World English Day 2022: ఆంగ్లంతోనే అనుసంధానం

23 Apr, 2022 14:33 IST|Sakshi

సుమారు 1500 సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా మూడు తెగలు మాత్రమే ఆంగ్లాన్ని మాట్లాడేవి. ఈ రోజు అనేక దేశాలలో ఆంగ్లం అధికార భాషగా చలామణి అవుతోంది. పది దేశాలలో ఇది ప్రత్యేక భాష హోదా పొందింది. దాదాపు వందకు పైగా  దేశాలలో ఇంగ్లిష్‌ ప్రథమ భాషగా ఉంది. కోట్లాది మంది ప్రజలు ఇంగ్లిష్‌ను మాతృభాషగా కలిగి ఉన్నారు. 

ఒకప్పుడు గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, సంస్కృతం గొప్ప భాషలుగా, రాజ భాషలుగా చలామణి అయ్యాయి. బ్రిటిష్‌ వారు అనుసరించిన వలస విధానం వలన ఆంగ్లం అంతర్జాతీయ భాషగా ఎదిగింది. షేక్‌స్పియర్, జీబీ షా, టీఎస్‌ ఇలియట్‌ వంటి ఎందరో రచయితలు ఆంగ్లంలో గొప్ప రచనలు చేసి ఆంగ్లభాషకి వన్నె తెచ్చారు. ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటవులో ప్రతి సంవత్సరం 1000కి పైగా పదాలు కొత్తగా చేరతాయి. 

మధ్యయుగంలో సామ్రాజ్య వాదానికీ, మత వ్యాప్తికీ ఆంగ్లం దోహదపడగా; ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాలకు ఊతం ఇచ్చింది. రవీంద్రనాధ్‌ టాగూర్, ఆర్‌కే నారాయణన్, సరోజినీ నాయుడు వంటి భారతీయ రచయితలు ఇంగ్లిష్‌లో రచనలు చేసి ఆ భాషని సుసంపన్నం చేశారు. ఏ భాషకైనా రచనలే ఊపిరి. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం)

అయితే ఆంగ్ల భాషా ప్రవాహంలో ప్రాంతీయ భాషలు కొట్టుకుపోకుండా చూడాలి. పేద విద్యార్థులకు ఆంగ్లంలో నాణ్యమైన విద్య అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు నిఘంటువులని పంపిణీ చేస్తున్నది. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంగ్లాన్ని ఉద్యోగ ఉపాధి వనరులని కల్పించే భాషగానే చూడకుండా ప్రపంచ చరిత్ర, వర్తమాన పరిస్థితులు తెలుసుకునేందుకు ఉపయోగపడే అనుసంధాన భాషగా చూడాలి.

– ఎం. రాంప్రదీప్‌ 
ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్, తిరువూరు
(ఏప్రిల్‌ 23న ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవం

మరిన్ని వార్తలు