స్వయంకృతాపరాధాలే ఓడించాయా?

11 Nov, 2021 01:46 IST|Sakshi

సందర్భం

 కొరివితో తల గోక్కుంటే ఏమవుతుందో తెలియాలంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రశాంతంగా సాగి పోతుందనుకున్న ఆ పార్టీ రాజకీయ భవిత వ్యాన్ని ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అయిన ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా సంక్షోభం లోకి నెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. 

తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ కేసీఆర్‌ వెన్నంటే ఉండి అంకితభావంతో పనిచేసిన బలమైన తెలం గాణ వాది ఈటెల రాజేందర్‌ను పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని హుజూరాబాద్‌ ప్రజలు జీర్ణించుకోలేక పోవడంతోనే టీఆర్‌ఎస్‌ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందనడంలో సందేహం లేదు. ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్‌ ఎన్నికల్లో తెరాస ఓడిపోయిందా, ప్రజలు పట్టుబట్టి ఓడించారా అంటే అక్కడ రెండూ జరిగాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఈటెలను రాజకీయంగా సమాధి చేయడం ద్వారా బీజేపీని ఓడించి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు, నాయకు లను అక్కడే మోహరించారు. బహుశా దేశ చరిత్రలో తొలిసారి ఓటర్లు రోడ్ల మీదికొచ్చి తమకు ఓటుకు ఆరు వేలు అంద లేదని తెరాస నాయకుల ఇళ్ల ముందు ధర్నా చేశారు. 

కొంతమంది అధికారులు హుటాహుటిన ప్రజల సమస్యలు తీరుస్తూ గులాబీ బాస్‌ మెప్పు పొందాలని చేయని ప్రయత్నం లేదు. ఆగమేఘాల మీద రేషన్‌ కార్డులు జారీ అయ్యాయి. దళిత బంధు పథకం ప్రారంభించి దళితుల అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి దాకా అగ్రవర్ణాలకే పరిమితమైన సీఎంఓలోకి దళిత అధికారిని తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఏళ్లుగా జరుగని అభివృద్ధి పనులను కేవలం కొన్ని వారాల వ్యవధిలో పూర్తి చేయించారు. ఈ పరిస్థితి చివరికి ఎక్కడి దాకా పోయిందంటే తమ నియో జకవర్గ తెరాస ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమకూ హుజూరాబాద్‌లాగా సౌకర్యాలన్నీ సమకూరుతాయని ఓటర్లు భావించేదాకా.

కేసీఆర్‌ ఒక్కరే గొప్ప రాజకీయ నాయకుడు కాదు, తాము అంత కంటే గొప్ప వారమని ఓటర్లు నిరూపించారు. ఈటెలను గెలిపిం చుకొని బీజేపీ సత్తా చాటాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్రంగా శ్రమించారు. గతంలో రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించినా, కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతిలాంటి మరెందరో తెలంగాణ వాదులను తొలగించినా చెల్లినట్లు ఈటెలతో ఏం నష్టం జరుగుతుం దని కేసీఆర్‌ భావించి ఉంటారు. దేశంలో పలుచోట్ల ఉప ఎన్ని కలు జరుగుతున్నా జాతీయ మీడియా సైతం హుజూరాబాద్‌ లోనే మోహరించిం దంటే ఈ ఎన్నిక ఎంత ప్రత్యేక మైందో ఊహిం చవచ్చు. టీఆర్‌ఎస్‌ గెలిచి ఉంటే వచ్చే ఎన్ని కల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బీజేపీ ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయ్యేది. టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ ఓడిపోవడంతో సమీప భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులొచ్చాయి. ఇక ఆ పార్టీల లోని అసంతృప్తివాదులు అప్పుడే బీజేపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. 

వ్యాసకర్త: శ్యామ్‌సుందర్‌ వరయోగి 
బీజేపీ రాష్ట్ర నాయకులు

మరిన్ని వార్తలు