రైళ్ళలో రాయితీలను పునరుద్ధరించాలి

4 Aug, 2022 12:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్‌ మహమ్మారి దేశంపై విరుచుకుపడేంతవరకూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రైళ్ళలో రాయితీ అమలులో ఉంది. కోవిడ్‌ బూచి చూపించి రైళ్లను రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించిన తర్వాత... అనేక వర్గాలకు టిక్కెట్‌ ధరలను పూర్వ విధానంలోనే ఉంచి, 53 కేటగిరీలుగా ఉన్న రాయితీలను 11 కేటగిరీలకు మాత్రమే పరిమితం చేశారు. రోగులకు, దివ్యాంగులకు, మరికొందరికి మాత్రమే పునరుద్ధరిం చారు. అవకాశం దొరికిందని వృద్ధులకిచ్చే రాయితీ సైతం రద్దుచేశారు. దీంతో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది. 

ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌లో ఒక కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని అందులో తేల్చి చెప్పారు. వృద్ధులకు, సౌకర్యాలు, గౌరవం కల్పించడం భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం. అటువంటిది కేంద్రం వృద్ధులకిచ్చే రైల్వే టికెట్‌ రాయితీని రద్దు చేయడం ద్వారా మన సాంస్కృతిక విలువలను తుంగలో తొక్కు తోంది. పెద్దవాళ్లు చేసే తీర్థయాత్రలు, తప్పనిసరి ప్రయాణాలను ప్రభుత్వ నిర్ణయం భారంగా మార్చింది. (క్లిక్‌: ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?)

దేశ వ్యాప్తంగా వెల్లడవుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 70 ఏళ్లు పైబడినవారికి రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. కానీ ఈ కంటి తుడుపు చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కరోనా మహమ్మారికి ముందు ఉన్నట్లే 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు రాయితీ వర్తింప జేయాలి. (క్లిక్‌: వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?)

– డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు 

మరిన్ని వార్తలు