కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో రూ.7 కోట్ల నూతన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు యార్డు చైర్మన్ మద్దిరెడ్డి సుధాకరరెడ్డి చెప్పారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మిర్చి యార్డు పాలకవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం సమావేశంలో చర్చించిన విషయాలను ఆయన మీడియాకు వివరించారు. మిర్చి యార్డును సుందరవనంగా తీర్చి దిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డును అన్ని రంగాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తామన్నారు. యార్డుకు వచ్చే మిర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ధర లభించేలా చూస్తామని వెల్లడించారు. రైతులు, వ్యాపారులు, హమాలీలకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఏడాది మార్కెట్ ఫీజు గత ఏడాదితో పోలీస్తే భారీగా పెరిగిందని, గత ఏడాది రూ.63 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.87 కోట్లు వసూలు చేయడం జరిగిందని, ఈ నెల చివరి నాటికి రూ.90 కోట్లు వసూలు చేయడం జరుగుతుందన్నారు. 2023– 24 ఆర్ధిక సంవత్సరంలో రూ.100 కోట్లు మార్కెట్ ఫీజు లక్ష్యంగా పాలకవర్గం, అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అనంతరం చైర్మన్ మద్దిరెడ్డి సుధాకరరెడ్డిని ఎక్స్ఫిషియో సభ్యుని హోదాలో సమావేశానికి హాజరైన గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్నాయుడు దుశ్శాలువతో సత్కరించారు. సమావేశంలో మేయర్ కావటి శివనాగ మనోహర్నాయుడు, యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
వచ్చే ఏడాది రూ.100 కోట్ల మార్కెట్ ఫీజు లక్ష్యం మిర్చి యార్డు పాలకవర్గ సమావేశంలో చైర్మన్ సుధాకరరెడ్డి