చైనా నీడలో హిందూ మహాసముద్రం

28 Jan, 2022 00:57 IST|Sakshi

హిందూ మహాసముద్రం చైనా ప్రభావిత ప్రాతంగా శరవేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కెన్యా, కమరోజ్, సీషెల్స్‌ లాంటి హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో సంబంధాలకు చైనా విశేష ప్రాధాన్యమిస్తోంది. అలాగే తమ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల నిమిత్తం చైనా పెట్టుబడుల కోసం శ్రీలంక, మాల్దీవులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారతదేశం నుంచి కూడా ఇవి మద్దతు కోరుకుంటున్నాయి. తన భద్రతా ప్రయోజనాలను అడ్డుకోనంతవరకు, ఈ రెండు దేశాలతో ఆర్థిక సంబంధాలు భారత్‌కు ఆమోదనీయమే అవుతాయి. అయితే సరైన ప్రతిస్పందనలు కరువైనప్పుడు ఈ అవగాహన పూర్తిగా నీరుగారిపోవచ్చు కూడా! ఏమైనా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా చొరబాటు వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో భారత్‌కు కీలక పాత్ర ఉంటుంది.

పశ్చిమ హిందూ మహా సముద్ర ప్రాంతంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత 32 సంవత్సరాలుగా చైనా విదేశాంగమంత్రి నూతన సంవత్సర సఫారీ, ఆఫ్రికాకే పరిమితమై ఉంటూ వస్తోంది. సాధారణంగా అయిదు ఆఫ్రికా దేశాలను చైనా విదేశీ మంత్రి సందర్శించేవారు. కానీ ఈ ఏడాది ఆయన సందర్శన జాబితాలో మరికొన్ని దేశాలు వచ్చి చేరాయి. ఎరిత్రియా, కెన్యా, కమరోజ్‌ దేశాలతోపాటు మాల్దీవులు, శ్రీలంకను కూడా చైనా విదేశీ మంత్రి వాంగ్‌ యీ సందర్శించడం విశేషం. ఈ సంవత్సరం చైనా మంత్రి సందర్శించిన దేశాల్లో నాలుగు హిందూ మహాసముద్ర ప్రాంతానికి చెందినవి. అంటే చైనా సఫారీ ఆఫ్రికాకు మాత్రమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతానికి కూడా విస్తరించింది. కమరోజ్, కెన్యా ఇప్పటికే ఈ ప్రాంతానికి చెంది ఉన్నాయి.

2021 జనవరిలో వాంగ్‌ యీ సీషెల్స్‌తో సహా హిందూ మహా సముద్ర ప్రాంతంలోని అయిదు ఆఫ్రికన్‌ దేశాలను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పాదముద్రలు ఇతర దేశాల ప్రభావానికి సవాల్‌ విసురుతున్నాయి. 2008లో గల్ఫ్‌ ఆఫ్‌ ఈడెన్‌ చుట్టూ చైనా సముద్ర బందిపోట్ల వ్యతిరేక నావికా బలగాల మోహ రింపుతో ఇది ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో ఓడలకు రవాణా పరమైన మద్దతుకోసం అది రిహార్సల్స్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగా దాని నీలిరంగు నావికా బలగాలు చాలా దూరం పయనించాయి. తన తొలి ఆఫ్రికన్‌ సైనిక స్థావరాన్ని చైనా 2017లో జిబూతిలో ప్రారంభించింది. జిబూతి ఆఫ్రికా కొమ్ము అని పిలిచే ప్రాంతంలో వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, జపనీస్‌ స్థావరాలు ఉంటున్నాయి.

