అభ్యర్థులు దొరకక... బరిలో నిలవలేక...

10 Apr, 2021 02:39 IST|Sakshi

సందర్భం

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజం. ప్రజల తీర్పును ఎవరైనా హుందాగా స్వీకరించా ల్సిందే. 40 యేళ్ల రాజకీయ అను భవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆ మాటను పదేపదే చెప్పుకొంటారే తప్ప, ఆ రాజకీయ పరిపక్వతను చేతల్లో చూపరు. 2014 ఎన్నికలలో కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం చేజారినా ఆనాడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వెంటనే ప్రజాతీర్పును శిరసావహిస్తామనీ, ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామనీ వినమ్రంగా తెలిపారు. కానీ చంద్రబాబు 2019 ఎన్నికలలో కేవలం 23 సీట్లకు పరిమితమైతే ‘మరీ ఇన్ని తక్కువ సీట్లా’ అంటూ ఆశ్చర్యం ప్రదర్శించారే తప్ప, ప్రజాతీర్పును గౌరవించ లేకపోయారు. ఆ ధోరణి ఇటీవల పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా చూపారు. పంచాయితీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాచి పనులు చేసు కోవడానికి ఇతర రాష్ట్రాలకు పోతున్నారంటూ సామాన్య ప్రజలను చులకన చేసి మాట్లాడారు.


రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పట్ల విసుగెత్తిపోయి దూరం జరిగారని అందదరికీ అర్థం అయిందిగానీ, తనకు అర్థం కానట్లు ఆయన నటిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లభించిన చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్రోషంతో, ఉడుకుమోతుతనంతో మాట్లాడుతున్న మాటలు ఆయన అపసవ్య మానసిక స్థితికి, దెబ్బతిన్న మానసిక స్థయిర్యానికి ప్రతీక. అధికార పార్టీ చేసే ప్రతి పనిని తప్పుపట్టాలని, వాటిని భూతద్దంతో సొంత మీడియాలో చూపించి ప్రజల సానుభూతి పొందాలని భావిస్తున్నారే తప్ప వేసిన తప్పటడుగుల్ని సరిచేసుకోవాలనే ఉద్దేశం ఎక్కడా కనబడదు.


చంద్రబాబు 2014–19 మధ్య అధికారంలో ఉండగా చేసిన తప్పులు సామాన్యమైనవి కావు. తెలంగాణలో అధి కారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి ‘ఓటుకు కోట్లు’ వంటి అనైతిక చర్యకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని తుడిచిపెట్టాలన్న దుర్బుద్ధితో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఆయన పరిభాషలోనే చెప్పాలంటే సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. అంతకుముందే ప్రతిపక్షనేత జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించారు. ప్రజ లందర్నీ సమానంగా చూడకుండా ఒక వర్గానికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించడానికి అమరావతి ప్రాంతంలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రజల్లో తన విశ్వసనీయతను తనే దెబ్బ తీసుకొన్నారు.

స్థానిక సంస్థలకు 2018లోనే ఎన్నికలు జరగాలి. కానీ, ఆనాడు తన పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి ఎన్నికలను జరపలేదు. అందుకు వంతపాడి నట్లుగా బాబు సొంతమనిషి రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కూడా మారు మాట్లాడలేదు. నిజానికి, దేశంలోని ఐదంచెల స్థానిక సంస్థలకు నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరిగి స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలన్న ఉద్దేశంతో 1992లో భారత పార్లమెంట్‌ 73, 74 రాజ్యాంగ సవరణలు తెచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు ఏర్పా టయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1992 తర్వాత రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిర్ణీత గడువులో ఎన్నికలు జరిగాయి. 


రాష్ట్ర విభజన అనంతరం, ఏడాదిలోగా తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు, కమిషనర్ల నియామకం సజావుగా సాగింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసింది. ఏడాదిన్నర తర్వాత జనవరి 30, 2016న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవస్థ ఏర్పాటైంది. అయితే, ఎన్నికల కమిషనర్‌ను మాత్రం నియమించలేదు. రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ వద్ద కార్యదర్శిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మార్చి 31, 2016న పదవీ విరమణ చేశారు. 24 గంటలు తిరగకముందే ఆయన్ని చంద్రబాబు కుర్చీలో కూర్బోబెట్టారు. తన సొంత మనిషిని నియమించడం కోసమే అంతకాలం వేచి చూశారన్నది స్పష్టం. స్థానిక సంస్థలకు గడువు పూర్తయినా ఎన్నికల కమిషనర్‌ నోరు విప్పలేదంటే అప్పటి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసినట్లు తేటతెల్లం అవుతోంది.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ అధికారంలో ఉన్నంతవరకూ ఆయనను కవచంగా పెట్టుకొని చంద్ర బాబు ప్రభుత్వంపై అధర్మ యుద్ధానికి దిగిన వైనం దేశమంతా చూసింది. మార్చి 15, 2020న రాష్ట్ర ప్రభుత్వంతోగానీ, ఏ రాజకీయ పార్టీతోగానీ సంప్రదించకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్‌. ఎంపీటీసీ స్థానాలు వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం కావడం చంద్రబాబు సహించలేక పోయారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు నిమ్మగడ్డ ఏకగ్రీవాలు జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ, ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో రూపొందిన వాస్తవం సీఐడీ దర్యాప్తులో బయటపడింది. ఎంపీటీసీ ఏకగ్రీవాలు బల వంతంగా జరిగివుంటే నిమ్మగడ్డ వెంటనే స్పందించి ఉండే వారు. కానీ తెలుగుదేశం అధినేత ఒత్తిడిపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారని స్పష్టంగా బయటపడింది.


పంచాయితీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్‌ ఎన్నిక లను నిర్వహించారు. మార్చి 31, 2021న పదవీ విరమణ చేసేముందు తగిన సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశానికి మేలు చేయాలన్న దురుద్దేశం నిమ్మగడ్డలో స్పష్టంగా కని పించింది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పాల్గొ నకుండా వాటిని బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం చేసిన ప్రకటన ఎవర్నీ ఆశ్చర్యపర్చలేదు. కనీసం అభ్యర్థులను నిలబెట్టలేక కొత్త డ్రామాకు తెర తీసింది. నిమ్మగడ్డ కమి షనర్‌గా ఉండగా తీసుకున్న నిర్ణయాలను సమర్థించిన తెలుగుదేశం నూతన కమిషనర్‌ నిర్ణయాలను తప్పు పట్టడం ద్వంద్వ నీతి. తమ తప్పులను కప్పిపుచ్చుకొని, తమ వైఫ ల్యాలకు కారణం ప్రజలేనని నిందించిన వారు చరిత్ర హీను లుగా మిగిలిపోయారు. ఇందుకు ఏ ఒక్కరూ అతీతం కాదని ప్రతిపక్షనేత గ్రహిస్తే మంచిది.


డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్‌ విప్, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌

మరిన్ని వార్తలు