తాడేపల్లిరూరల్: సహజ వెంటిలేటెడ్ పాలీహౌస్లో అన్ని అరుదైన పంటలను పండించవచ్చని గుంటూరు జిల్లా ఉద్యానవన వ్యవసాయ అధికారిణి సుజాత అన్నారు. శుక్రవారం ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పాలీహౌస్ను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సహజ వెంటిలేటెడ్ పాలీహౌస్లో అన్ని కాలాలలో సహజసిద్ధంగా అరుదైన పంటలను పండివచ్చని, అత్యంత ఖరీదైన పూలు, పండ్లు పండించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేఎల్యూ ఈఫ్ వైస్ చైర్మన్ కోనేరు రాజా హరీన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో 10600 చదరపు అడుగుల విస్తీర్ణంలో సహజ వెంటిలేటెడ్ పాలీహౌస్ను ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు అవకాశముంటుందన్నారు. భారతదేశంలో ఎనభై శాతం ఉన్న వ్యవసాయానికి తమ విశ్వవిద్యాలయం తరుపున ఆధునిక టెక్నాలజీని అందించడానికి ఇప్పటికే అనేక పరిశోధనలు చేశామన్నారు. పంటలకు తెగుళ్లు సోకినా, నీరు ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా కేఎల్యూ విద్యార్థులు పొలానికి అనుసంధానం చేసిన ఐఓటీ సెన్సార్ పరికరం ద్వారా రైతు మొబైల్కు సమాచారం వస్తుందన్నారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ, ప్రొ.వి.సి.డాక్టర్ ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్బాబు, పి అండ్ డి డీన్ డాక్టర్ వి. రాజేష్, వ్యవసాయ హానర్స్ విభాగ అధిపతి డాక్టర్ సింథెల్, డాక్టర్ కె.సి.హెచ్. శ్రీకావ్య పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సుజాత