Police Martyrs Day: ఖాకీదుస్తులు త్యాగానికి ప్రతీక

21 Oct, 2021 07:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్టోబర్‌ 21 పోలీసు అమర వీరుల దినం

‘ప్రియమైన పోలీసు ధీశాలులారా... మహమ్మారైనా, ఆపత్కాలమైనా, శాంతి సమయమైనా మీరే మా ధైర్యం’ అని పేర్కొంటూ తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో కట్టిన బ్యానర్‌... సాధారణ ప్రజలకు పోలీ సుల మీద కలిగిన నమ్మకానికి నిదర్శనం అనవచ్చు. తెలంగాణ రాష్ట్రా విర్భావ అనంతరం పీపుల్స్‌ ఫ్రెండ్లీగా, పోలీసులు అంటే ప్రజల సేవ కులు, ప్రజలే బాసులు అనే విశ్వాసం కలిగే విధంగా తెలంగాణా పోలీస్‌ శాఖ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే, ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీటీవీల ఏర్పాటు లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 8.25 లక్షల ఏర్పాటు పూర్తయింది. డయల్‌ 100, ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, స్వతంత్ర భారత చరిత్రలో మరెక్కడా లేని విధంగా దాదాపు 80 వేల మందికి పైగా పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్‌ స్టేషన్లు, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం... ఇలా తెలంగాణ పోలీస్‌ శాఖ తన విధుల్లో ఎంతో ముందుంది. 

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 377 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణలో ఒక్క ప్రాణాపాయం జరగకపోవడం గమనార్హం. అయితే ఇప్పటివరకూ 326 మంది తెలంగాణ పోలీసులు మావోయిస్టు, ఎంఎల్‌ గ్రూపు నక్సలైట్ల చేతుల్లో అమరులయ్యారు. వీరిలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకు ఉన్నారు. ఖాకీ దుస్తులు అంటేనే త్యాగాలకు ప్రతీక అనే విష యాన్ని పోలీసులు తమ విధుల ద్వారా చాటుతున్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం నిస్వార్థ సేవలందించిన ఈ అమర పోలీసులకు దేశ ప్రజలు అక్టోబర్‌ 21న నివాళులు అర్పిస్తున్నారు.

– కన్నెగంటి వెంకటరమణ, జాయింట్‌ డైరెక్టర్,
సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు