అదే బెటరు

17 Oct, 2020 00:56 IST|Sakshi

అక్షర తూణీరం 

నాలుగు రోజులుగా పత్రి కల్లో వరదల్ని వరుణ దేవు డిని విమర్శిస్తూ పతాక శీర్షి కలు చూస్తున్నాం. ఇట్లాంట ప్పుడు పత్రికల్ని శ్రద్ధగా చదు వుతాం. ఇన్ని సెంటీమీటర్లు వానపడిందిట. అన్ని సెంటీ మీటర్లు పడిందిట.. అంటూ పేపర్లు ఇచ్చిన గణాంకాలు చూసి మరోసారి నివ్వెర పోతూ ఉంటాం. పూర్వం వర్షాన్ని ‘దుక్కులు’ లెక్కన చెప్పుకునేవారు. అటూ, ఇటూ చేసి చివరకు ఏలిన వారు ఏం చేస్తున్నారనే విమర్శ దగ్గరకు వచ్చి ఆగి పోతుంది. ఏలిన వారైనా ఏలని వారైనా ఏం చేస్తారు? రమారమి వందేళ్లలో ఇంత పెద్ద వాన పడలేదుట. ఒక అసాధారణ సందర్భంగా ముందు ప్రభుత్వాలు చెప్పేసి చేతులు దులుపుకుంటాయ్‌. తర్వాత నిజం పంచాయతీ ఆరంభమవుతుంది. చెరువులు అక్ర మంగా ఆక్రమించి ఇళ్లు కట్టారని ఆరోపిస్తారు. ఏ మహా నగరంలో అయినా ఇదే కథ వినిపిస్తుంది. గుట్టలు, కొండలు కబ్జా అయినట్టే చెరువులు అయి నాయ్‌. నదులు ఆక్రమణలకు గురై లంకలు ఏర్ప డ్డాయ్‌. అవన్నీ పెద్ద పెద్ద పట్టణాలుగా మారాయి.

ఒకవైపు నీటి కొరత, మరోవైపు వరద ముంపు. నీళ్లని నిలవ చేసుకుని హాయిగా వాడుకోవడం ఎలా? ఇరుగుపొరుగు దేశాలెవరన్నా మన నీళ్లు దాచిపెట్టి కావల్సి వచ్చినపుడు వదిలి పుణ్యం కట్టుకోవచ్చు. కావాలంటే లక్ష క్యూసెక్కులు డిపాజిట్‌ చేసి ఇచ్చి నందుకు డబ్బు తీసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలవారు కూడా ఈ సేవకి లేదా వ్యాపారానికి పూనుకోవచ్చు. రాష్ట్రానికి కాపిటల్‌ కడదామని మాన్య మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు సుమారు నలభైవేల ఎకరాలు పూల్‌ చేశారు. ఆ స్థలాన్ని కాంక్రీట్‌ అరణ్యంగా మార్చే బదులు ఇంకుడు గుంతగా లేదా నాలుగు అతిపెద్ద చెరువులుగా మారిస్తే వెంటనే ఉపయోగంలోకి వచ్చేవి. ఇప్పుడు మనకు అర్జెంటుగా  కావాల్సింది రిజర్వాయర్లు లేదా జలాశయాలు. అశోకుడు చెరు వులు తవ్వించాడని, చెట్లు నాటించాడని చిన్నప్పటి నుంచీ చదువుతున్నాం. ‘తటాకం’ కూడా ఒక విధంగా సంతానం లాంటిదేనని మన శాస్త్రాలు చెబు తున్నాయ్‌.

మొన్నటిదాకా వాన చినుకుల్ని ఒడిసి పట్టండని చెప్పుకున్నాం. ఇప్పుడు నీళ్లను వదిలిం చుకోవడం ఎలాగో తెలియక తికమక పడుతున్నాం. మేధావులు ఆలోచించాలి. నీళ్లని నిలవపెట్టడం ఎలాగ? తేలిక పద్ధతులు కావాలి. ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా నిలవ పెట్టడం ఎలాగ? భూగర్భ జలాల్ని పెంచడం ఎలా? ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

ఆంధ్రాకి చెరువుల వ్యవసాయ సంస్కృతి లేదు. పూర్వం నుంచీ నదులు, ఆనకట్టలు, కాలువలు ఉండ టంతో పంట కాలువలతో వ్యవసాయం చేసేవారు. తెలంగాణలో, రాయలసీమ జిల్లాల్లో చెరువుల వ్యవసాయం ఉంది. అక్కడ చెరువుల చెయిన్‌ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ ఉంటాయి. ఇప్పుడు నిండుకుండల్లా ఉండి, జలకళ సంతరించుకుని ఉండే రిజర్వాయర్లు ఒక్కసారి బావు రుమంటాయి. అడుగురాళ్లు బయటపడతాయి. ఇది తరచూ చూసే సమస్య.

ఇంత చిన్న సమస్యకి పరిష్కారమే లేదా? మళ్లీ అశోక చక్రవర్తిలా రంగంలోకి దిగి చెరువులు తవ్విం చాలి. ప్రతి గ్రామానికి కనీసం రెండు పెద్ద చెరువులు. ఎన్ని ఎకరాల వ్యవ సాయ భూమి ఉందో, అందుకు ఎంత పెద్ద చెరువులు అవసరమో గణించి ఏర్పాటు చెయ్యడం. అవి కబ్జా కాకుండా కాపాడటం. దీనికి అన్ని విధాలా రైతుల సహకారం అందిపుచ్చుకోవాలి. ఏటా వాటికి పూడికలు తీయాలి. గ్రామ పంచాయ తీల్లోని బంజర్లను, ప్రభుత్వ బీడు భూముల్ని, పొరంబోకుల్ని చెరువులుగా పునర్నిర్మించడం ఒక పద్ధతి. 
ఇన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లని సముద్రానికి వదలడం చాలా అన్యాయం. వంద సంవత్సరాలలో అవసరాల మేర నీళ్లని కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడమే. కొన్నేళ్లపాటు రాష్ట్ర బడ్జెట్‌ని వేరేవిధంగా తీర్చిదిద్దాలి. ఎక్కడికక్కడ అడ్డుగోడలు కట్టాలి. కనీసం ప్రైవేట్‌ చెరువులు లేదా రిజర్వాయర్లని అనుమతించాలి. రిలయన్స్‌ వారో, అమెజాన్‌ వారో, ఎక్కడికక్కడ నిలవచేసి హాయిగా మీటర్లు పెట్టి అమ్ముకుంటారు. అది బెటరు. వెంటనే జరిగే పని కూడా!



శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు