సుయోధన – శిశుపాలీయం!

6 Jun, 2021 01:35 IST|Sakshi

జనతంత్రం

సందర్భం... ఇంద్రప్రస్థంలో ధర్మరాజు రాజసూయం. ఉత్స వాన్ని ఘనంగా చేయాలన్న సంకల్పంతో దేశంలో ఉన్న రాజు లందర్నీ పిలుస్తారు. ఛేది దేశానికి రాజుగా ఉన్నాడు కాబట్టి శిశుపాలుడికి కూడా ఆహ్వానమందుతుంది. ఇతగాడికి శ్రీకృష్ణు డంటే అస్సలు పడదు. అప్పటికే పలుమార్లు కృష్ణపరమాత్మను దూషించి ఉన్నాడు. విషయం తెలిసిన కృష్ణుడు సహనం పాటిస్తాడు. శిశుపాలుని తల్లి కృష్ణుడికి బంధువు. ఆమె ప్రార్ధన మేరకు శిశుపాలుని నూరు తప్పుల్ని క్షమించాలనుకుంటాడు. రాజసూయంలో అగ్రపూజను అందుకుంటున్న శ్రీకృష్ణుని చూడ గానే శిశుపాలుడు మళ్లీ రెచ్చిపోతాడు. తిట్ల దండకాన్ని పఠిం చడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో నూరు తప్పుల లక్ష్మణ రేఖను శిశుపాలుడు దాటేస్తాడు. హద్దు దాటగానే శ్రీకృష్ణుడు నాటి యుగధర్మం ప్రకారం అతడిని శిక్షిస్తాడు. సుదర్శన చక్రం శిశుపాలుని శిరస్సును ఖండిస్తుంది. అక్కడున్న రాజులందరూ శ్రీకృష్ణుని చర్యను జయజయధ్వానాలతో ఆమోదిస్తారు. దేశం లోని ప్రజలందరూ హర్షం ప్రకటిస్తారు.

శ్రీకృష్ణుడంటే పడనివాడు ఆరోజుల్లో శిశుపాలుడు ఒక్కడే కాదు. చాలామంది ఉన్నారు. ఆయన పాండవ పక్షపాతి కనుక దుర్యోధనాది కౌరవులందరికీ కృష్ణుడంటే కన్నెర్రే. కానీ, వారె వరూ శిశుపాలుని శిరచ్ఛేదాన్ని ఖండించలేదు. ఎందుకంటే ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా వున్నది. హద్దుమీరిన ఉన్మాదిని శిక్షించడం ధర్మసమ్మతం. నాటి దుర్యోధనాదులకు ప్రజాభిప్రాయాన్ని, ధర్మసమ్మతినీ ప్రభావితం చేయగల టెక్ని క్కులు తెలియవు. నేటి దుర్యోధనులకు ఈ విద్యలు తెలుసు. ఇందులో ఆరితేరిన శాస్త్రపారంగతుడెవరో తెలుగు ప్రజలందరికీ తెలుసు.

రాజకీయ నాయకులు కొందరు మీడియా దన్నుతో తమకు అనుకూలమైన రీతిలో ప్రజాభిప్రాయాన్ని మలచుకోగలుగు తున్న వైనాన్ని నోమ్‌ చామ్‌స్కీ అనే అమెరికన్‌ మేధావి బయట పెట్టారు. దీనికి ఆయన ‘ప్రజాసమ్మతిని తయారుచేసుకోవడం (manufacturing of consent)’ అనే పేరు పెట్టారు. ఇందు కోసం వార్తావ్యాఖ్యానాలను జనంలోకి చేరవేసే క్రమంలో రక రకాల రంగురంగుల ఫిల్టర్ల ద్వారా వడబోస్తారు. ఈ వడబోత వార్తలు (filter news) పెత్తందారి వర్గానికి అవసరమైన పద్ధతిలో ప్రజాసమ్మతిని రూపొందిస్తాయి. నాటి అమెరికా రాజ కీయ వ్యవస్థలో నడుస్తున్న ఈ వ్యవహారాన్ని ముప్పయ్యేళ్ల కింద టనే నోమ్‌ చామ్‌స్కీ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. 

హిట్లర్‌–గోబెల్స్‌ల కాలంలో జర్మనీలో పురుడుపోసుకున్న ఫిల్టర్‌ న్యూస్‌కు అమెరికన్లు 2జీ వెర్షన్‌ తయారుచేశారు. మన తెలుగువాడైన రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు 3జీ వెర్షన్‌ను కనిపెట్టడమే కాకుండా 4జీ, 5జీ పేటెంట్లు కూడా కొల్ల గొట్టి ఘనయశస్సును ఆర్జించారు. ఈ ఫిల్టర్‌ న్యూసే ఆయన పాలిటి ఆక్సిజన్‌. ఎందుకంటే, ఆయన అక్రమ మార్గంలో అధి కారంలోకి ప్రవేశించారు. పార్టీని కబ్జా చేశారు. ఇవి రెగ్యులరైజ్‌ చేసుకోవాలంటే తనకు అనుకూలమైన ఫిల్టర్‌ న్యూస్‌ అవసరం. అందువల్ల మీడియాపై నియంత్రణ కావాలి. సినిమా రంగంపై ఆధిపత్యం వహిస్తున్న రెండున్నర కోస్తా జిల్లాల పెత్తందారీ వర్గం చేతిలోనే మీడియా కూడా కేంద్రీకృతమైంది. ఎంతో సహ జంగా, సునాయాసంగా ఈ వర్గంతో చంద్రబాబుకు స్నేహం కుదిరింది. ‘మనసున మనసై–బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ’ అన్నాడో కవి. బాబుకూ, మీడియా మొఘల్స్‌కు ఆ రకమైన కెమిస్ట్రీ కుదిరింది.

అక్రమ పద్ధతుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని చెరబట్టింది ఏ పవిత్రాశయం కోసమో, ప్రజా సంక్షేమం కోసమో కాదు. కేవలం స్వార్థంకోసం. ఎన్టీ రామారావు తీసుకున్న ప్రజారంజక నిర్ణయా లను తిరగదోడిన నాడే ఈ విషయం బోధపడింది. అప్పుడ ప్పుడే మొలకెత్తిన దేశీయ కార్పొరేట్‌ శక్తులకు దళారీగా, ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా పనిలో కుదరడంతోనే ఆయన పవిత్రా శయం ఏమిటో జనానికి రూఢీ అయింది. రాజకీయ జీవిత లక్ష్యం స్వార్థం, ఎంచుకున్న మార్గం అక్రమం కనుక, ఆయన పొలిటికల్‌ కెరీర్‌ ఆసాంతం ‘ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు’ అవసర మవుతాయి. ఆయనకు ఆ గ్రహింపు వుంది. ఫిల్టర్‌ న్యూస్‌ ప్రసారం చేసే మీడియా ఎలాగూ వున్నది. అదొక్కటే సరిపోదు. అందుకని రాజ్యసంబంధమైన సమస్త ఉపాంగాల్లో, రాజ్యాంగ వ్యవస్థల్లో తనవారిని జొప్పించే కార్యక్రమాన్ని పాతికేళ్ల కిందనే ప్రారంభించారు. అలా ‘జొప్పితు’లైనవారు ఊడలు దిగిన వట వృక్షాలుగా ఎదిగేందుకు తనవంతు లాబీయింగ్‌ను విసుగు లేకుండా నడిపించారు.

భూమిపైగానీ, ఆకాశంలో గానీ, నీటిలో గానీ, ఎటువంటి ఆయుధం చేతగానీ, మనిషి చేతిలోగానీ, మృగం చేతిలో గానీ తనకు చావులేని విధంగా వరాలు పొందిన హిరణ్యకశపుడి మాదిరిగా చంద్రబాబు తన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఏ వ్యవస్థ నుంచీ తనకు ముప్పు రాకుండా ఓ వ్యూహాన్ని అమలు చేసుకున్నాడు. కానీ, సోషల్‌ మీడియా విస్ఫోటనంతో ఈ ఏర్పాట్లన్నీ జనానికి తెలిసి పోతున్నాయి. చంద్రబాబుగారి సినిమాలు ఇప్పుడు అంత బాగా ఆడటం లేదు. ఏ సినిమా ముగింపు ఏమిటో సోషల్‌ మీడియాలో ముందుగానే వచ్చేస్తున్నది. ఆయనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధమున్న ఏవార్తయినా సరే ఏ పత్రికలో ఎలా వస్తుందో, ఏ చానెల్‌లో ఎలా ప్రసారమవుతుందో ముందుగానే చెప్పేస్తు న్నారు. ఆయన మీద ఎక్కడైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే, అక్క డ్నించి ఏరకమైన తీర్పు వెలువడుతుందో ముందుగానే జోస్యం చెబుతున్నారు. తన సంబంధ బాంధవ్యాల బండారం అంతా బట్టబయలు వ్యవహారంగా మారింది. ఏదో ఒక సిగ్గుబిళ్ల తక్షణం కావాలి. ఎలా?

ఆలోచించగా చించగా, ఎల్లో సిండికేట్‌గా లబ్ధప్రతిష్టులైన బాబు కోటరీ సభ్యులకు ఒక ఉపాయం తట్టింది. పచ్చ కండువా వేయనివాడు, అధికార పార్టీలో బతికి చెడి, బజారుకెక్కినవాడు, సిగ్గుపడకుండా ఇచ్చిన ‘కాంట్రాక్టు పని’ చేసేవాడు ఒకరో ఇద్దరో కావాలి. తొలుత ఇటీవల చనిపోయిన ఉత్తరాంధ్ర నాయ కుడిని వాడుకున్నారు. ఆయనకు దిగ్గజ విశ్లేషకుడు అనే బిరుదు నిచ్చి తమక్కావలసినవి చెప్పించుకునేవారు. ఆయనతోపాటు రాజు కాని రాజు తరాజుగారొకరు సిండికేట్‌కు దొరికారు. తరాజుగారు వాడే భాష, సంజ్ఞాపూర్వక హావభావాలు చూస్తే సిగ్గుబిళ్ల కూడా సిగ్గుపడవలసిందే. శిశుపాలుడే గనక ఇప్పుడు బతికి ఉన్నట్లయితే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు.

రెండు చానెళ్లవారు ఈ రాజుగారికి ప్రతిరోజూ ఓ గంటో అరగంటో ప్రత్యేక సమయాన్ని ప్రైమ్‌టైమ్‌లో కేటాయించేవారు. పండితులు ప్రవచనాలు చెప్పినంత శ్రద్ధగా ఈయన బూతు వాచకం చదివేవారు. వాచకంతోపాటు ఆంగికాన్ని కూడా జత కలిపేవారు. ఇంతకూ వీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. పేరుకు పార్లమెంట్‌ సభ్యుడే అయినా, ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఎన్నాళ్లయిందో తెలియదు. ఎవరికీ అధికార ప్రతి నిధీ కాదు. పైగా గొప్ప వ్యక్తిత్వంగలవాడా అంటే అదీ కాదు, వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి అప్రతిష్ట మూట కట్టుకున్నవాడు. ఎందుకని ఈ రాజుగారి పంచాంగ పఠన కార్య క్రమానికి ఆ న్యూస్‌ ఛానెళ్లు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్టు?. ఎందుకంటే, ఎల్లోసిండికేట్‌ తయారుచేసిన స్క్రిప్టు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార పార్టీ పెద్దల మీద, చివరికి ముఖ్య మంత్రి మీద కూడా నిందాపూర్వకంగా మాట్లాడతాడు కనుక. నెలల తరబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరకు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యానాలకు కూడా రాజుగారు దిగజారిపోయారు. కులాలను, మతాలను, ప్రముఖ వ్యక్తులను కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారు. ఎంతో నిష్టతో సదరు ఛానళ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఫిర్యాదులందుకున్న మీదట పోలీసులు ఎంపీ మీదా, ఆ ఛానళ్ల మీద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఐపీసీ 124 ఏ అనే సెక్షన్‌ కూడా ఉన్నది. ‘మాటల ద్వారా గానీ, సైగల ద్వారా గానీ విద్వేషాలను, ఎన్నికైన ప్రభుత్వంపై వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే వారు ఈ సెక్షన్‌ ప్రకారం శిక్షార్హులు. ఎంపీ రోజువారీ టీవీ కార్యక్రమాలకు సరిగ్గా సరిపోయేవిధంగా ఉన్నందువల్ల బహుశా పోలీసులు ఈ సెక్షన్‌ను పెట్టి ఉండవచ్చు.

ఇది బ్రిటిష్‌ కాలం నాటి చట్టమే. కాదనేవారెవరూ లేరు. కానీ ఇప్పటికీ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో భాగంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లోనే రెండేళ్ల కిందటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయాంలో ఇరవైకి పైగా ఈ (రాజద్రోహం) కేసులను పెట్టించారని ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత మంత్రి ఒకరు వివరాలతో సహా బయటపెట్టారు. ఎవరి మీద ఆయన ఈ కేసులు పెట్టించారో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద రాజద్రోహం కేసు పెట్టారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం ఐదు కోట్లు ఆఫర్‌ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా ఆడియో వీడియోల సాక్షిగా దొరికిపోయిన అనంతరం ఉక్రో షంతో ఈ కేసులను పెట్టించారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మె ల్యేగా ఎన్నికైన గిడ్డి ఈశ్వరిని కూడా రాజద్రోహం కేసుతో బెది రించి, డబ్బులు ఆశచూపి, తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా సొంత ప్రయోజనాలకోసం రాజద్రోహం కేసును ఉపయోగిం చుకున్న నేపథ్యం చంద్రబాబు పార్టీకి ఉన్నది.