చైనా ఇప్పుడు అట్లాంటిక్‌ తీరప్రాంతంలోని ఈక్వేషనల్‌ గినియాలో కూడా సైనిక స్థావరం ఏర్పర్చుకున్నట్లు వార్తలు వస్తు న్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రం గుండా చైనా సరఫరా మార్గాలకు ఇదెంతో అవసరం. ఈ కోణంలో కమరోజ్, సీషెల్స్‌ దేశాలతో సంబంధాలు చైనాకు చాలా ముఖ్యం. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల్లో చైనా విదేశీమంత్రి ఇటీవలి సందర్శన ప్రభా వాన్ని అంచనా వేయడానికి కెన్యా స్పష్టమైన ముఖచిత్రాన్ని ఇస్తుంది. తన కెన్యా సందర్శనలో వాంగ్‌ యీ, మొంబాసా రేవులో చమురు టెర్మినల్‌ని ప్రారంభించారు. హిందూ మహసముద్ర తీరంలో ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. మొంబాసా–నైరోబీ రైల్వే మార్గం కోసం 3.5 బిలియన్‌ డాలర్లను చైనా విరాళమిచ్చింది. చైనా నిర్మిస్తున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌లో కెన్యాకు కీలక స్థానముంది. పైగా మౌలిక వసతుల కల్పనకు చైనానుంచి సహాయం కోసం కెన్యా చూస్తోంది.

అయితే చాలా సంవత్సరాల తర్వాత కమరోజ్‌ దేశాన్ని చైనా మంత్రి సందర్శించడం అసాధారణమే. చైనా విరాళాలను భరాయిం చుకునే సామర్థ్యం కమరోజ్‌కు తక్కువే. అయినా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ దేశం చూస్తోంది. 2030 నాటికి సార్వత్రిక రోగనిరోధక శక్తిని పెంచడం, మలేరియా నిర్మూలన లాంటి కమరోజ్‌ ప్లాన్‌ కోసం రెండు దేశాలు పథక రచన చేస్తున్నాయి. పైగా సెనెగల్‌లో నిర్వహించిన చైనా, ఆఫ్రికా సహకార వేదిక భేటీలో తొమ్మిది కీలక మైన పథకాలను కూడా చైనా 2021 డిసెంబర్‌లో కుదుర్చుకుంది. అయితే కమరోజ్‌ దేశాన్ని చైనా మంత్రి సందర్శించడం ఈ ప్రాంతంలో ఫ్రాన్స్‌ ప్రభావాన్ని సవాలు చేస్తోంది. 

ఈ యేడు ఇతర ఆఫ్రికన్‌ దేశాలను సందర్శించడానికి బదులుగా, మాల్దీవులతో సంబంధాలు ఏర్పర్చుకుని 50 సంవత్సరాలైన సంద ర్భంగా వాంగ్, ఆ దేశాన్ని సందర్శించారు. ఇక శ్రీలంకతో రబ్బర్‌–రైస్‌ ఒడంబడిక కుదుర్చుకుని 70 ఏళ్లు పూర్తి చేసుకోవడం, దౌత్య సంబంధాలు కుదుర్చుకుని 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశాన్ని కూడా చైనా మంత్రి సందర్శించారు. కాబట్టి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ సంవత్సరం చైనా సఫారీ కేంద్రీకరించింది.

ఇప్పటికే తమ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల నిమిత్తం చైనా పెట్టుబడుల కోసం శ్రీలంక, మాల్దీవులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారతదేశం నుంచి కూడా ఇవి మద్దతు కోరుకుంటున్నాయి. ఇండియాను ఒక పొరుగు దేశంగా, చైనాను ఎదుగుతున్న అగ్రరాజ్యంగా భావిస్తూ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలను ఎలా కొనసాగించాలో ఇవి పాఠాలు నేర్చుకుం టున్నాయి. తన భద్రతా ప్రయోజనాలను అడ్డుకోనంతవరకు, ఈ రెండు దేశాలతో ఆర్థిక సంబంధాలు భారత్‌కు ఆమోదనీయమే అవు తాయి.

అయితే సరైన ప్రతిస్పందనలు కరువైనప్పుడు ఈ అవగాహన పూర్తిగా నీరుకారిపోవచ్చు కూడా. ఈ పొరుగు ద్వీపదేశాలకు చెందిన రాజకీయ నేతలు ఒక విధానంగా భారత్‌కు మద్దతు నివ్వాలని సూచిస్తూ వస్తున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా చొరబాటుతో ఎదుర్కోవాలంటే భారత్‌ చేయవలసింది చాలానే ఉంది. అందుకే మారిషస్, సీషెల్స్, మడగాస్కర్‌తో పాటు శ్రీలంక, మాల్దీవులు, కమరోజ్‌ వంటి తీరప్రాంత దేశాలను కూడా భారత్‌ నిరం తరం బలపరుస్తూ వస్తోంది. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్న ఈ దేశాల్లో చైనా బలంగా పాతుకుపోతోందని ఆధారాలు చెబుతున్నాయి.

