బ్యాంకింగ్‌ సంక్షోభం నేర్పే పాఠాలు 

25 Mar, 2023 00:55 IST|Sakshi

ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కొన్ని బ్యాంకుల సంక్షోభం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ బ్యాంకుల సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం గమనార్హం. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో తగినన్ని ఏర్పాట్లు ఉన్నా రిస్క్‌ మేనేజ్‌మెంట్, ట్రెజరీ ప్రాక్టీసుల విషయంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలన్నది ఈ సంక్షోభం చెబుతున్న ఒక పాఠం. పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదన్నది మరో పాఠం.

సిల్వర్‌గేట్‌ బ్యాంక్, సిలికాన్‌  వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్‌ బ్యాంక్, క్రెడిట్‌ స్వీస్‌... ఇటీవలి కాలంలో పత్రికల పతాక శీర్షికలకు ఎక్కిన బ్యాంకుల పేర్లు. భారత్‌లో క్రెడిట్‌ స్వీస్‌ గురించి చాలామందికి తెలుసు కానీ... మిగిలిన మూడింటితో పరిచయం అంతంత మాత్రమే. ఎందుకంటే ఇవి ప్రధానంగా అమెరికాలో పనిచేసే బ్యాంకులు. అయినాసరే, వీటి గురించి బోలె డన్ని కథనాలు వరుసగా వస్తూండటం కొంత అసౌకర్యంగా అనిపించే విషయమే. 

ఇప్పుడు తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, మన బ్యాంకింగ వ్యవస్థఎంత సురక్షితం? అన్నది. అమెరికాకు చెందిన లేహ్‌మ¯Œ  బ్రదర్స్‌ దివాళా సంక్షోభం తరువాత ‘బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌’ మూలధనానికి సంబంధించిన విధానాలను మరింత కఠినం చేసింది. బేసెల్‌ కమిటీ మార్గదర్శకాలు ఇందుకు కారణమయ్యాయి. అయినా ప్రస్తుత సంక్షోభాన్ని అది నివారించలేక పోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న తలెత్తుతోంది. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? లేక ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అయితే, ఈ బ్యాంకుల మూసివేతకు దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. 

దేని కారణాలు దానివే!
ఈ మూడు బ్యాంకుల మూసివేతకూ, భారతీయ బ్యాంకులకూ నేరుగా సంబంధం లేకపోవచ్చు. సిల్వర్‌గేట్‌ బ్యాంకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఉంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి అంత ఆదరణ లేదు. ఇంకొన్నేళ్లు పోతే అసలు క్రిప్టో అన్న పదం కూడా వినిపించకపోవచ్చు. అదంత సుస్థిరమైంది కాదని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. సిలికాన్‌  వ్యాలీ బ్యాంకు కేవలం స్టార్టప్‌లపైనే ఎక్కువగా కేంద్రీ కరించింది. అందిన డిపాజిట్లు అత్యధికం స్టార్టప్‌ల నుంచి వచ్చినవే. కొంతమేరకు అప్పులూ ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తం ప్రభుత్వాలకు అప్పు ఇచ్చింది. (మన బ్యాంకుల మాదిరిగానే ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టారన్నమాట.)

ఇక సిగ్నేచర్‌ బ్యాంకు గురించి: ఇది అటు క్రిప్టో, ఇటు స్టార్టప్‌లు రెండు రంగాల్లోనూ పనిచేస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆదుకునేందుకు న్యూయార్క్‌ కమ్యూనిటీ బ్యా¯Œ కార్ప్‌ ఒక ప్రయత్నం చేస్తోంది. చివరగా క్రెడిట్‌ స్వీస్‌: ఇది స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌. ఎవరికి రుణా లిచ్చారన్న విషయంలో ఈ బ్యాంకు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే రకరకాల వ్యాపార వ్యవహారాల కారణంగా నష్టాలు ఎదు ర్కొంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు దీనికి బెయిల్‌ అవుట్‌ ఇస్తోంది. అలాగే యూబీఎస్‌ దీన్ని స్వాధీనం చేసుకుని కష్టాల నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగు ఘటనలు వేటికవే ప్రత్యేకం కానీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేవి. 

లేహ్‌మన్‌ బ్రదర్స్‌ సంక్షోభం కంటే ప్రస్తుత సంక్షోభం భిన్నమైంది. ఎలాగంటే... ఇప్పుడు అన్ని నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆర్‌బీఐ కూడా భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ దృఢంగా ఉందన్న భరోసా ఇచ్చింది. యూరప్‌లోనూ కేంద్ర బ్యాంకులు క్రెడిట్‌ స్వీస్‌ సంక్షోభం ప్రభావాన్ని మదిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ప్రభావం భారత్‌పై ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన గుణపాఠా లేమిటి? అప్పుల గురించి కూడా యోచించాలి.

