బహుజన బాంధవుడు కాన్షీరామ్‌

15 Mar, 2022 12:46 IST|Sakshi

బహుజనులను రాజ్యాధికారానికి దగ్గర చేసినవారు కాన్షీరామ్‌. 1934 మార్చి 15న పంజాబ్‌ రాష్ట్రం రోపడ్‌ జిల్లా కావాస్పూర్‌ గ్రామంలో జన్మించారు. బీఎస్సీ చదివి రక్షణ శాఖలో  చేరారు. 1965లో అంబేడ్కర్‌ జయంతినాడు సెలవు ప్రకటించాలని చేపట్టిన ఆందోళనతో ఆయన ఉద్యమ జీవితం ప్రారంభమైంది.

అంబేడ్కర్‌ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం స్ఫూర్తితో పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్‌ లాంటి వారిని గురువులుగా భావించారు. వారి ప్రభావంతోనే 1971లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978లో బ్యాక్‌వార్డ్‌ అండ్‌ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (బామ్‌ సెఫ్‌)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగినవారు తమ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేశారు.

‘రాజ్యాధికారమే మాస్టర్‌ కీ’ అన్న అంబేడ్కర్‌ మాటలను ఆదర్శంగా తీసుకొని 1984లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థాపించారు. బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అంబేడ్కర్‌ చెప్పిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ సిద్ధాంతానికి అనుగుణంగా 1983 మార్చి 15న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల మీదుగా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షీరాం. ఆయన అలుపెరగని పోరాటంతో ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాక... దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారు.

– డాక్టర్‌ మొగిలి దేవప్రసాద్, సామాజిక విశ్లేషకులు, ఒంగోలు
 మార్చి 15న కాన్షీరామ్‌ జయంతి

మరిన్ని వార్తలు