సంక్షేమ యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షసత్వం

8 Sep, 2021 01:04 IST|Sakshi

విశ్లేషణ

అసహనంతో ఉన్నవాళ్లు విచక్షణ కోల్పోతారు. ఒకప్పుడు తాము చేసిన వాదనలనే పూర్తిగా ఖండించుకుంటున్నామని మరిచిపోతారు. తెలుగుదేశం పార్టీకి గల ఈ అసహనానికి కారణం ఏమిటి? అధికారం కోల్పోయామన్న బాధ. అధికార వైసీపీకి ప్రజల్లో మంచిపేరు వస్తున్నదన్న దుగ్ధ. అందుకే ముఖ్యమంత్రి జగన్‌ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలి, ఆయన్ని ఎంత త్వరగా గద్దె దించాలి, దానికోసం ఏ వ్యవస్థల్ని మేనేజ్‌ చేయాలి, అవసరమైతే ఏయే అంశాల్ని తప్పుగా ప్రచారంలో పెట్టాలి... ఎంతసేపూ టీడీపీ నేతలకు ఇదే ఆలోచన. కానీ ఈ చర్యల ద్వారా సంక్షేమ యజ్ఞానికి అడ్డుపడుతున్న రాక్షసుల్లా మిగిలిపోతున్నామని మరిచిపోతున్నారు. ప్రజల మనసులను నిర్మాణాత్మకంగా కూడా గెలవొచ్చన్న సంగతిని విస్మరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుల విష యంలో కానీ, ఇతర అంశాలపై కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాలు రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతీయడం కోసమేనని ఆయన అన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గత రెండేళ్లుగా ప్రతి అవకాశాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద చల్లడానికి గట్టిగా వినియో గించుకుంటోంది. ఈ విషయంలో ఆయా వ్యవస్థలను కూడా టీడీపీ విజయవంతంగా వాడుకోగలుగుతోందన్నది వాస్తవం.

అందులో భాగంగానే తమకు సంబంధించిన వారితో కోర్టు కేసులు వేయిం చడం, ఆ సందర్భంలో కోర్టువారు చేసే వ్యాఖ్యలను తమ మీడియా ద్వారా ప్రచారం చేయించడం, ఇంకో వైపు కేంద్ర ప్రభుత్వానికి ఆయా అంశాలపై ఫిర్యాదులు పంపించడం మొదలైన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా వైసీపీ అసమ్మతి ఎంపీ ఒకరిని అడ్డు పెట్టుకుని నిత్యం ప్రభుత్వంపై ఉన్నవీ, లేనివీ ఆరోపణలు చేస్తూ కథ నడుపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. 

ఊపిరాడకుండా చేసే పన్నాగం
అయితే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈ విషయాన్ని అంచనా వేయడంలో కానీ, ఊహించడంలో కానీ అంతగా సఫలం అయిందని చెప్పజాలం. తన పని తాను చేసుకుంటూ, ప్రజలలో ఆదరణ ఉంది కదా అన్న భావనతో టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవి రానురాను ముదిరిపోయా యంటే ఆశ్చర్యం లేదు. ఏపీ సీఎం జగన్‌ ప్రభుత్వం ఎంతో కష్టపడి పలు పథకాలను అమలు చేస్తోంది. వాటిని బదనాం చేయడానికి టీడీపీ రకరకాల ఎత్తుగడలను వేసింది. అయితే అవి పెద్దగా ఫలించలేదు. దాంతో ఆ పార్టీ కొత్త రూటు వెతుక్కుంది. ఆయా వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో తనకు ఉన్న అనుభవాన్ని ప్రయోగించడం ఆరం భించింది. తద్వారా ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్టపాలు చేయ డంతో పాటు, ఉక్కిరిబిక్కిరి చేయాలని పన్నాగం వేసింది.

సచివాలయంలో కానీ, ఇతరత్రా కానీ తనకు మద్దతు ఇచ్చే వ్యక్తులను వాడుకుంటూ కొన్ని విశేష సమాచారాలను సేకరించి, వాటిని తనకు అనుకూలంగా మలచుకుంటూ వస్తోంది. ఏ ప్రభుత్వ ఉత్తర్వు అయినా రావడమే తరువాయి... ఆ వెంటనే ఆ జీవోపై కోర్టుకు వెళ్లడం పెద్ద ప్రాక్టీసుగా మార్చారు. తద్వారా ప్రభుత్వం ఏ విషయం లోనూ ముందుకు కదలకుండా చేసే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల లోకి కాకుండా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ ఖాతాలో వేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ వెంటనే దానికి టీడీపీ మీడియా పెట్టిన హెడ్డింగ్‌ ఏమిటి అంటే– ఓటు బ్యాంక్‌ పాలిటిక్స్‌ రివర్స్‌ అని! అంటే దాని అర్థం తెలుసుకోవడం కష్టం కాదు కదా! 

అధికారంలో ఉంటే ఒక వాదన
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అప్పులు చేస్తున్నట్లు విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోని ప్రముఖులకు ఏదో రూపంలో ఫిర్యాదులు పంపుతూ వైసీపీ ప్రభుత్వానికి చికాకు తెచ్చే యత్నం చేస్తున్నారు. దీంతో బుగ్గన చెప్పినట్లు– సహజంగానే ఏపీలో ఏదో జరగకూడనివి జరుగుతున్నాయన్న అనుమానాన్ని అటు కేంద్రం లోనూ, ఇటు ప్రజలలోనూ కలిగించడానికి టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు ప్రస్తావించాలి. 1999 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ కనెక్షన్లను  ఇచ్చే స్కీమ్‌ను తెచ్చింది. ఆ సందర్భంలో చంద్రబాబు ఎన్డీయేలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, కొన్ని ఎక్కువగా గ్యాస్‌ కనె క్షన్లను తెచ్చారు.

ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రోశయ్య, ఆ పథకం అమలులో జరుగుతున్న లోపాలు, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతే... చంద్రబాబు, ఆయన అనుయా యులు కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకు పడ్డారు. రాష్ట్రానికి వచ్చే ప్రయో జనాన్ని ప్రజలకు దక్కకుండా చేస్తోందని కాంగ్రెస్‌ మీద విమర్శలు సాగించారు. అలాగే ఎవరైనా కేంద్రానికి ఇంకే విషయంలో ఫిర్యాదు చేసినా వెంటనే అది రాష్ట్రానికి చేస్తున్న నష్టంగా ప్రచారం చేసేవారు. అప్పట్లో పనికి ఆహార పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన బియ్యంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ ఆరో పిస్తే కూడా అదే తరహా వ్యాఖ్యలను తెలుగుదేశం చేసింది. 

వ్యవస్థల సాయంతో ముందుకెళ్తాం
2014లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చాక, ఏ స్కీమ్‌ పైన అయినా ఎవరైనా కోర్టుకు వెళితే అదంతా వైసీపీ పనే అని చంద్ర బాబు ఆరోపించేవారు. తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడవే విమర్శలను బాబు టీమ్‌ ఎదుర్కుంటోంది. వైసీపీ మంత్రులు పలువురు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ–రాక్షసుల్లా టీడీపీ వారు ప్రతి దానికీ అడ్డు పడుతున్నారని అంటున్నారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఇబ్బం దులు రాలేదన్నది వాస్తవం. ఆయా వ్యవస్థలు ఆయనకు బాగానే సహకరించాయి. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అయినా బాబు మాత్రం వైసీపీ మీద విరుచుకుపడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు అండ్‌ టీమ్‌ ప్రజలలోకి వెళ్లడంకన్నా, ఆయా వ్యవస్థ లపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తమ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రం పాడైపోయినా ఫర్వాలేదనే తరహాలో టీడీపీ ఆలోచిస్తోందని మంత్రి బుగ్గన అన్నారు.

టీడీపీ తన దుర్మా ర్గానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడటం కోసం అప్పులు తీసుకొచ్చామని, తెలుగుదేశం హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని మంత్రి బుగ్గన అన్నారు. కరోనా కారణంగా పెరగాల్సిన ఆదాయం పడిపోయిందని, అందుకే ఈ పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోం దని, ఆ పార్టీ ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగు తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బుగ్గన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే విధంగా మరికొన్ని ఆధారాలను బహి ర్గతం చేసి ఉండాల్సింది. నిజంగా టీడీపీ ఏయే రకాలుగా ఏపీ ప్రయో జనాలకు విఘాతం కలిగిస్తోందో సోదాహరణంగా వివరిస్తే ప్రజలకు అర్థం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులను ఏ రకంగా వినియోగించింది స్పష్టంగానే చెబుతున్నారు. అదే తరుణంలో గత టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా అప్పులు చేసింది? వాటిని ఏ రకంగా వాడింది? దానివల్ల నష్టం ఏమి జరిగింది అన్నదానిపై బుగ్గన వివ రణాత్మక పత్రం విడుదల చేసి ఉండాల్సింది! 

అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి
తన హయాంలో జరిగినవాటిని కనబడకుండా చేస్తూ, టీడీపీ తనకు ఉన్న మీడియా అండద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని వాయువేగంతో చేయడానికి యత్నిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టీడీపీ... ప్రజాభిమానం కన్నా, ఆయా వ్యవస్థలలో తనకు ఉన్న మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాన్ని ఎక్కువగా నమ్ముకుంటోంది. అలాగే కొన్ని మీడియా సంస్థలపై ఆధారపడుతోంది. దీనిని ప్రజలు భవి ష్యత్తులో ఎలా అవగాహన చేసుకుంటారన్నది వేరే విషయం. తెలుగు దేశం పార్టీ నిజంగానే ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయతను దెబ్బతీస్తుంటే, అది ఎలా జరుగుతోందో పూర్తి స్థాయిలో బయటపెట్టే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. లేకుంటే ప్రభుత్వాన్ని పరోక్షంగా తెలుగు దేశం పార్టీనే శాసిస్తోందని, ఆయా వ్యవస్థలు పెత్తనం చేస్తున్నాయన్న అభిప్రాయం ప్రబలే అవకాశం ఉంది. కనుక వైసీపీ నేతలు ఈ విష యంలో తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలి సుమా!

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు