కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పప్పుశనగ కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను రైతులు వినియోగించుకోవా లని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఆర్.జె.కృష్ణారావు కోరారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. క్వింటా రూ.5,335 ప్రకారం 8 కేంద్రాల ద్వారా పప్పు శనగ కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. మంగళగిరి, తాడికొండ, ఫిరంగిపురం, గుంటూరు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమానులలో ఆయా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సీఎం యాప్లో 456 మంది రైతుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. వ్యర్ధ పదార్ధాలు ఒక శాతానికి మించి ఉండకూడదని, అలాగే తేమ 14 శాతం మించి ఉండకూడదని వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చిన పప్పుశనగను కొనుగోలు చేసి సకాలంలో ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఈ సీజన్లో 2,500 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు అనుమతులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.