భారతీయ తంత్రజ్ఞాన పరిచయకర్త 

16 Jan, 2021 09:53 IST|Sakshi

నేడు సర్‌ జాన్‌ ఉడ్రోఫ్‌ 85వ వర్థంతి

సర్‌ జాన్‌ ఉడ్రోఫ్‌ అనే ఈ పేరు ప్రస్తుత తరానికి ఎంత వరకు తెలుసో మనం ఊహించడం కష్టమే..! కానీ ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన బ్రిటిష్‌ జాతీయుడు ఈయన. భారతదేశంలో వర్ధిల్లిన తంత్రశాస్త్ర జ్ఞానాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన రచయిత, న్యాయ నిపుణుడైన ఉడ్రోఫ్‌ దాదాపుగా 20 గ్రంథాల్ని రచిం చాడు. 1915 వరకు కలకత్తా హైకోర్ట్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఈయన భారతీయ తంత్ర శాస్త్రాన్ని శోధించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్నది తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది.

కలకత్తా హైకోర్ట్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఓ కేసు విషయమై తీర్పు వెలువరించే ప్రక్రియలో తనకెదురైన కొన్ని సంఘటనలు ఆయనలో భారతీయ తంత్రశాస్త్రంపై గొప్ప ఆసక్తిని కలిగిం చాయి. శివచంద్ర విద్యారణ్య భట్టాచార్య అనే గురువు వద్ద దీక్ష తీసుకున్నారు. ఎన్నో ఏళ్ళు సాధనలో గడిపారు. సంస్కృత భాషలో ఉన్న ఎన్నో గ్రంథాల్ని ఇంగ్లిష్‌ భాషలోకి అనువదిం చారు. చాలావరకు తంత్రశాస్త్ర రహస్యాలు లిఖిత రూపంలో కంటే గురు శిష్య పరంపరగా కొనసాగుతున్నట్లు చెప్పారు. తన సాధనలో అనుభవాని కొచ్చిన ఎన్నో విషయాల్ని తను రాసిన గ్రంథాల్లో పదిలపరిచారు.

బౌద్ధ, జైన, హిందూ శాస్త్రాల పరంగా తంత్ర జ్ఞానాన్ని విశదీకరించారు.  Introduction to the Tantra Sastra, Ta-ntra of great liberation (Maha nirvana Tantra), Hymns to Goddess, Shakti and Shakta, The Serpent power, Hymn to Kali:  Karpuradi Strotra, The World as Power, The Gar-land of letters, Principles of Tantra ఇలా అనేక రచనలు వెలువరించారు. పైగా Arthur Avalon అనే కలం పేరుతో కొన్ని రాశారు. అటల్‌ బిహారీ ఘోష్‌ అనే మిత్రుడు ఈ ప్రయత్నంలో తనకు ఎంతో సహకరించినట్లు తెలిపారు. 

భారతీయ తంత్రశాస్త్రాన్ని మొదటిసారిగా బయట ప్రపంచానికి తన రచనల ద్వారా తెలిపిన ఘనత సర్‌ జాన్‌ ఉడ్రోఫ్‌కే దక్కుతుంది. రిటైరైన తర్వాత బ్రిటన్‌కి వెళ్ళి అక్కడ ఆక్స్‌ఫర్డ్‌ యూని వర్శిటీలో బోధించారు. అటు తరువాత ఫ్రాన్స్‌ దేశానికి వెళ్ళి  Beausoleil అనే ఓ గ్రామంలో స్థిరపడి అక్కడే 1936 జనవరి 16న మరణించారు. ఆ మహానుభావుని జ్ఞప్తికి తెచ్చుకోవడం మన బాధ్యత.

– మూర్తి కె.వి.వి.ఎస్‌., రచయిత, అనువాదకుడు
78935 41003

మరిన్ని వార్తలు