మరి హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రమేయాన్ని భారత్‌ ఎలా ఎదుర్కోవాలి? మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు ద్వైపాక్షిక తోడ్పాటును ఇండియా గణనీయ స్థాయిలో విస్తరిస్తోంది. కుట్ర ప్రయత్నం, ఉగ్రదాడి, నీటి సంక్షోభం, మహమ్మారి వంటి సంక్షోభం పరిస్థితుల్లో భారత్‌ ఈ దేశాలను ఆదుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల శ్రీలంకకే ఎక్కువ ప్రయోజనం కలిగేలా రెండు దేశాల భాగస్వా మ్యంలో మార్పు వచ్చింది.

కమరోజ్‌లో ఒక ఒకేషనల్‌ శిక్షణా కేంద్రాన్ని, విద్యుత్‌ ప్లాంట్‌ని నిర్మిచడంలో భారత్‌ తోడ్పడింది. కానీ ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఇక భారత సంతతి ప్రజలపై కెన్యా బలమైన ఆర్థిక ప్రభావం కలిగి ఉంది. కెన్యాతో పెట్టుబడి ఆధారిత సంబంధాలను భారత్‌ కొనసాగిస్తోంది. రివాటెక్స్‌ బట్టల మిల్లు పునరుద్ధరణ కోసం కెన్యా భారత్‌ నుంచి రుణం స్వీకరించింది. అయితే ఈ దేశాల్లో భారత్, చైనా మధ్య పోలికల గురించి చర్చ ప్రారంభమైంది. కాబట్టి ఈ దేశాలకు ఎలాంటి మంచి తలపెట్టాలి, ఏం చేయగలగాలి అనేది ఇండియానే తేల్చు కోవల్సి ఉంది. చైనా రుణకల్పనకు ప్రత్యామ్నాయాన్ని అందించేం దుకు విస్తారమైన పొత్తులను ఇండియా రూపొందించాల్సి ఉంది.

భారత్, పసిఫిక్‌ సాగర విధానంలో వాయవ్య హిందూ మహాసముద్ర ప్రాంతం ఒక భాగం. జపాన్, ఫ్రాన్స్, అమెరికా కూడా హిందూ మహాసముద్రాన్ని ప్రభావితం ప్రాంతంగా చూస్తున్నాయి. కాబట్టే 1997లోనే భారత్‌ 14 దేశాలను కలుపుకొని ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌ని ఏర్పర్చింది. ఇప్పుడు వీటి సంఖ్య 23కి చేరింది. ప్రారంభంలో ఆర్థిక సహకారంపైనే దృష్టి సారించినప్పటికీ ఈ కూటమి సముద్ర భద్రత, సాంప్రదాయేతర భద్రతా ప్రమాదాల వరకు విస్తరించింది. ఈ కూటమిలో ఫ్రాన్స్‌ కూడా భాగస్వామి. చైనా ఒక సంభాషణా భాగస్వామిగా ఉంటోంది. పాకిస్తాన్‌ని మినహాయిం చిన ఈ కూటమి భారత్‌కు అధిక అవకాశాలను అందజేస్తోంది.

ఇండో–పసిఫిక్‌ ఓషన్స్‌ ఇనిషియేటివ్‌ని కూడా భారత్‌ ఉపయో గించుకుని ఈ ప్రాంతంపై తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. దీన్ని 2019లో భారతదేశమే ప్రకటించింది. అలాగే క్వాడ్‌ దేశాల కూటమిని కూడా భారత్‌ ఆహ్వానించడంలో ముందంజ వేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతం, ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా చొర బాటు వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందిం చడంలో భారత్‌కు కీలక పాత్ర ఉండబోతోంది.
– గుర్జీత్‌ సింగ్‌
భారత మాజీ రాయబారి

మరిన్ని వార్తలు