మహిళా మార్గానికి మణిదీపం

6 Oct, 2021 01:02 IST|Sakshi

సందర్భం 

ప్రయోజనకరంగా ఆలోచిం చడమే కాదు; పనికొచ్చే రీతిలో కలాన్ని లేఖలు, వ్యాసాలు, పాటలు, పద్యా లుగా ఝళిపించడమే కాదు; పని చేయడం, చేయించడం ఆమె బలం! ఆడవారు చెప్పులు తొడుక్కుని వీధిలోకి వస్తేనే, విడ్డూరంగా కనిపించే రోజుల్లో స్త్రీహితైషిణీ మండలి, యువతీ విద్యాలయం, హనుమంతరాయ బాల విద్యావిహార్‌ వంటి సంస్థలు స్థాపించి, నిర్వహించిన కార్యశీలి.

గాంధీజీ సూచనతో జీవితాంతం ఖద్దరు కట్టడమే కాదు; స్నేహితురాండ్రతో కలసి స్వరాజ్యలక్ష్మి వ్రతం, రాట్నలక్ష్మీ పూజలు చేసి స్వదేశీ దీక్షా సూత్రాల్ని ముంజేతి కంకణాలుగా ధరింప చేసిన మహిళాసేనాని కనుపర్తి వరలక్ష్మమ్మ. 1896 అక్టోబరు 6న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. భారత స్వాతంత్య్ర అవతరణోత్సవ సందర్భంగా మద్రాసు ఆకాశవాణిలో 1947 ఆగస్టు 16న విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువాతో కలిసి కవిత్వం పఠించిన ఏకైక మహిళ; 1968 మే 31న హైదరాబా దులో జరిగిన అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్లో వానమామలై వరదాచారి, కాళోజీ నారా యణరావు, మునిమాణిక్యం నరసింహారావుతో పాటు సత్కారానికి అందుకున్న ఏకైక కవయిత్రి.

కనుపర్తి వరలక్ష్మమ్మ అనగానే గుర్తుకు వచ్చే రచన ‘శారదా లేఖలు’. సివిల్‌ సర్వీసెస్‌తో సహా చాలా పోటీ పరీక్షలకు పాఠ్యాంశంగా నేటికీ చదువు తున్న ఈ ‘లేఖలు’ సుమారు నాలుగు దశాబ్దాల వ్యవధిలో 80 ఉత్తరాల రూపంలో రాసిన  సాహిత్యం. 1922లో ‘ఆంధ్రపత్రిక’లో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ పేరుతో తొలుత రాసిన వరలక్ష్మమ్మ, 1928 నుంచి ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో చాలాకాలం కొనసాగిం చారు. కల్పలత అనే స్నేహితురాలికి రాసిన ఉత్తరాలుగా ఇవి కనబడ తాయి. స్త్రీల విషయాలు, ఆరోగ్యపు సంగతులు, రాజకీయాలు, స్వాతంత్య్ర పోరాటం, మూఢ నమ్మకాలు, శారదా చట్టం, వర కట్నం, ధరలు పెరగడం, నగలు, నాటకాలు, పర్యటనలు, నాయ కులను స్మరించుకోవడం వంటివే కాదు;  ‘గృహలక్ష్మి’, ‘సమదర్శిని’ పత్రికల్లో స్త్రీల గురించి వెలువడిన వ్యాసాలలోని అపసవ్య ధోరణుల గురించి విమర్శలు కూడా ఈ లేఖల్లో కనబడతాయి.

గాంధీ దండకం మాత్రమే కాదు, ఓటు వేయమని రచనలతో స్త్రీలను ప్రబోధించిన వర లక్ష్మమ్మ బ్రాహ్మణ శబ్దానికెంత గౌర వముందో, శూద్ర శబ్దానికీ అంతే గౌరవముందన్న ధీశాలి, సమవాది. 1896–1978 మధ్యకాలంలో జీవించిన వర లక్ష్మమ్మ బడికి వెళ్ళి పెద్దగా చదువుకోలేదు. కానీ కొటి కలపూడి సీతమ్మ ప్రసంగం విని చదువుకోవాలని ఆసక్తి పెంచుకున్నారు. ఇంటిలో తండ్రి, సోదరుల ప్రోత్సాహంతో గ్రంథపఠనం, మరోవైపు చోరగుడి సీతమ్మ తోడ్పాడుతో సంఘసేవ ప్రారంభించారు. 1909లో పెళ్లి జరిగి, అదే ఊరిలో అత్తవారింటికి వెళ్ళి నప్పుడు వాళ్ల అన్న ‘శబ్దార్థ చంద్రిక’ నిఘంటు వును బహూకరించడం విశేషం. ఆరోగ్యశాఖలో హెల్త్‌ ఇన్‌ స్పెక్టరైన భర్త హనుమంతరావు వెంట మదనపల్లె, బెజవాడ వంటి పట్టణాలు తిరు గుతూ మహిళా చైతన్యానికి కృషి చేశారు. 

విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్త్రధారణ, రాట్నం, ఖద్దరు వంటి విషయాల గురించి స్ఫూర్తి కరంగా రాశారు. ఫలితంగా, ఎంతోమంది స్త్రీలు సత్యా గ్రహం చేశారు; కల్లు అంగళ్ళ ముందు పికెటింగు చేశారు. ఒకరిద్దరు స్త్రీలు శారద లేఖలు చదివి, సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి, అక్కడే పురుడు పోసు కున్నారు కూడా. స్త్రీ చైతన్యం, సంఘ సేవ, సాహితీ సృజన, దేశభక్తి, ఆత్మగౌరవం కలబో సిన కార్యశీలి కనుపర్తి వరలక్ష్మమ్మ 1978 ఆగస్టు 13న కన్నుమూశారు. 125వ జయంతి వత్సరం ముగు స్తున్న వేళ ఆ మహోజ్వల మహిళాదీపాన్ని మననం చేసు కోవాల్సి ఉంది.  (నేడు కనుపర్తి వరలక్ష్మమ్మ 125వ జయంతి)


డా. నాగసూరి వేణుగోపాల్‌

వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్‌ : 94407 32392

మరిన్ని వార్తలు