా చట్టాలు వర్తించనీకుండా కొన్ని రాష్ట్రాలు స్థానికంగా విరుగుడు చట్టాలు కూడ తీసుకువచ్చాయి. ఇంతకన్నా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతును ఆదుకోనేట్టు, వారికి ఉపయోగపడేలా మండీల్లో సంస్కరణలు తీసుకు వస్తే బాగుండేది. అక్కడ కనీస మద్దతు ధర లభించేది. రైతు కిన్ని కష్టాలుండేవి కావు. కమిషన్‌ ఎజెంట్ల దోపిడీ, వ్యాపారులు కుమ్ము క్కయి వ్యవసాయోత్పత్తుల ధరల్ని తగ్గించడం, చెల్లింపుల్లో జాప్యం, నగదు ఇచ్చేట్టయితే ధరల్లో కొత, తామిచ్చిన అప్పులకు అధిక వడ్డీ వసూళ్లు, సెస్సు విధింపు, నాసిరకం సదుపాయాలు.. ఇలా మండీల్లో చాలా సమస్యలే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సర్వే జరిపినపుడు, 57 శాతం మంది రైతులు మండీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 43 శాతం మంది ఓకే అన్నారు. ఈ రెండు వర్గాల్లోనూ అత్యధికులు మండీల్లో మార్పులు కోరారు. ఇక మొత్తానికే మండీలు ఉండవంటే ‘మద్దతు ధర’ ఎలా? అని భయపడుతున్నారు.

ఉద్యమించేది రైతులు కాదనడం అన్యాయం. ఏ దళారులూ 3 డిగ్రీల చలిలో మూడువారాలపాటు రోడ్డుపక్క దీక్షకు దిగరు. పది కిలోమీటర్ల నిడివి రోడ్లను ఆక్రమించి నెలల కాలమైనా సరే పరిష్కారంతోనే వెళ్తామంటున్న రైతుల సహనాన్ని పరీక్షించొద్దు. రైతాంగ ఆందోళనను విరమింపజేసే అన్ని అవకాశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. సమస్యను సానుభూతితో పరిష్కరించాలి. మనదేశ వెన్నెముకను కాపాడాలి. ‘ఈ మొగులు కింద, ఎముకలు కొరికే చలిలో కూర్చో వడం మాకేమైనా సరదానా? కరోనా చంపుతుందో లేదో కానీ, ఈ చట్టాలు మాత్రం మమ్మల్ని తప్పక చంపుతాయి. అన్నీ ఎత్తేసి, కార్పొరేట్‌ కంపెనీలకు బలిపెడితే బతికేది ఎలా?’ అన్న ఉద్యమ కారుడు, సోనిపత్‌ రైతు రమేష్‌ అతిల్‌ మాటలు మనందరినీ తప్పకుండా ఆలోచింపజేసేవే!

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com
దిలీప్‌ రెడ్డి

 

మరిన్ని వార్తలు