ఇప్పుడు ఎంపీ ప్రవర్తనపై ఏపీ పోలీసులు మోపిన కేసుపై జాతీయ స్థాయిలో ప్రచారానికి టీడీపీ తెరతీసింది. జాతీయ మీడియాకూ, కొందరు మేధావులకు తమకు అవసరమైన మేరకు మాత్రమే అర్ధ సమాచారాన్ని ఇచ్చి మోసగిస్తున్నది. సదరు ఎంపీ సైతం అరెస్ట్‌ దగ్గర నుంచి బెయిల్‌ వరకు ప్రద ర్శించిన నాటకీయతను ప్రజలంతా గమనించారు. బెయిల్‌ను మంజూరుచేస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ కేసును గురించి మాట్లాడవద్దని ఎంపీని ఆదేశించింది. అందుకు విరుద్ధంగా పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ సాటి ఎంపీ లకు లేఖలు రాస్తూ వాటిని మీడియాలో వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకుంటూ కోర్టు ధిక్కారానికి ఆయన పాల్పడుతున్నారు. పోలీసులు సాధారణ నేరస్తులపైనే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం మానేసి ఏళ్లు గడుస్తున్నది. అలాంటిది పార్లమెంట్‌ సభ్యుడిపై ప్రయోగించారంటే ఎవరైనా నమ్ముతారా? అందులోనూ ఢిల్లీలో తరచుగా పెద్దపెద్ద పార్టీలు ఇస్తూ వాటికి కేంద్ర మంత్రులను కూడా పిలుచుకునే హైప్రొఫైల్‌ ఎంపీపై ఏ పోలీసైనా చేయి చేసుకుంటాడా? పోనీ, కాలో, కర్రో చేసుకోగలరా?

ఈ కేసును ఎల్లో సిండికేట్‌ సుప్రీంకోర్టు దాకా లాగింది. ఈ చట్టంపై భాష్యం చెప్పవలసిన సమయం వచ్చిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తాము ఆ పని చేయదలచు కున్నట్టు చెబుతూ కేసును వాయిదా వేసింది. సంతోషించవల సిన విషయం. బ్రిటీష్‌ కాలం నాటి వలసపాలన చట్టాన్ని ఆసాంతం రద్దుచేసినా స్వాగతించవలసిందే. కాలం చెల్లిన చట్టాలను రద్దుచేస్తామని చెప్పిన ఎన్‌డీఏ ఇంతవరకూ ఎందుకో వాటి జోలికి పోలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటూనే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు సమాజంలోని కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టకుండా ఉండేలా ఎటువంటి శిక్షలు విధించాలో కూడా మార్గదర్శన చేయవలసిన అవసరం ఉన్నది.

ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కులకు భంగం వాటిల్లుతున్నదనీ, పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తున్నదని ఒక విష ప్రచారాన్ని జాతీయస్థాయిలో నిర్వహించడానికి ఎల్లో సిండికేట్‌ ఒక పథ కాన్ని రచించింది. ఆ పథకాన్ని అమలుచేయడానికి ఎంపిక చేసు కున్న సందర్భం చూడండి. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతిభావంతంగా వ్యవహరించిందని ప్రశంస లనందుకున్న సందర్భం. సుస్థిర అభివృద్ధి పయనంలో అగ్ర శ్రేణిలో నిలబడిందని నీతిఆయోగ్‌ నిర్ధారించిన సమయం. ప్రపంచంలోని ఏ దేశంలో ఎప్పుడు ఎరుగని విధంగా పేద ప్రజలకు 30 లక్షల ఆహ్లాదకరమైన గృహాలను ఆరోగ్యకరమైన పరిసరాలతో నిర్మించి ఇవ్వడానికి ముహూర్తం పెట్టుకున్న సమయం. ఇప్పుడున్న మార్కెట్‌ అంచనాల ప్రకారం ఇళ్ల నిర్మాణం, కాలనీల్లో మౌలిక వసతుల పరికల్పన పూర్తయిన తర్వాత ఒక్కో ఇల్లు సుమారు 15 లక్షల రూపాయల విలువ చేస్తుంది. మొత్తం 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదింటి ఆడబిడ్డలకు నాలు గున్నర లక్షల కోట్ల విలువైన ఆస్తిని పసుపుకుంకుమల కింద అందజేసిన వారవుతారు. ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రారంభమైన విప్లవాత్మక సంస్కరణలకు పెను సామాజిక విప్లవానికి బాటలు వేసే గృహనిర్మాణం తోడు కాబో తున్నది. పర్యవసానాలు తెలుసు కనుకే, ప్రతిపక్ష నేత ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై మాయతెరలు కప్పి జాతీయ స్థాయిలో ఇంద్రజాల ప్రదర్శనకు పూనుకున్నారు.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు