నరసరావుపేట: వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల రెవెన్యూ గ్రామం వరుసపెంటలో సుమారు 200 నుంచి 250 మంది రైతులకు అసైన్డ్ పట్టాల మంజూరుకై సంబంధిత రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి భూములు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. జిల్లాలో గత శుక్రవారం వినూత్నంగా చేపట్టిన ‘గ్రామోదయం‘ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సంబంధిత మండల అధికారులతో కలిసి వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి గురువారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ నుంచి ఆన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామంలో 20 కుటుంబాలు చేపల వేటవృత్తిలో ఉండగా వారిని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని, ఈ విషయంపై తక్షణమే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సర్వేచేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శిరిగిరిపాడు గ్రామానికి సంబంధించి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి అసైన్డ్ పట్టాలు అందించేలా రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్త సర్వే చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. రచ్చమల్లపాడు గ్రామంలో సుమారు 50 నుంచి 200 మంది రైతులు అటవీ భూములలో సాగు చేసుకుంటున్నారని వారికి హద్దులు చూపించడంతోపాటు అసైన్డ్ పట్టాలు అందజేసేలా అధికారులు సంయుక్త సర్వే చేయాలని ఆదేశించారు. గుండ్లపాడులో సుమారు 200 ఎకరాలలో అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ రైతులకు హద్దులు చూపించే విధంగా రాళ్లు నాటించాలని దీనిపై రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మందాడి గ్రామంలో 1226.56 ఎకరాల భూభాగం గుర్తించడం జరిగిందని డీఫారెస్టేషన్ అనంతరం 224 ఎకరాల 29 సెంట్లు భూభాగానికి హద్దులు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
మానసిక వైద్యులను నియమించాలి ..
నరసరావుపేట: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కలిగి గుండెజబ్బులకు చికిత్సలు చేసే హాస్పిటళ్లలో పేషెంట్లకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిక వైద్య నిపుణులను నియమించాలని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్యసేవలపై జిల్లా డిసిప్లేనరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నమోదైన 15 ఫిర్యాదులను కమిటీ సభ్యులు విచారించి పరిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యసేవలు అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి డాక్టర్ బీవీ రంగారావు, జిల్లా డెప్యూటీ వైద్యాధికారి డాక్టర్ జి.చంద్రశేఖర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజకృష్ణ, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్ డాక్టర్ పి.సునీల పాల్గొన్నారు.
లక్ష్యానికి మించి ‘ఉపాధి’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో ఉపాధిహామీ పనిదినాలు లక్ష్యానికి మించి జరుగుతున్నాయి. ఈ ఏడాది లక్ష్యం 27 లక్షల పనిదినాలుగా నిర్ణయించగా ఇప్పటికే 2,914 లక్షల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఈ నెలాఖరుకు 30 లక్షల పనిదినాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 10,794 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 97.99 శాతం, 2019–20లో 86.15 శాతం, 2020–21లో వంద శాతం, 2021–22లో 101.26 శాతం పనులు పూర్తికాగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 107.94 శాతం పూర్తి అయ్యింది. నెలాఖరుకు ఇదిమరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి గాను రూ.62 కోట్ల వేతనంగా చెల్లించారు. ప్రాధాన్యతా భవనాల నిర్మాణం కోసం రూ.11.13 కోట్లు, ప్రాధాన్యతేతర భవనాల నిర్మాణం కోసం రూ.9.95 కోట్లు, ఇతర విభాగాల పనుల కోసం రూ.17.55 కోట్లు చెల్లించారు. జగనన్న కాలనీల్లో లెవలింగ్ కోసం రూ.32 కోట్లు చెల్లించడం జరిగింది. ఈ విధంగా మొత్తం రూ.70.63 కోట్లు చెల్లించగా మరో రూ.17.61 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రూ.9.99 కోట్లకు ప్రభుత్వ ఆమోదం లభించడంతో ఈ నెలఖరులోపు చెల్లించే అవకాశం ఉంది. మిగిలిన రూ.7.62 కోట్లు ఏప్రిల్లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించడం డ్వామా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
జిల్లాలో 1.25 లక్షల జాబ్కార్డులు..
జిల్లాలో 277 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 1.25 లక్షల జాబ్కార్డులు ఉండగా, 2.12 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఇందులో యాక్టివ్గా ఉన్న జాబ్కార్డులు 84 లక్షలు కాగా 1.43 లక్షల మంది కార్మికులు ఉపాధిహామీ పనులకు హాజరు అవుతున్నారు. ఇందులో 46 వేలమంది ఎస్సీ వర్గానికి చెందినవారు కాగా, మూడువేల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ప్రతి కుటుంబానికి సగటున 41.31 రోజులు పని కల్పించారు. మహిళలకు ఎక్కువగా 58.19 రోజులు పని కల్పించారు. సగటున ఒక్కొక్కరికి రోజుకు రూ. 212.70 ఉపాధిహామీ కింద అందింది. 802 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నాయి. ఆయా పనులకు సంబంధించిన సామాజిక తనిఖీలు కూడా ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ప్రతి రోజూ ఒక మండలాన్ని ఎంచుకుని ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు డ్వామా ప్రాజెక్టు అధికారి ఎం.యుగంధర్కుమార్ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.
● జగన్మాతకు పుష్పాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గమ్మకు ఎర్రగులాబీలు, కనకాంబరాలతో అర్చన చేశారు. లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద ప్రతిష్టించిన దుర్గమ్మ ఉత్సవ మూర్తికి ఈ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారికి జరుగుతున్న విశేష పుష్పార్చనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేదిక వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా భక్తులకు ఆశీర్వచనం అందజేసిన అర్చకులు వారికి పుష్పాలను బహూకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ
సమర్థంగా సంక్షేమ పథకాల అమలు
నరసరావుపేట: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత అధికారులంతా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా జగనన్న భుహక్కు, భూ రక్ష పథకం ద్వారా జరుగుతున్న రీ–సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూ హక్కుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్), భూ హక్కు పత్రాల పంపిణీ, సర్వే కొలతల దరఖాస్తుల పరిశీలన – పరిష్కారం, వ్యవసాయ భూముల పంపిణీ, వన్ టైం కన్వర్షన్ పనులు వందశాతం పూర్తి చేయాలన్నారు. రీ–సర్వేకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కారం చుపాలన్నారు. జిల్లాలో పలుచోట్ల లంక భూములు ఉన్నాయని వాటిపై వెంటనే విచారణ నిర్వహించి అర్హత కల్గినవారికి పట్టాలు మంజూరు చెయ్యాలన్నారు. ప్రభుత్వ భూముల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నవాటిని గుర్తించి అర్హత కలిగిన రైతులకు పట్టాలు మంజూరు చేయ్యాలన్నారు. సాదా బైనామా భూముల అగ్రిమెంట్పై కొనసాగుతున్న భూములను పరిశీలన చేసి వారికి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ త్వరితంగా చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం వారం రోజులు సమయం తీసుకోవాలని సూచించారు. సివిల్ సప్లయ్ విభాగంలో ఇటీవల ఒకే కుటుంబానికి రెండు రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించడం జరగిందని, వాటిపై సకాలంలో విచారణ నిర్వహించి వారికి అవసరమైన ఒక్క రేషన్ కార్డ్ను ఉంచి మిగతా కార్డును తొలిగించాలన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలు జరగకుండా సక్రమ రేషన్ పంపిణీ జరిగేలా రేషన్ పంపిణీ వాహన దారులకు అవగాహన కల్పించాలని జేసీ సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి, ఏడీ సర్వే విభాగం అధికారి, కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
విద్యార్థులపై మాల్ ప్రాక్టీసు కేసులు
ఉర్దూ పాఠశాలల
పనివేళల్లో మార్పులు
రంజాన్ మాసం దృష్ట్యా
మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉర్దూ మీడియంలో నడుస్తున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు ఉర్దూ మీడియం డైట్ కళాశాలలు శుక్రవారం నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ఆచరిస్తూ, ప్రార్థనల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తులతో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవడంపై మైనార్టీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జేబులో స్లిప్పులు పెట్టుకుని ఇంటర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఐదుగురు విద్యార్థులపై అధికారులు మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు చేశారు. గురువారం జూనియర్ ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్ 1బీ, జువాలజీ, హిస్టరీ పేపర్–1 పరీక్షలు జరిగాయి. గుంటూరు అమరావతిరోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ 1బీ పరీక్ష రాస్తూ కాపీయింగ్కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులతో పాటు గోరంట్లలోని శ్రీచైతన్య, చిలకలూరిపేటలోని ఏఎంజీ జూనియర్ కళాశాలల్లో మరో ఇద్దరిని చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు గుర్తించారు. కాపీయింగ్కు పాల్పడుతున్న వీరిపై మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు చేసిన అధికారులు పరీక్షల నుంచి డీబార్ చేశారు. గురువారం జరిగిన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల పరిధిలో కేటాయించిన 46,763 మంది విద్యార్థుల్లో 45,614 మంది హాజరయ్యారు. 84 పరీక్ష కేంద్రాల్లో అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తనిఖీ చేశారు.కలెక్టర్ వెంట ఆర్ఐఓ జి. సునీత ఉన్నారు.
బడి పిల్లల డ్రాపవుట్స్ తగ్గాయి..
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బడి పిల్లల డ్రాప్ అవుట్లు తగ్గుముఖం పట్టాయని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
గుంటూరు జిల్లాలో 30 లక్షల పని దినాలు బిల్లుల చెల్లింపులోనూ ముందంజ ఇప్పటికే రూ.70.63 కోట్లు చెల్లింపులు ఈ నెలాఖరులోపు మరో రూ.10కోట్లు ప్రాధాన్యత భవనాలకు రూ.11. 13 కోట్లు ఇతర భవనాలకు రూ.9.95 కోట్లు జగనన్న కాలనీల లెవలింగ్కు రూ.32 కోట్లు చెల్లింపులు
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
స్లిప్పులతో వచ్చిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు డీబార్ గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్