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కుప్పకూలిపోవడం నేర్పించే మొదటి పాఠం... కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలని! రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముప్పు ఒక్క దగ్గర పోగు పడకుండా చూడటం వీటి ఉద్దేశం. అయితే డిపాజిట్లు పోగుపడటం వల్ల కూడా ముప్పు ఉంటుందన్నది వినూత్నమైన విషయం. డిపా జిట్లు ఎక్కువగా స్టార్టప్‌ల నుంచి రావడం వల్ల సంక్షోభం మరింత ముదిరింది. ఎందుకంటే డిపాజిట్లు చేసిన వారందరూ అకస్మాత్తుగా వాటిని ఉపసంహరించుకునే ప్రయత్నం చేశారు.

భారతీయ బ్యాంకులు ఈ విషయమై ఆలోచన చేయాలి. చిన్న బ్యాంకులు మరీ ముఖ్యంగా. ఇక రెండో గుణపాఠం: పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదని చెబుతోంది. యూఎస్‌ ట్రెజరీ బాండ్లు కలిగి ఉండటం వాస్తవానికి చాలా సురక్షితం. కానీ వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ పెట్టుబడుల విలువల్లో తేడాలొస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకులు గుర్తించాలి. రిస్క్‌ మేనేజ్‌మెంట్, ట్రెజరీ ప్రాక్టీసెస్‌లను సమీక్షించుకోవాలి. 

ముచ్చటగా మూడో పాఠం: వాణిజ్య బ్యాంకింగ్‌లో నైపుణ్యం సాధించాలని బ్యాంకులకు తరచూ చెబుతూంటారు. ఇతర కార్య కలాపాలను అనుబంధ కంపెనీల ద్వారా నడపాలనీ, వాటి మూల ధన నిర్మాణం కూడా వేరుగా ఉండాలనీ అంటారు. క్రెడిట్‌ స్వీస్‌ విషయంలో ఈ రెండు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో వచ్చిన నష్టాలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగపు నిధులను విత్‌డ్రా చేయడం కాస్తా వాణిజ్య బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్‌పై ప్రభావం చూపింది. 

భారత్‌లో ఈ బలహీనతను చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్, మర్చెంట్‌ బ్యాంకింగ్, ఇన్సూరె¯Œ ్స, మ్యూచు వల్‌ ఫండ్స్‌ తదితరాలను అనుబంధ సంస్థల ద్వారా నడుపుతున్నారు. దీనివల్ల ముప్పు కొంచెం తక్కువవుతుంది. క్రిప్టో కరెన్సీని ఎలాగూ భారత్‌ గుర్తించలేదు. కాబట్టి రెండు బ్యాంకులు కుప్పకూలడం తాలూకూ ప్రభావం మనపై ఉండదు. వాస్తవానికి తాజా సంక్షోభం తరువాత ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వ్యవహారాలను బ్యాంకింగ్‌కు దూరంగా ఉంచాలన్న అభి ప్రాయం బలపడటం గుర్తించాలి.

ప్రత్యక్ష ప్రభావం లేదు
అమెరికన్‌ బ్యాంకులు, క్రెడిట్‌ స్వీస్‌ సంక్షోభం తాలూకూ ప్రత్యక్ష ప్రభావం భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఏమీ కనపడటం లేదు. కాకపోతే ఒక్కసారి పరిస్థితిని సమీక్షించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. బ్యాలెన్స్‌ షీట్లను ఒక్కసారి పరిశీలించుకుని డిపాజిట్లు, అప్పులు ఎలా విభజితమై ఉన్నాయో చూసుకోవడం మేలు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ కూడా రిస్క్‌ టీమ్స్‌తో కలిసి పెట్టుబడుల తీరు తెన్నులను మదింపు చేయాలి. అంతేకాకుండా... డెట్‌(రుణ) సర్వీస్‌ కవరేజి నిష్పత్తికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఇది నిరంతర ప్రక్రియలా సాగాలి. 

ఆర్‌బీఐ కూడా డిపాజిట్లపై ప్రస్తుతం జారీ చేస్తున్న ఇన్సూరెన్స్‌ను సమీక్షించాల్సిన అవసరముంది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఐదు లక్షల గరిష్ఠ ఇన్సూరెన్స్‌ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలి. ముప్పు తీవ్రత ఆధారంగా బ్యాంకులను వర్గీకరించే అంశాన్నీ పరిశీలించాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదు ర్కొనేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై త్వరలోనే చర్చ మొదలు కావచ్చు. ‘బేసిల్‌–4’ (సంస్కరణల కోసం) వంటివి ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ఇది బ్యాంకులకు అవసరమైన మూలధనం మరింత పెరిగేందుకు దారితీసే అవకాశముంది. అంతేకాకుండా... మార్కెట్, క్రెడిట్‌ రిస్క్‌లను అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షల్లాంటివి చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. 

మదన్‌ సబ్నవీస్‌, వ్యాసకర్త బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకానమిస్ట్‌,
(‘ద బిజినెస్‌ లైన్‌’ సౌజన్యంతో).

మరిన్ని వార్తలు